మంచి, చెడు స్పర్శలపై అవగాహన
ABN , Publish Date - Mar 01 , 2024 | 12:03 AM
మంచి, చెడు స్పర్శలపై పిల్లలు అవగాహన కలిగి ఉండాలని, మంచి స్పర్శ సురక్షితంగా అనిపించి ప్రియమైన అనుభూతిని కలిగిస్తుందని జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి, సీనియర్ సివిల్ జడ్జి డి.ఇందిర అన్నారు.
![మంచి, చెడు స్పర్శలపై అవగాహన](https://www.andhrajyothy.com/assets/images/defaultImg.jpeg)
ఇబ్రహీంపట్నం, ఫిబ్రవరి 29: మంచి, చెడు స్పర్శలపై పిల్లలు అవగాహన కలిగి ఉండాలని, మంచి స్పర్శ సురక్షితంగా అనిపించి ప్రియమైన అనుభూతిని కలిగిస్తుందని జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి, సీనియర్ సివిల్ జడ్జి డి.ఇందిర అన్నారు. గురువారం ఇబ్రహీంపట్నం మండలం ఉప్పరిగూడ ప్రాథమికోన్నత పాఠశాలలో రంగారెడ్డి జిల్లా న్యాయ సేవాధికార సంస్థ, చైల్డ్ చాప్టర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో పిల్లలకు మంచి స్పర్శ, చెడు స్పర్శలపై నిర్వహించిన న్యాయ విజ్ఞాన సదస్సులో ఆమె పాల్గొని మాట్లాడారు. పిల్లల కిడ్నాప్లు, లైంగిక వేధింపులు అనేకం చూస్తున్నామని, వాటి నుంచి ఎవరికివారు కాపాడుకోవాల్సిన అవసరముందన్నారు. కొందరు తల్లిదండ్రులు పిల్లలకు సున్నితమైన విషయాలను నేర్పేందుకు ఇబ్బంది పడుతున్నారని, అటువంటి వారిలో మార్పు రావాల్సి ఉందని చెప్పారు. పిల్లలకు ఇలాంటి విషయాల్లో అవగాహన లేకపోవడంతో దారుణాలు జరుగుతున్నాయన్నారు. ఇలాంటి విషయాలపై పిల్లలతో చర్చించినప్పుడే వారిలో చైతన్యం వస్తుందని చెప్పారు. కార్యక్రమంలో చైల్డ్ చాప్టర్ అసోసియేషన్ అధ్యక్షుడు జాకీర్ హుస్సేన్తోపాటు పాఠశాల ఉపాధ్యాయులు పాల్గొన్నారు.