కాంగ్రెస్కు జవసత్వాలు
ABN , Publish Date - Mar 01 , 2024 | 12:00 AM
లోక్సభ ఎన్నికలకు సమాయాత్తమవుతున్న అఽధికార కాంగ్రెస్ పార్టీ ఉమ్మడి జిల్లాలో పూర్తిస్థాయిలో పుంజుకునే యత్నం చేస్తోంది. తాజాగా మంగళవారం చేవెళ్లలో జరిగిన జనజాతర బహిరంగ సభకు భారీగా జనం తరలి రావడంతో హస్తం పార్టీ కేడర్లో జోష్ పెరిగింది.
చేవెళ్ల సభతో కేడర్లో నూతనోత్తేజం
లోక్సభ ఎన్నికలకు పూర్తిస్థాయిలో సన్నద్ధం
చేరికలపైనే ప్రధాన దృష్టి
కార్యకర్తలకు సీఎం రేవంత్ భరోసా
ఉమ్మడి జిల్లాలో మారుతున్న రాజకీయ సమీకరణాలు
రోజురోజుకూ బలహీనపడుతున్న బీఆర్ఎస్
అసెంబ్లీ ఎన్నికల ఫలితాల తరువాత రేవంత్రెడ్డి నేతృత్వంలో ప్రభుత్వ ఏర్పాటుతో కాంగ్రెస్ పార్టీలో జోష్ నెలకొంది. రానున్న లోక్సభ ఎన్నికలను పార్టీ నాయకత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకుంటోంది. ఉమ్మడి జిల్లా పరిధిలోని చేవెళ్ల, మల్కాజ్గిరి లోక్సభ స్థానాల్లో గెలుపే లక్ష్యంగా నాయకులు పనిచేస్తున్నారు. మొదటగా పార్టీని మరింత బలోపేతం చేసే చర్యలను రాష్ట్ర నాయకత్వం చేపట్టింది. ఇందులో భాగంగా బీఆర్ఎస్, ఇతర పార్టీల నుంచి నేతలను కాంగ్రెస్లో చేర్చుకుంటూ ప్రతిపక్షాలకు గట్టి సవాల్ విసురుతున్నారు. ఇటీవల చేవెళ్ల సభ సక్సె్సతో రెట్టించిన ఉత్సాహంతో క్యాడర్ పనిచేయాలని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి పిలుపునిచ్చారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో మెజారిటీ పదవులు కాంగ్రెస్సే కైవసం చేసుకుంటుందని, పార్టీ కోసం శ్రమించిన వారికి తగిన ఫలితం దక్కేలా నాయకత్వం పనిచేస్తుందని పీసీసీ చీఫ్ క్యాడర్కు భరోసా ఇచ్చారు.
(ఆంధ్రజ్యోతి, రంగారెడ్డి జిల్లా ప్రతినిధి): లోక్సభ ఎన్నికలకు సమాయాత్తమవుతున్న అఽధికార కాంగ్రెస్ పార్టీ ఉమ్మడి జిల్లాలో పూర్తిస్థాయిలో పుంజుకునే యత్నం చేస్తోంది. తాజాగా మంగళవారం చేవెళ్లలో జరిగిన జనజాతర బహిరంగ సభకు భారీగా జనం తరలి రావడంతో హస్తం పార్టీ కేడర్లో జోష్ పెరిగింది. ఈ సభ ద్వారా ప్రతిపక్షాలకు అధికార కాంగ్రెస్ పార్టీ గట్టి సంకేతాలే పంపింది. అలాగే కేడర్కు సీఎం రేవంత్రెడ్డి భవిష్యత్తుపై భరోసా ఇచ్చారు. పార్టీ కోసం పనిచేసిన వారిని ఎట్టి పరిస్థితుల్లోనూ నిర్లక్ష్యం చేయబోమని