నవాల్గలో హోటల్ దగ్ధం
ABN , Publish Date - Mar 12 , 2024 | 12:17 AM
నవాల్గలోని మహేందర్రెడ్డి కాలనీలో ఆదివారం రాత్రి అగ్నిప్రమాదం సంభవించింది. ఓ హోటల్లో మంటలు చెలరేగి ఓ దివ్యాంగుడి కుటుంబం ఉపాధి కోల్పోయింది.
![నవాల్గలో హోటల్ దగ్ధం](https://www.andhrajyothy.com/assets/images/defaultImg.jpeg)
ఉపాధి కోల్పోయిన దివ్యాంగుడి కుటుంబం
బషీరాబాద్, మార్చి 11: నవాల్గలోని మహేందర్రెడ్డి కాలనీలో ఆదివారం రాత్రి అగ్నిప్రమాదం సంభవించింది. ఓ హోటల్లో మంటలు చెలరేగి ఓ దివ్యాంగుడి కుటుంబం ఉపాధి కోల్పోయింది. ఈ ఘటన బషీరాబాద్ మండలం నవాల్గ గ్రామం మహేందర్రెడ్డి కాలనీలో ఆదివారం అర్ధరాత్రి చోటుచేసుకుంది. బాధిత కుటుంబసభ్యుల కథనం ప్రకారం.. గ్రామానికి చెందిన నరేందర్ (దివ్యాంగుడు) తన భార్య రాములమ్మతో కలిసి కట్ట్టెల షెడ్డులో హోటల్ ఏర్పాటు చేసుకుని జీవనం సాగిస్తున్నాడు. ఆదివారం రాత్రి అక్కడే తన సోదరి ఇంట్లో కుటుంబంతో కలిసి నిద్రిస్తుండగా పక్కనే ఉన్న హోటల్కు మంటలు ఉవ్వెత్తున చెలరేగాయి. చుట్టూ పొగలు వ్యాపించడంతో సమీప ఇళ్ల ప్రజలు బయటకు వచ్చి దివ్యాంగుడిని అప్రమత్తం చేసి మంటలు ఆర్పే ప్రయత్నం చేశారు. అప్పటికే హోటల్ పూర్తిగా మంటలో దగ్ధమైంది. అందులోని ఇతర సామగ్రి పూర్తిగా మంటల్లో దగ్ధమయ్యాయి. బాధితుడు బషీరాబాద్ పోలీసులను ఆశ్రయించాడు. ఎవరో కావాలనే తన హోటల్కు నిప్పుపెట్టి ఉంటారని అనుమానం వ్యక్తం చేశాడు. బాధితున్ని ప్రభుత్వం అదుకోవాలని వికలాంగుల సంఘం బషీరాబాద్ మండల అధ్యక్షుడు చెరుకు రాజుగౌడ్ ఒక ప్రకటనలో కోరారు.