జేపీ దర్గాలో వైభవంగా గంధోత్సవం
ABN , Publish Date - Jan 18 , 2024 | 11:01 PM
హజ్రత్ జహంగీర్పీర్ దర్గా ఉర్సు గురువారం వైభవంగా ప్రారంభమైంది. మొదటి రోజు ఉత్సవాల్లో భాగంగా గంధోత్సవ కార్యక్రమాన్ని రాష్ట్ర వక్ఫ్బోర్డు ఆధ్వర్యంలో గురువారం రాత్రి అత్యంత ఘనంగా నిర్వహించారు.
ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్, వంశీచంద్రెడ్డి హాజరు
వేలాదిగా తరలివచ్చిన భక్తులు
దర్గా ఆవరణలో ఏర్పాటు చేసిన గంధం బాక్స్లకు
కొత్తూర్, జనవరి 18 : హజ్రత్ జహంగీర్పీర్ దర్గా ఉర్సు గురువారం వైభవంగా ప్రారంభమైంది. మొదటి రోజు ఉత్సవాల్లో భాగంగా గంధోత్సవ కార్యక్రమాన్ని రాష్ట్ర వక్ఫ్బోర్డు ఆధ్వర్యంలో గురువారం రాత్రి అత్యంత ఘనంగా నిర్వహించారు. కొత్తూరు మండలం ఇన్ముల్నర్వ గ్రామ శివారులో గల హజ్రత్ జహంగీర్పీర్ దర్గాలో నిర్వహించిన గంధోత్సవంలో వేలాది మంది భక్తులు హాజరై మొక్కులు తీర్చుకున్నారు. ముఖ్య అతిథిగా షాద్నగర్ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్, ప్రత్యేక ఆహ్వానితులుగా సీడబ్యూసీ మెంబర్ వంశీచంద్రెడ్డి హాజరయ్యారు. వీర్లపల్లి శంకర్, వంశీచంద్రెడ్డి, షాద్నగర్ మాజీ ఎమ్మెల్యే చౌలపల్లి ప్రతా్పరెడ్డి, రాష్ట్ర వక్ఫ్బోర్డు అసిస్టెంట్ సెక్రటరీ హమీద్ అహ్మద్తో పాటు పలువురు గంధాన్ని శిరస్సుపై ఉంచుకొని మేళాతాళాలతో ఉరేగింపుగా వెళ్లి దర్గాకు సమర్పించారు. ఆనంతరం ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. అంతకుముందు దర్గా అవరణలోని సమావేశ హాల్లో పలువురు ముస్లిం మత పెద్దలు గంధానికి ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. అక్కడ ఏర్పాటు చేసిన ఖవాలీ పలువురిని ఆకట్టుకుంది. ఈ సందర్భంగా దర్గా ముజావర్లు ముఖ్యఅతిథులకు తలపాగా చుట్టి స్వాగతం పలికి, ఆశీర్వచనాలు, గంధం, ప్రసాదాలు అందజేశారు. ఈ వేడుకలను తిలికించేందుకు షాద్నగర్ నియోజకవర్గంలోని వివిధ ప్రాంతాలతో పాటు, ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర, కర్ణాటక రాష్ట్రాల నుంచి వేలాదిగా భక్తులు తరలివచ్చారు. గంధోత్సవలం అనంతరం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్, సీడబ్యూసీ మెంబర్ వంశీచంద్రెడ్డిలు మాట్లాడుతూ జేపీ దర్గా మతసామరస్యానికి ప్రతీకగా నిలుస్తుందన్నారు. గత పాలకులు దర్గా అభివృద్ధిని విస్మరించారని, ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి ఆధ్వర్యంలో జేపీ దర్గాను అన్ని రంగాల్లో అభివృద్ధి పరిచి చిరు వ్యాపారులకు జీవనం కల్పిస్తామన్నారు. ఉర్సు ఉత్సవాల సందర్భంగా ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ దర్గాకు వచ్చే భక్తుల కోసం 50వేల వాటర్ బాటిళ్లను ఉచితంగా అందజేశారు. శంషాబాద్ ఏసీపీ రాంచందర్రావు, ట్రాఫిక్ ఏసీపీ చంద్రశేఖర్రెడ్డిల పర్యవేక్షణలో స్థానిక ఇన్స్పెక్టర్ నర్సింహారావు ఆధ్వర్యంలో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. కార్యక్రమంలో ఎంపీపీ ిమధుసూదన్రెడ్డి, వైస్ ఎంపీపీ శోభలింగంనాయక్, మాజీ జడ్పీటీసీ మామిడి శ్యాంసుందర్రెడ్డి, వక్ఫ్బోర్డు సెక్రటరీ అహ్మద్, సూపరింటెండెంట్ సత్తార్, ఎంపీటీసీలు కొమ్ము కృష్ణ, చంద్రపాల్రెడ్డి, కుమారస్వామిగౌడ్, సర్పంచులు అజయ్ మిట్టునాయక్, అంబటి ప్రభాకర్, కాంగ్రెస్ పార్టీ నాయకులు శివశంకర్గౌడ్, బాబర్ఖాన్ తదితరులు పాల్గొన్నారు. ఉర్సు ఉత్సవాల్లో భాగంగా శుక్రవారం దీపారాదన నిర్వహిస్తారు. ఇన్ముల్నర్వ తండా నుంచి కూడా గిరిజనులు గంధాన్ని తలపై పెట్టుకుని మేళాతాళాలతో నృత్యాలు చేసుకుంటూ ఉరేగింపుగా తరలివచ్చి దర్గాకు సమర్పించారు.