Share News

గ్యారంటీల అమలు బాధ్యత మాదే

ABN , Publish Date - Jan 03 , 2024 | 12:34 AM

అధికారులు ప్రజల వద్దకు వచ్చి పైసాఖర్చు లేకుండా దరఖాస్తులను స్వీకరించి ప్రభుత్వం ప్రకటించిన ఆరు గ్యారెంటీలకు ఎంపిక చేసేలా చర్యలు తీసుకుంటున్నామని అసెంబ్లీ స్పీకర్‌ గడ్డం ప్రసాద్‌కుమార్‌ అన్నారు.

గ్యారంటీల అమలు బాధ్యత మాదే
సమావేశంలో మాట్లాడుతున్న స్పీకర్‌ గడ్డం ప్రసాద్‌ కుమార్‌

స్పీకర్‌ గడ్డం ప్రసాద్‌కుమార్‌

వికారాబాద్‌, జనవరి 2: అధికారులు ప్రజల వద్దకు వచ్చి పైసాఖర్చు లేకుండా దరఖాస్తులను స్వీకరించి ప్రభుత్వం ప్రకటించిన ఆరు గ్యారెంటీలకు ఎంపిక చేసేలా చర్యలు తీసుకుంటున్నామని అసెంబ్లీ స్పీకర్‌ గడ్డం ప్రసాద్‌కుమార్‌ అన్నారు. మంగళవారం వికారాబాద్‌లోని 20వ వార్డు రాజీవ్‌ గృహకల్ప కాలనీలో నిర్వహించిన ప్రజాపాలన సభకు ఆయన హాజరై దరఖాస్తులను స్వీకరించారు. ఆయన మాట్లాడుతూ.. కాంగ్రెస్‌ ప్రభుత్వం గ్యారంటీలను అమలు చేస్తుందన్నారు. అన్ని గ్యారెంటీలకు ఒక్క దరఖాస్తు చేసుకోవచ్చని, రేషన్‌ కార్డుల కోసం తెల్ల కాగితంపై రాసి ఇవ్వాలన్నారు. అర్హులకు రేషన్‌కార్డులు ఇచ్చిన తరువాత మిగతా పథకాలను అమలు చేస్తామన్నారు. తనకు ప్రజలు అప్పగించిన బాధ్యతను సక్రమంగా నిర్వహిస్తానని, రాజీవ్‌ గృహకల్ప కాలనీలో సమస్యలను పరిష్కరిస్తామన్నారు. ప్రభుత్వ పథకాలు అర్హులందరికీ అందించే పూర్తి బాధ్యత తనదేనన్నారు. వచ్చే ఐదేళ్లలో 24గంటలూ ప్రజలకు అందుబాటులో ఉంటానని, వికారాబాద్‌ నియోజకవర్గాన్ని అభివృద్ధి చేస్తానని తెలిపారు. జిల్లాను రూ.3వేల కోట్లతో అభివృద్ధి చేస్తానని, పంచాయతీరాజ్‌, ఆర్‌అండ్‌బీ రోడ్లును బాగుపరిచే చర్యలు చేపడతామన్నారు. ప్రాణహిత-చేవెళ్ల, పాలమూరు-రంగారెడ్డి లిఫ్ట్‌ పూర్తి చేసేలా కృషిచేస్తానన్నారు. అనంతగిరి కొండలను రూ.200కోట్లతో ఎకో టూరిజంగా అభివృద్ధి చేస్తామన్నారు. కోటిపల్లి ప్రాజెక్టు వద్ద బోటింగ్‌ సదుపాయం కల్పించి యువతకు ఉపాధి కల్పించామని, వికారాబాద్‌ ప్రాంతానికి టెక్స్‌టైల్స్‌ పార్క్‌ తెచ్చి 4వేల మంది మహిళలకు, పరిశ్రమలను స్థానిక యువతకు ఉపాధి కల్పిస్తామని చెప్పారు. కలెక్టర్‌ సి.నారాయణరెడ్డి మాట్లాడుతూ.. ప్రతి కుటుంబానికి గ్యారంటీ పథకాలు అందేలా దరఖాస్తును రూపొందించామని, దరఖాస్తులో తప్పులు లేకుండా నింపాలని సూచించారు. ఒక వేళ గ్రామసభలో దరఖాస్తు చేసుకోలేని వారు ఈ నెల ఆరో తేదీ వరకు మునిసిపల్‌ లేదా పంచాయతీ అధికారులకు దరఖాస్తులు ఇవ్వొచ్చన్నారు. ఇప్పటికే లబ్ధి పొందుతున్న వారు దరఖాస్తు చేసుకోవాల్సిన అవసరం లేదన్నారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్‌ రాహుల్‌శర్మ, మునిసిపల్‌ చైర్‌పర్సన్‌ మంజుల, వైస్‌ చైర్‌పర్సన్‌ శంషాద్‌ బేగం, కౌన్సిల్‌లో కాంగ్రెస్‌ ఫ్ల్లోర్‌ లీడర్‌ సుధాకర్‌రెడ్డి, కౌన్సిలర్‌ మురళి, ఇతర కౌన్సిలర్లు, పాల్గొన్నారు.

డైరీ ఆవిష్కరించిన స్పీకర్‌

వికారాబాద్‌, జనవరి 2 : నూతన సంవత్సరాన్ని పురస్కరించుకొని ఎస్‌టీయూ-టీఎస్‌ 2024 డైరీని శాసనసభ స్పీకర్‌ గడ్డం ప్రసాద్‌కుమార్‌ ఆవిష్కరించారు. మంగళవారం వికారాబాద్‌లో ఎస్‌టీయూటీఎస్‌ జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు వేణుగోపాల్‌, షఫీల ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో ఆయన మునిసిపల్‌ చైర్‌పర్సన్‌ మంజులతో కలిసి డైరీని ఆవిష్కరించారు. అంతకు ముందు సంఘం బాధ్యులు స్పీకర్‌ను పుష్పగుచ్ఛం, శాలువాలతో సత్కరించారు. కార్యక్రమంలో ఎస్‌టీయూ జిల్లా అసోసియేట్‌ అధ్యక్షుడు పి.శ్రీనివాసరావు, రాష్ట్ర కౌన్సిలర్‌ పవన్‌కుమార్‌, జిల్లా ఉపాధ్యక్షుడు కనకాచారి, బాధ్యులు ఆశప్ప, చంద్రకాంత్‌, తిరుమలేష్‌ పాల్గొన్నారు.

Updated Date - Jan 03 , 2024 | 12:34 AM