దొడ్డి కొమురయ్య స్ఫూర్తిని కొనసాగించాలి: కలెక్టర్
ABN , Publish Date - Jul 05 , 2024 | 12:19 AM
తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట యోధుడు దొడ్డి కొమురయ్య చూపిన స్ఫూర్తిని కొనసాగించాలని కలెక్టర్ శశాంక అన్నారు.

రంగారెడ్డి అర్బన్, జూలై 4 : తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట యోధుడు దొడ్డి కొమురయ్య చూపిన స్ఫూర్తిని కొనసాగించాలని కలెక్టర్ శశాంక అన్నారు. కలెక్టరేట్లో దొడ్డి కొమురయ్య వర్ధంతిని గురువారం ఘనంగా నిర్వహించారు. జిల్లా వెనుకబడిన తరగతుల అభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమానికి కలెక్టర్ హాజరై కొమురయ్య చిత్రపటానికి పూల మాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ సాయుధ పోరాటానికి తొలి అమరుడై స్ఫూర్తినిచ్చిన వ్యక్తి దొడ్డి కొమురయ్య అని తెలిపారు. ఆయన స్ఫూర్తిని కొనసాగించాలని, తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటం తలచుకోగానే మొదటగా గుర్తు వచ్చేది పోరాట యోధుడు దొడ్డి కొమురయ్య అని, తెలంగాణలో భూస్వామ్యపాలనకు వ్యతిరేకంగా పోరాడిన యోధుడని కొనియాడారు. కార్యక్రమంలో జిల్లా రెవెన్యూ అధికారి సంగీత, బీసీ సంక్షేమాధికారి నీరజరెడ్డి, ఏవో నర్సింహారావు, బీసీ ఫ్రంట్ చైర్మన్ గోరిగే మల్లేష్ కురుమ, కేవైసీఎస్ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ మహేందర్ కురుమ, కేవైసీఎస్ జిల్లా అధ్యక్షుడు బండారు శ్రీశైలం, ప్రధాన కార్యదర్శి కుండే కృష్ణ, రాజేందర్ కురుమ, పర్వతాలు, శేఖర్, వివిధ శాఖ అధికారులు పాల్గొన్నారు.