ఈ సభలో స్పష్టం చేశారు. పార్టీ కోస కష్టపడిన వారందరికీ స్థానిక ఎన్నికల్లో అవకాశాలు కల్పిస్తామని తెలిపారు. దీంతో పాటు నామినేటెడ్ పోస్టుల భర్తీ ద్వారా కూడా కొందరికి న్యాయం చేస్తామని చెప్పారు. ఒక విధంగా కాంగ్రెస్ ఈ సభ ద్వారా పార్లమెంట్ ఎన్నికలకు శంఖారావాన్ని పూరిచిందనే చెప్పాలి. లోక్సభ ఎన్నికలకు ముందు పార్టీలో జవసత్వాలు నింపేందుకు కాంగ్రెస్ క్షేత్రస్థాయిలో బలాన్ని పెంచుకుంటోంది. తాజాగా జరిగిన చేవెళ్ల సభలో బీఆర్ఎస్ నుంచి అనేక మంది నేతలు కాంగ్రె్సలో చేరారు. దీనికి కొద్ది రోజుల ముందే రంగారెడ్డి, వికారాబాద్ జడ్పీ చైర్పర్సన్లు అనితారెడ్డి, సునీతారెడ్డి కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు. అలాగే ఎమ్మెల్సీ, మాజీ మంత్రి మహేందర్రెడ్డితో పాటు మాజీ ఎమ్మెల్యే తీగల కృష్ణారెడ్డి సైతం గులాబీని వీడి కాంగ్రెస్ గూటికి చేరారు. త్వరలో కొందరు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కూడా కాంగ్రె్సలో చేరుతారనే ప్రచారం సాగుతోంది. ఇప్పటికే కొందరు ఎమ్మెల్యేలు సీఎం రేవంత్రెడ్డి టచ్లోకి వెళ్లారు. రాజేంద్రనగర్ ఎమ్మెల్యే ప్రకా్షగౌడ్ సీఎం రేవంత్ను కలిసి గంటసేపు మంతనాలు జరిపారు. అప్పటి నుంచి ఆయన బీఆర్ఎస్ చేపడుతున్న కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొనడం లేదు.
రెండు లోక్సభ స్థానాల్లో గెలుపే లక్ష్యం
ఇక క్షేత్రస్థాయిలో కూడా మున్సిపాలిటీలు, కార్పొరేషన్లు, ఎంపీపీ, జడ్పీటీసీలను కూడా పెద్ద సంఖ్యలో తమ పార్టీలో చేర్చుకునేందుకు కాంగ్రెస్ వ్యూహరచన చేస్తోంది. లోక్సభ ఎన్నికలకు సమయం దగ్గరపడుతుండడంతో చేరికలను వేగవంతం చేయాలని పార్టీ ముఖ్యనేతలకు అధిష్ఠానం ఆదేశాలు జారీ చేసింది. మాజీ మంత్రి మహేందర్రెడ్డి ఇప్పటికే కొందరు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలతో చర్చలు జరుపుతున్నట్లు సమాచారం. ఇదిలా ఉంటే ఉమ్మడి జిల్లాలోని చేవెళ్ల, మల్కాజిగిరి రెండు లోక్సభ స్థానాలనూ దక్కించుకోవడం సీఎం రేవంత్రెడ్డికి ప్రతిష్టాత్మకమే. ఇందులో మల్కాజిగిరి నుంచి సీఎం రేవంత్రెడ్డే ప్రాతినిథ్యం వహించిన సంగతి తెలిసిందే. అసెంబ్లీ ఎన్నికల తరువాత ఆయన ఈ స్థానానికి రాజీనామా చేశారు. అలాగే ఇప్పుడు ఆయన చేవెళ్ల పార్లమెంట్ ఇన్చార్జిగా కూడా ఉన్నారు. దీంతో ఈ రెండు లోక్సభ స్థానాల ఎన్నికలు ఆయనకు సవాల్ అని చెప్పక తప్పదు. త్వరలో జరగబోయే లోక్సభ ఎన్నికల్లో చేవెళ్ల, మల్కాజిగిరి స్థానాల్లో త్రిముఖపోటీ నెలకొనే అవకాశం ఉంది. అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ రాష్ట్రంలోని మిగతా జిల్లాల్లో దెబ్బతిన్నప్పటికీ ఈ రెండు లోక్సభ స్థానాల పరిధిలో మాత్రం మెజార్టీ ఓట్లే సాధించింది. అయితే కాంగ్రెస్ అధికార పగ్గాలు చేపట్టినప్పటి నుంచి బీఆర్ఎస్ పరిస్థితి క్షేత్రస్థాయిలో గడ్డు పరిస్థితినే ఎదుర్కొంటోంది. కాంగ్రెస్కు రోజు రోజుకూ వలసలు పెరుగుతున్నాయి. కీలక నేతలంతా అధికార కాంగ్రెస్ వైపు చూస్తున్నారు. ఈ పరిణామాలను కాంగ్రెస్ పూర్తిగా అనుకూలంగా మార్చుకునే యత్నం చేస్తోంది. రాబోయే కాలంలో చేరికలపైనే ప్రధానంగా దృష్టిపెట్టాలని స్థానిక నాయకత్వానికి పార్టీ ఆదేశించింది. మరో వైపు బీఆర్ఎస్ బలహీనపడుతుండడంతో బీజేపీకి కొంత అనుకూల పరిస్థితులు కనిపిస్తున్నాయి. ప్రస్తుతం బీఆర్ఎస్ కొంత బలంగానే కనిపిస్తున్నా లోక్సభ ఎన్నికల సమయానికి అధికార కాంగ్రె్సకు, బీజేపీల మధ్యే ప్రధాన పోటీ నెలకొనే అవకాశాలు కనిపిస్తున్నాయి. అసెంబ్లీ ఎన్నికల ఫలితాల నుంచీ బీఆర్ఎ్సను వీడుతున్న వారిని పార్టీ నాయకత్వం నియంత్రించలేక పోవడంతో రోజురోజుకూ గులాబీ పార్టీ బలహీనపడుతోంది.
కాంగ్రెస్ ఆపరేషన్ ఆకర్ష్తో మహేశ్వరంలో బీఆర్ఎ్సకు భారీ గండి
మహేశ్వరం: మహేశ్వరం నియోజకవర్గ బీఆర్ఎ్సలో రోజురోజుకూ భారీ చీలికలతో పార్టీ కుదేలవుతుండగా కాంగ్రె్సలో మాత్రం జోష్ పెరుగుతోంది. మహేశ్వరం మాజీ ఎమ్మెల్యే తీగల కృష్ణారెడ్డి, ఆయన కోడలు, జిల్లా పరిషత్ చైర్పర్సన్ తీగల అనితారెడి,్డ, మండల ఇన్చార్జి ఎంపీపీ ఆర్.సునీత అంద్యానాయక్ దంపతులు, మహేశ్వరం మాజీ సర్పంచ్ కూనయాదయ్య, మన్సాన్పల్లి ఎల్లమ్మ ఆలయ కమిటీ చైర్మన్ మర్యాద మురళీధర్రెడ్డి, ఘట్టుపల్లి మాజీ సర్పంచ్ రాఖే్షరెడ్డి, మాజీ ఉపసర్పంచులు దోమ శ్రీనివా్సరెడ్డి, కె.