Share News

పేదల సంక్షేమానికి సీపీఐ పోరాటం

ABN , Publish Date - Mar 18 , 2024 | 12:19 AM

భారత కమ్యూనిస్టు పార్టీ(సీపీఐ) పేదలు, రైతులు, కార్మికుల సంక్షేమం కొరకు పోరాటం చేస్తుందని ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శి, ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు అన్నారు.

పేదల సంక్షేమానికి సీపీఐ పోరాటం
మాట్లాడుతున్న కూనంనేని సాంబశివరావు

ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు

శంషాబాద్‌లో సీపీఐ జిల్లాస్థాయి

రాజకీయ శిక్షణా తరగతులు

శంషాబాద్‌, మార్చి 17 : భారత కమ్యూనిస్టు పార్టీ(సీపీఐ) పేదలు, రైతులు, కార్మికుల సంక్షేమం కొరకు పోరాటం చేస్తుందని ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శి, ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు అన్నారు. రంగారెడ్డి జిల్లా శంషాబాద్‌ మున్సిపల్‌ కేంద్రంలో రెండు రోజుల పాటు జరిగిన సీపీఐ జిల్లా స్థాయి రాజకీయ శిక్షణా తరగతులు ఆదివారం ముగిశాయి. ఈ కార్యక్రమానికి సాంబశివరావు ముఖ్యతిథిగా హాజరై మాట్లాడారు. పేదలకు ఇళ్ల స్థలాలు, సాగు భూముల కోసం పోరాడే పార్టీ సీపీఐ అని అన్నారు. తమ పార్టీ ప్రజల సంక్షేమం తప్పా.. ఇంకేమీ ఆశించడం లేదని అన్నారు. ఏమైనా ఆశించి ఉంటే ఇప్పటివరకు మంత్రులు, ముఖ్యమంత్రులు, ప్రధానమంత్రులం అయ్యుండేవాళ్లమని అన్నారు. తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటం కోసం తమ ఆస్తులు, ప్రాణాలను పణంగా పెట్టి పోరాడిన మహానుభావులెందరో సీపీఐలో ఉన్నారని ఆయన గుర్తుచేశారు.

కుప్పకూలిన బీఆర్‌ఎస్‌ పార్టీ

బీఆర్‌ఎస్‌, ఆ పార్టీ నిర్మించుకున్న భవనం పేకమేడల కంటే తొందరగా కుప్పకూలిపోయిందని, వాటి శిథిళాలు కూడా దొరక్కుండా పోయాయని కూనంనేని అన్నారు. రాబోయే పార్లమెంటు ఎన్నికల్లో ఆ పార్టీకి ఒక్క సీటు కూడా గెలిచే అవకాశం లేదన్నారు. లోక్‌సభ ఎన్నికల్లో పోటీకి బీఆర్‌ఎస్‌ అభ్యర్థులందరూ బీఆర్‌ఎస్‌ అధినేత కేసీఆర్‌ మాట వినకుండా పారిపోతున్నారని. అధికారంలో ఉన్నన్నాళ్లు బీఆర్‌ఎస్‌ నాయకులు బెదిరింపులకు పాల్పడ్డారని అన్నారు. ఇప్పుడు ఆ బెదిరింపులే వారికి ఎదురై బీఆర్‌ఎస్‌ కొంపముంచుతున్నాయని అన్నారు. సీపీఐ రాష్ట్ర నాయకుడు శంకర్‌నారాయణ, జిల్లా కార్యదర్శి పాలమాకుల జంగయ్య, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు రవీంద్రాచారి, పుస్తకాల నర్సింగ్‌రావు, రాష్ట్ర సమితి సభ్యులు పానుగంటి పర్వతాలు, యాదిరెడ్డి, సయ్యద్‌ అఫ్సర్‌, ఊరుగంటి యాదయ్య, నర్రా గిరి, కె.రామస్వామి, శేఖర్‌రెడ్డి, ప్రభులింగం, బి.జంగయ్య, ఎం. శ్రీను, పి.లక్ష్మణ్‌, నీలమ్మ, కిషోర్‌ ఆర్‌.యాదగిరి తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Mar 18 , 2024 | 12:19 AM