అక్రమ నిర్మాణాల కూల్చివేత
ABN , Publish Date - Apr 07 , 2024 | 12:10 AM
పట్టణంలోని జాతీయ రహదారికి ఆనుకుని అక్రమంగా నిర్మించిన షెడ్లను మేడ్చల్ మున్సిపల్ అధికారులు శనివారం కూల్చివేశారు.
![అక్రమ నిర్మాణాల కూల్చివేత](https://www.andhrajyothy.com/assets/images/defaultImg.jpeg)
మేడ్చల్ టౌన్, ఏప్రిల్ 6: పట్టణంలోని జాతీయ రహదారికి ఆనుకుని అక్రమంగా నిర్మించిన షెడ్లను మేడ్చల్ మున్సిపల్ అధికారులు శనివారం కూల్చివేశారు. మేడ్చల్ ఎమ్మెల్యే, మాజీమంత్రి మల్లారెడ్డి తనయుడు చామకూర మహేందర్రెడ్డికి సంబంధించిన స్థలంలో సుప్ర వైన్స్ స్థలంలో నిబంధనలకు విరుద్దంగా షెడ్లు వేసి సిట్టింగ్ రూమ్ ఏర్పాటు చేశారు. అక్రమ నిర్మాణాలపై వారం రోజుల కిందట సంబంధిత వైన్స్ నిర్వాహకులకు నోటీసులు ఇచ్చినప్పటికీ వారు స్పందించక పోవటంతో శనివారం షెడ్లను కూల్చివేసిట్లు అధికారులు తెలిపారు. రాజకీయ కక్షల కారణంగా నిర్మాణాలను కూల్చివేశారని వైన్స్ యజమాని రాజమల్లారెడ్డి ఆరోపించాడు. తమకు కనీస సమయం ఇవ్వలేదని వాపోయాడు. ఈ నిర్మాణాలు ముమ్మాటికీ అధికార బలంతో గతంలో బీఆర్ఎస్ హయాంలో నిర్మించినవని ఫిర్యాదు దారులు ఆరోపించారు. రోడ్డు సమీపంలో ఎలాంటి అనుమతి లేకుండా షెడ్లు నిర్మించటంతో తగిన విచారణ జరిపి నిర్మాణాల యజమానులకు నోటీసులు జారీ చేసిన అనంతరం కూల్చివేశామని మున్సిపల్ అధికారులు తెలిపారు. ఇందులో ఎలాంటి రాజకీయ ప్రమేయం లేదని, నిబంధనల ప్రకారం నిర్మాణాలను తొలగించామని అధికారులు తెలిపారు.