డిమాండ్లు నెరవేర్చాలని ధర్నా
ABN , Publish Date - Nov 28 , 2024 | 11:50 PM
మధ్యాహ్న భోజన వంట నిర్వాహకుల సమస్యలు పరిష్కరించాలని, కనీస వేతనం అందించాలని డిమాండ్ చేస్తూ గురువారం యాచారం మండల కేంద్రంలోని ఎమ్మార్సీ భవన్ ఎదుట సీఐటీయూ ఆధ్వర్యంలో ధర్నా చేపట్టారు.

యాచారం, నవంబరు 28 (ఆంధ్రజ్యోతి) : మధ్యాహ్న భోజన వంట నిర్వాహకుల సమస్యలు పరిష్కరించాలని, కనీస వేతనం అందించాలని డిమాండ్ చేస్తూ గురువారం యాచారం మండల కేంద్రంలోని ఎమ్మార్సీ భవన్ ఎదుట సీఐటీయూ ఆధ్వర్యంలో ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా జిల్లా ఉపాధ్యక్షుడు డి.జగదీష్ మాట్లాడుతూ మధ్యాహ్న భోజన కార్మికులు వంట నిర్వహణకు అప్పులు చేసి వాటికి వడ్డీ కూడా చెల్లించలేని దుస్థితి నెలకొందన్నారు. సకాలంలో బిల్లులు అందక ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. పెరిగిన ధరలకు అనుగుణంగా మెనూ చార్జీలు పెంచాలని, పెండింగ్ బిల్లులు విడుదల చేయాలని, గత ఎన్నికల్లో నాయకులు ఇచ్చిన హామీ మేరకు కార్మికులకు నెలకు రూ.10వేల వేతనం అందించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో నాయకులు పి.బ్రహ్మయ్య, చందూనాయక్, జంగయ్య, పార్వతమ్మ, లక్ష్మమ్మ, సాల్లమ్మ, కళమ్మ పాల్గొన్నారు.