రాములు, బీఆర్ఎస్ మండల ప్రధాన కార్యదర్శి మర్యాద రాఘవేందర్రెడ్డి, తుక్కుగూడ మున్సిపల్ బీఆర్ఎస్ మహిళావిభాగం అధ్యక్షురాలు పద్మ, తుక్కుగూడ, జల్పల్లి మున్సిపాలిటీలు, మీర్పేట, బడంగ్పేట కార్పొరేషన్లలోని పలువురు ప్రజాప్రతినిధులు పదవులకు, బీఆర్ఎప్ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామాలు చేసి కాంగ్రె్సలో చేరారు. అలాగే మహేశ్వరం, కందుకూరు మండలాల మాజీ ఎంపీపీలు, మాజీ సర్పంచ్లు, మాజీ ఉపసర్పంచ్లు, బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు నియోజకవర్గ కాంగ్రెస్ ఇన్చార్జి కిచ్చన్నగారి లక్ష్మారెడ్డి సమక్షంలో కాంగ్రె్సలో చేరారు. భారీగా కొనసాగుతున్న చేరికలతో ఎన్నికల ముందున్న కాంగ్రె్సకు ప్రస్తుత కాంగ్రె్సకు పోలికే లేకుండా పోయింది. రాష్ట్రంలో ఆ పార్టీ అధికారంలోకి రావడంతో వలసల వెల్లువ కొనసాగుతోంది. లోక్సభ ఎన్నికల తర్వాత వచ్చే స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ తరుపున పోటీ చేసేందుకు ఇప్పటి నుంచే నాయకులు, ప్రజాప్రతినిధులు హస్తం పార్టీలో చేరుతున్నారు. బీఆర్ఎస్ నాయకులతో పాటు వివిధ గ్రామాల్లోని పలువురు బీజేపీ కార్యకర్తలు కూడా కాంగ్రెస్లో చేరతారనే వార్తలు జోరుగా వినిపిస్తున్నాయి. కాంగ్రెస్ నియోజకవర్గ ఇన్చార్జి కిచ్చన్నగారి లక్ష్మారెడ్డి కాంగ్రె్సను బలోపేతం చేసే చర్యలను ముమ్మరం చేశారు. నియోజకవర్గంలో బీఆర్ఎ్సను కనుమరుగు చేయాలనే లక్ష్యంతో బీఆర్ఎస్ లీడర్లను, క్యాడర్ను కాంగ్రె్సలో చేర్చుకుంటూ పావులు కదుపుతున్నారు. నాలుగు నెలల్లో జరగనున్న పంచాయతీ ఎన్నికల్లో పోటీ చేయాలనుకునే వారు బీఆర్ఎ్సకు గుడ్బై చెప్పి కాంగ్రె్సలో చేరుతున్నారు. గ్రామాల్లో అభివృద్ధి కావాలంటే పాలక పార్టీలోనే ఉండాలని చాలామంది బీఆర్ఎస్ నాయకులు కాంగ్రె్సలో చేరుతున్నారు. మరింత మంది చేరికలకు సిద్ధం అవుతున్నారు. ఐదేళ్లుగా బీఆర్ఎస్కు అడ్డాగా ఉన్న మహేశ్వరం ఇక కాంగ్రెస్ గడ్డగా మారబోతోందనే వార్తలు జోరందుకున్నాయి. ఇంత జరుగుతున్నా 20 సంవత్సరాలుగా రాష్ట్ర రాజకీయాల్లో కీలక పదవులు నిర్వహించిన మహేశ్వరం బీఆర్ఎస్ ఎమ్మెల్యే పి.సబితా ఇంద్రారెడ్డి మౌనంగా ఉండడం బీఆర్ఎస్ వర్గాల్లో తీవ్ర దుమారాన్నే లేపుతోంది. లోక్సభ ఎన్నికల నాటికి మహేశ్వరం నియోజకవర్గంలో బీఆర్ఎ్సను ఖాళీ చేయడమే లక్ష్యంగా రోజుకో గ్రామంలో బీఆర్ఎస్ నాయకులను కాంగ్రె్స పార్టీలో చేర్చుకుంటున్నా బీఆర్ఎస్ ఎమ్మెల్యే, పార్టీ ముఖ్య నేతలు నిలువరించడం లేదనే విమర్శలు తీవ్ర స్థాయిలో వ్యక్తం అవుతున్నాయి.