Share News

లోక్‌సభ ఎన్నికల్లో ప్రలోభాలకు తావివ్వద్దు

ABN , Publish Date - Mar 28 , 2024 | 11:55 PM

ఓటర్లను ప్రలోభాలకు గురిచేసే డబ్బు, మద్యం, కానుకలు, మత్తు పదార్థాలు వంటి వాటిపై ప్రత్యేక నిఘా పెట్టాలని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్‌ శశాంక అన్నారు.

లోక్‌సభ ఎన్నికల్లో ప్రలోభాలకు తావివ్వద్దు
మాట్లాడుతున్న కలెక్టర్‌ శశాంక

డబ్బు, మద్యం, కానుకలు, మత్తు పదార్థాల పంపిణీపై ప్రత్యేక నిఘా

జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్‌ శశాంక

రంగారెడ్డి అర్బన్‌, మార్చి 28 : ఓటర్లను ప్రలోభాలకు గురిచేసే డబ్బు, మద్యం, కానుకలు, మత్తు పదార్థాలు వంటి వాటిపై ప్రత్యేక నిఘా పెట్టాలని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్‌ శశాంక అన్నారు. గురువారం జిల్లా కలెక్టరేట్‌లోని సమావేశ మందిరంలో జిల్లా ఇంటలిజెన్స్‌ కమిటీ సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పారదర్శకంగా, ప్రశాంతంగా లోకసభ ఎన్నికలు జరిగేలా అధికారులు సమష్టిగా పని చేయాలని ఆదేశించారు. ఎన్నికల్లో వ్యయ నియంత్రణ ప్రధాన అంశమని, ప్రతీ ఖర్చును లెక్కించాల్సి ఉంటుందని ఆయన తెలిపారు. ఓటర్లను ప్రలోభాలకు గురిచేసే డబ్బు, మద్యం, కానుకలు, మత్తు పదార్థాలు తదితర వాటిపై ప్రత్యేక నిఘా పెట్టి.. స్వాధీనం చేసుకోవాలని, బాధ్యులపై కేసులు నమోదు చేయాలని సూచించారు. ఇందుకోసం నియమించిన ఫ్ౖలయింగ్‌ స్క్వాడ్‌, వీడియో సర్వైలెన్స్‌, స్టాటిస్టికల్‌ సర్వైలెన్స్‌, వీడియో వీనింగ్‌ బృందాలు, సమర్థవంతంగా పని చేయాలని తెలిపారు. జిల్లాలో ఎన్నికల కోడ్‌ వెలువడినప్పటి నుంచి ఎన్నికల ఎన్‌ఫోర్స్‌మెంట్‌ బృందాల ద్వారా ఇప్పటివరకు రూ.79,41,650 నగదు, రూ.4,18,700 విలువైన 5.30కిలోల సిల్వర్‌, రూ.37,53,050 విలువగల 5822.53 లీటర్ల మద్యం, రూ.3,03,25,575 విలువగల 716.925 కిలోల డ్రగ్స్‌/నార్కోటిక్స్‌ను సీజ్‌ చేసినట్లు కలెక్టర్‌ తెలిపారు. అబ్కారీ, రవాణా, వాణిజ్య పన్నులు తదితర శాఖల సిబ్బంది ప్రతీ వాహనాన్ని క్షుణ్ణంగా తనిఖీ చేయాలని, రూ.10లక్షలు పైగా డబ్బు పట్టుపబడిన సందర్భంలో ఆదాయ శాఖ అధికారులకు సమాచారం అందించాలని తెలిపారు. బ్యాంకు లావాదేవీలపై ప్రతీరోజు నివేదిక అందించాలని ఆయన తెలిపారు. కాగా, అక్రమ మద్యం నిల్వలు, మద్యం రవాణాపై దాడులు నిర్వహించాలని అబ్కారీ అధికారులకు సూచించారు. గత శాసనసభ ఎన్నికల్లో మాదిరిగా ఈ ఎన్నికల్లో అధికారులు సమష్టిగా కృషి చేస్తూ.. అక్రమంగా డబ్బు, మద్యం, ఇతర కానుకలు పంచిపెట్టడాన్ని అరికట్టాలని సూచించారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్‌ ప్రతిమాసింగ్‌, డీఆర్వో సంగీత, ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డిప్యూటీ డైరెక్టర్‌ అరుణ్‌కుమార్‌ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Mar 28 , 2024 | 11:55 PM