ఆశా వర్కర్లకు పరీక్ష నిర్వహించొద్దు
ABN , Publish Date - Jun 07 , 2024 | 11:41 PM
రాష్ట్ర ప్రభుత్వం ఆశా వర్కర్లకు నిర్వహించే పరీక్షను వెంటనే రద్దు చేయాలని, 20 ఏళ్లుగా విధులు నిర్వహిస్తున్న వారిని యథావిధిగా కొనసాగించాలని సీఐటీయూ మండల కన్వీనర్ బుట్టి బాల్రాజ్ డిమాండ్ చేశారు.

కందుకూరు, జూన్ 7: రాష్ట్ర ప్రభుత్వం ఆశా వర్కర్లకు నిర్వహించే పరీక్షను వెంటనే రద్దు చేయాలని, 20 ఏళ్లుగా విధులు నిర్వహిస్తున్న వారిని యథావిధిగా కొనసాగించాలని సీఐటీయూ మండల కన్వీనర్ బుట్టి బాల్రాజ్ డిమాండ్ చేశారు. ఈమేరకు శుక్రవారం ఆశావర్కర్లతో కలిసి మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో మండల వైద్యాధికారి డాక్టర్ రాధికకు వినతిపత్రాన్ని అందజేశారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడారు. 20 సంవత్సరాలుగా గ్రామీణ ప్రాంతాల్లో, 19 సంవత్సరాలుగా పట్టణ ప్రాంతాల్లో అనేక రకాలుగా సేవలందిస్తున్న ఆశా వర్కర్లకు రాష్ట్ర ప్రభుత్వం పరీక్షల పేరుతో కాలయాపన చేయకుండా పదోన్నతులను కల్పించాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారం చేపట్టాక ఆశా వర్కర్లకు పరీక్షలను నిర్వహించాలనుకోవడం విడ్డూరంగా ఉందన్నారు. పరీక్షల్లో ఉత్తీర్ణులు కానివారికి తీరని అన్యాయం చేయడానికి కుట్రలు పన్నుతున్నారని ఆరోపించారు. ఆశా వర్కర్లకు రూ.15వేల కనీస వేతనాన్ని ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఆశావర్కర్లు జయసుధ, ముంతాజ్, ప్రేమలత, అనిత, సురేఖ, భాగ్య, లక్ష్మమ్మ, తదితరులున్నారు.