ప్రతీ ఒక్కరికి కంప్యూటర్ పరిజ్ఞానం ఉండాలి
ABN , Publish Date - Jan 30 , 2024 | 11:56 PM
కంప్యూటర్ పరిజ్ఞానం మనిషి జీవితంలో తప్పనిసరి అవసరంగా మారిపోయిందని, దానిపై ప్రతీ ఒక్కరికి అవగాహన, పరిజ్ఞానం ఉండాలని ఇబ్రహీంపట్నం ఎంఈవో వెంకట్రెడ్డి అన్నారు.
![ప్రతీ ఒక్కరికి కంప్యూటర్ పరిజ్ఞానం ఉండాలి](https://media.andhrajyothy.com/media/2023/20231205/30ibpp20_f_b262791eee.gif)
ఆదిభట్ల, జనవరి 30 : కంప్యూటర్ పరిజ్ఞానం మనిషి జీవితంలో తప్పనిసరి అవసరంగా మారిపోయిందని, దానిపై ప్రతీ ఒక్కరికి అవగాహన, పరిజ్ఞానం ఉండాలని ఇబ్రహీంపట్నం ఎంఈవో వెంకట్రెడ్డి అన్నారు. ఆదిభట్ల మున్సిపాలిటీ మంగల్పల్లిలోని సీవీఆర్ ఇంజనీరింగ్ కళాశాల యాజమాన్యం మండల పరిధిలోని ప్రభుత్వ పాఠశాలలకు చెందిన 60మంది ఉపాధ్యాయులకు మంగళవారం కంప్యూటర్ శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. ముఖ్యఅతిథిగా విచ్చేసిన ఎంఈవో మాట్లాడుతూ దైనందన జీవితంలో కంప్యూటర్ పరిజ్ఞానం అంతర్భాగమైందని, ప్రతీ వ్యక్తికి కంప్యూటర్పై పరిజ్ఞానం ఉండాల్సిందేనన్నారు. సీవీఆర్ విద్యాసంస్థలు రెండేళ్లుగా ప్రభుత్వ ఉపాధ్యాయులకు, విద్యార్థులకు ఉచితంగా కంప్యూటర్ శిక్షణ ఇవ్వడమే కాకుండా కంప్యూటర్లను అందజేయడం ప్రశంసనీయమన్నారు. సీవీఆర్ కళాశాల ప్రిన్సిపల్ రామ్మోహన్ రెడ్డి, వైస్ ప్రిన్సిపాల్ శివారెడ్డి, హెచ్వోడీ లక్ష్మీలు మాట్లాడుతూ ఉపాధ్యాయులు కంప్యూటర్ టెక్నాలజీ నేర్చుకోవడం నైపుణ్యత, విశ్వాసం మరింతగా పెరుగుతుందన్నారు. ప్రభుత్వ పాఠశాలలకు ఇప్పటివరకు 35 కంప్యూటర్లు అందించినట్లు తెలిపారు. సీనియర్ అసిస్టెంట్ ప్రొఫెసర్ రత్నం, పీఆర్టీయూ నాయకులు గోవర్ధన్, పరమే్ష, కళాశాల సిబ్బంది పాల్గొన్నారు.