సంక్షేమ పథకాలతో పేదల అభివృద్ధి
ABN , Publish Date - May 31 , 2024 | 12:07 AM
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు పేదలకందితేనే పేదరికం నిర్మూలన సాధ్యమని, ఆ దిశగా అధికారులు, ప్రజాప్రతినిధులు చర్యలు తీసుకుంటే పేదలు అభివృద్ధి చెందుతారని డీఆర్డీవో పీడీ శ్రీలతారెడ్డి అన్నారు. యాచారం మండలంలోని గడ్డమల్లాయాగూడ గ్రామంలో పలు అభివృద్ధి పనులను పరిశీలించేదుకు కేంద్ర బృందం వస్తుందనే నేపథ్యంలో గురువారం ఆమె గ్రామంలో పర్యటించారు.
![సంక్షేమ పథకాలతో పేదల అభివృద్ధి](https://media.andhrajyothy.com/media/2024/20240530/30ibpp6_A_F_36e7c5884c.gif)
డీఆర్డీవో పీడీ శ్రీలతారెడ్డి
యాచారం, మే 30 : కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు పేదలకందితేనే పేదరికం నిర్మూలన సాధ్యమని, ఆ దిశగా అధికారులు, ప్రజాప్రతినిధులు చర్యలు తీసుకుంటే పేదలు అభివృద్ధి చెందుతారని డీఆర్డీవో పీడీ శ్రీలతారెడ్డి అన్నారు. యాచారం మండలంలోని గడ్డమల్లాయాగూడ గ్రామంలో పలు అభివృద్ధి పనులను పరిశీలించేదుకు కేంద్ర బృందం వస్తుందనే నేపథ్యంలో గురువారం ఆమె గ్రామంలో పర్యటించారు. ఈ సందర్భంగా పలు అభివృద్ధి పనులను తనిఖీ చేసి సమస్యలను తెలుసుకున్నారు. ఉపాధిహామీ నిధులతో పండ్లతోటలు పెంచి రైతులు ఆర్థికంగా లాభపడడం అభినందనీయమని, ఎంపీడీవో, ఏపీవోల పాత్ర వెలకట్టలేనిదన్నారు. వర్షాలు కురియగానే పూల మొక్కలను కూడా అందించనున్నట్లు తెలిపారు. ప్రతీ రైతు మామిడి, జామ, ఉసిరి వంటి పండ్ల తోటలతో పాటు మేలు రకం పశుగ్రాసాలు పెంచి పాడిని ఉత్పత్తి చేసుకోవాలని రైతులకు విజ్ఞప్తి చేశారు. పొలం గట్లపై రకరకాల పండ్లచెట్లు పెంచుకోవాలన్నారు. పాడిరైతులు పశువుల కోసం పొలం గట్లపై మేలు రకం పశుగ్రాసం పెంచుకోవాలని సూచించారు. హరితహారం నర్సరీలలో కూడా పండ్ల మొక్కలను రైతులకు ఉచితంగా ఇస్తున్నట్లు చెప్పారు. ఎండాకాలంలో కూలీలకు వందరోజుల ఉపాధి పనులు చూపి ఆదుకుంటున్నట్లు తెలిపారు. ఉపాధి పనుల్లో భాగంగా సరిహద్దు కందకాలను లోతుగా తవ్వుకుంటే భూగర్భజలం పెంచుకోవడం చాలా సులువన్నారు. గ్రామంలో అభివృద్ధి పనులను పరిశీలించిన అనంతరం పంచాయతీ అధికారులను అభినందించారు. కూలీలకు పని ప్రదేశంలో మెడికల్ కిట్, తాగునీటి వసతి కల్పిస్తున్నట్లు చెప్పారు. కార్యక్రమంలో డివిజన్ ఏపీడీ సక్రియా, ఎంపీడీవో నరేందర్రెడ్డి తదితరులున్నారు.