హామీల అమలులో కాంగ్రెస్ విఫలం
ABN , Publish Date - Apr 19 , 2024 | 12:14 AM
హామీల అమలుపై రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని నాగర్కర్నూల్ ఎంపీ పోతుగంటి రాములు, కామరెడ్డి ఎమ్మెల్యే కాటిపల్లి వెంకటరమణారెడ్డి, ఎన్బీసీ మాజీ సభ్యుడు తల్లోజు ఆచారిలు అన్నారు.
ఎంపీ రాములు, ఎమ్మెల్యే వెంకటరమణారెడ్డి
ఆమనగల్లు, ఏప్రిల్ 18 : హామీల అమలుపై రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని నాగర్కర్నూల్ ఎంపీ పోతుగంటి రాములు, కామరెడ్డి ఎమ్మెల్యే కాటిపల్లి వెంకటరమణారెడ్డి, ఎన్బీసీ మాజీ సభ్యుడు తల్లోజు ఆచారిలు అన్నారు. లోక్సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా గ్రామాలకు వచ్చే కాంగ్రె్స్ నాయకులను హామీల అమలుపై ప్రజలు నిలదీయాలన్నారు. ఆమనగల్లు పట్టణంలోని బీజేపీ కార్యాలయంలో గురువారం పార్లమెంట్ ఎన్నికలపై సన్నాహక సమావేశం నిర్వహించారు. నాయకులు, కార్యకర్తలకు పలు సూచనలు చేశారు. సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీ విజయమే లక్ష్యంగా ప్రతి కార్యకర్త సైనికుడిలా ముందుకు సాగాలని పిలుపునిచ్చారు. అనంతరం ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడుతూ ఆరు గ్యారంటీల పేరుతో ఓట్లు దండుకున్న కాంగ్రెస్.. అధికారంలోకి వచ్చాక వాటిని అమలు చేయడం లేదని ఆరోపించారు. మోదీ పదేళ్ల పాలనలో దేశం అద్భుత విజయాలు సాధించిందని, ఉత్తర భారత దేశంలో కాంగ్రెస్ తుడిచి పెట్టుకుపోయిందని, దక్షిణ భారత్లోనూ కాంగ్రెస్ కనుమరుగు కాక తప్పదన్నారు. మోదీ, బీజేపీకి దేశంలో లభిస్తున్న ఆదరణ చూసి ఓర్వలేని కాంగ్రెస్, బీఆర్ఎస్, కమ్యూనిస్టులు విషప్రచారానికి ఒడిగట్టారని రాములు, వెంకటరమణారెడ్డి, ఆచారిలు మండిపడ్డారు. తెలంగాణలో బీజేపీ ప్రత్యామ్నాయ శక్తిగా నిలుస్తుందని, 12 స్థానాలు కైవసం చేసుకోవడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. నాగర్కర్నూల్ పార్లమెంట్ స్థానాన్ని భారీ మెజార్టీతో గెలుపొందడం ఖాయమని తెలిపారు. ఈ ఎన్నికల అనంతరం రాష్ట్రంలో బీఆర్ఎస్ కనుమరుగు కాక తప్పదన్నారు.
ఎమ్మెల్యే వెంకటరమణారెడ్డికి సన్మానం
కామారెడ్డి ఎమ్మెల్యే వెంకటరమణారెడ్డికి గురువారం ఆమనగల్లు పట్టణంలో బీజేపీ నాయకులు ఘన స్వాగతం పలికారు. నాగర్కర్నూల్ జిల్లాలో పార్టీ కార్యక్రమాల్లో పాల్గొనడానికి వెళ్తున్న రమణారెడ్డి స్థానిక పార్టీ కార్యాలయానికి చేరుకున్నారు. ఎన్బీసీ మాజీ సభ్యుడు తల్లోజు ఆచారి, ఆ పార్టీ నాయకులు ఎమ్మెల్యేను సత్కరించి అభినందించారు. కార్యక్రమాల్లో బీజేపీ నాయకులు గోరటి నర్సింహ, కండె హరిప్రసాద్, లక్ష్మణ్ రావు, శ్రీకాంత్సింగ్, లక్ష్మణ్, చెన్నకేశవులు, కండెసాయి, ప్రభాకర్, శ్రీధర్, సుండూరు శేఖర్, రాములు, శ్రీశైలం యాదవ్, గిరి, రవిరాథోడ్, అనిల్, గూడూరు గోపాల్రెడ్డి, మన్యనాయక్, రాందా్సనాయక్, సాయిల్ నాయక్, బక్కి కుమార్, పాండు, శ్రీధర్, కండె సాయి, అనిల్, తదితరులు పాల్గొన్నారు.