తాగునీటి సమస్య రానివ్వొద్దు
ABN , Publish Date - Apr 19 , 2024 | 11:37 PM
గ్రామాల్లో తాగునీటి సమస్య తలెత్తకుండా అధికారులు జాగ్రత్తలు తీసుకోవాలని జిల్లా అడిషనల్ కలెక్టర్ రాహుల్ శర్మ ఆదేశించారు.
తాండూరు రూరల్, ఏప్రిల్ 19: గ్రామాల్లో తాగునీటి సమస్య తలెత్తకుండా అధికారులు జాగ్రత్తలు తీసుకోవాలని జిల్లా అడిషనల్ కలెక్టర్ రాహుల్ శర్మ ఆదేశించారు. మండల పరిధిలోని గౌతాపూర్ గ్రామంలో శుక్రవారం పర్యటించారు. గ్రామ సమీపంలో ఉన్న ఓహెచ్ఎస్ఆర్ ట్యాంకును పరిశీలించారు. నీటిఎద్దడి ఉందా అని గ్రామస్తులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం గౌతాపూర్లోని ప్రభుత్వ పాఠశాలలో మన ఊరు-మన బడి కింద నిర్మించిన భవనాలను పరిశీలించారు. మిషన్ భగీరథ నీళ్లు రావడం లేదని విద్యార్థులు చెప్పారు. పాఠశాల వద్ద ఉన్న బోర్లలో సుద్ధనీళ్లు వస్తున్నాయని, వాటర్ ప్లాంట్ కావాలని విద్యార్థులు కోరారు. కలెక్టర్ దృష్టికి తీసుకెళ్తానని చెప్పారు. అదేవిధంగా చెంగోల్ పాఠశాలను డీపీవో జయసుధ సందర్శించారు. అమ్మ ఆదర్శ కమిటీ సభ్యులతో మాట్లాడి పాఠశాలలో ఉన్న సమస్యలను తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీవో విశ్వప్రసాద్, పీఆర్ డీఈ వెంకట్రావు, మిషన్ భగీరథ డీఈ రమేష్, ఎంపీవో రతన్సింగ్, ఏఈలు ఉన్నారు.