నకిలీ డాక్యుమెంట్లు సృష్టించి భూకబ్జాకు యత్నం
ABN , Publish Date - May 11 , 2024 | 12:15 AM
నకిలీ డాక్యుమెంట్తో భూకబ్జాకు యత్నించిన నిందితులను కీసర పోలీసులు అరెస్ట్ చేశారు.
నిందితుల అరెస్టు
కీసర రూరల్, మే 10: నకిలీ డాక్యుమెంట్తో భూకబ్జాకు యత్నించిన నిందితులను కీసర పోలీసులు అరెస్ట్ చేశారు. సీఐ వెంకటయ్య తెలిపిన కథనం ప్రకారం.. సఫిల్గూడకు చెందిన గౌలికర్ రాజేంద్రప్రసాద్, లాలాపేట్కు చెందిన దారం సాయినాథ్, కేపీహెచ్బీ కాలనీకి చెందిన మాదాడి సంగీత, లాలాపేట్ వాసి గౌలికర్ మణికంఠతో పాటు మరి కొంత మంది కలిసి ముఠాగా ఏర్పడ్డారు. వీరంతా కలిసి నగరంలో నివసిస్తున్న మున్ని రాణి తండ్రికి చెందిన కీసర మండలం నాగారం మున్సిపాలిటీ రాంపల్లి రెవెన్యూ సర్వే నంబర్ 381 నుండి 384, 387లో ఏర్పాటు చేసిన లక్ష్మినగర్ కాలనీలోని ప్లాట్ నంబర్ 373లోని 500చదరపు గజాల స్థలాన్ని కబ్జా చేసేందుకు యత్నించారు. ఇందుకు లాలాపేట్లో ఉంటూ కూలిపని చేసుకునే పద్మ పేర నకిలీ దస్తావేజును సృష్టించారు. ఆతర్వాత పథకం ప్రకారం పద్మ నుండి కొనుగోలు చేస్తున్నట్లుగా రాజేంద్రప్రసాద్ పేర రిజిస్ట్రేషన్ చేయించుకున్నారు. అనంతరం రాజేంద్రప్రసాద్ నుంచి మాదాడి యుగెందర్రెడ్డి పేర రిజిస్ట్రేషన్ చేయించుకున్నారు. అతను రూ.60లక్షలకు వైశాలికి విక్రయించారు. ఇదిలా ఉండగా మున్ని రాని ఆన్లైన్లో ఈసీ సెర్చ్ చేయగా వారి ప్లాట్ నంబర్పైన మరొకరి పేరు ఉండటంతో వెంటనే కీసర పోలీసులను ఆశ్రయించింది. విచారణ చేపట్టిన పోలీసులు కూపీ లాగారు. అందులో భాగంగా రాజేంద్రప్రసాద్, దారంసచిన్, మాదాడి సంగీత, గౌలికర్ మనికంఠలను అదుపులోకి తీసుకున్నారు. కాగా పాత్రదారులైన మహేష్, సోమ్నాథ్, ముక్క ఆంజనేయులు, రాంసింగ్, యుగెందర్రెడ్డిలు పరారీలో ఉన్నారు.