ఆముదాల చెరువుఎఫ్టీఎల్లో వెంచర్?
ABN , Publish Date - Apr 23 , 2024 | 12:33 AM
చెరువు, కుంటల పరిరక్షణ, ఎఫ్టీఎల్ భూములు అన్యాక్రాంతం కాకుండా ప్రభుత్వం ఎన్ని చట్టాలు రూపొందించినా కొందరు రియల్టర్లు వెంచర్లు చేస్తున్నారు.
మట్టిపోసి చదును చేయిస్తున్న రియల్టర్లు
గొల్లూరు చెరువు కనుమరుగేనా?
మహేశ్వరం, ఏప్రిల్ 22 : చెరువు, కుంటల పరిరక్షణ, ఎఫ్టీఎల్ భూములు అన్యాక్రాంతం కాకుండా ప్రభుత్వం ఎన్ని చట్టాలు రూపొందించినా కొందరు రియల్టర్లు వెంచర్లు చేస్తున్నారు. మహేశ్వరం మండలం గొల్లూరులోని ఆముదాల చెరువు ఎఫ్టీఎల్లో మట్టితో చదును చేస్తున్నారు. చెరువు మొత్తం 42 ఎకరాలుండగా 10 ఎకరాలకుపైగా ఎఫ్టీఎల్లో పట్టాభూమి ఉంది. రైతు గోపయ్య తదితరుల పేర్లతో ఉన్న ఈ ఎఫ్టీఎల్ భూములను కొందరు రియల్ఎస్టేట్ వ్యాపారులు కారుచౌకగా కొన్నారు. ఇక్కడి భూములకు ఎకరం రూ.6కోట్ల ధర ఉంది. కొన్న ఎఫ్టీఎల్ భూమిలో రాత్రికి రాత్రి టిప్పర్లతో మట్టి నింపుతూ చదును చేస్తున్నారు. ఎఫ్టీఎల్లో వెంచర్కు ఏర్పాట్లు చేస్తున్నారు. చెరువు నిండితే ఎఫ్టీఎల్ పరిధి పదెకరాలూ మునుగుతుంది. భూమి కొన్న రియల్టర్లు చదునుచేసి అమాయకులకు అంటగట్టే ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పటికైనా రెవెన్యూ, ఇరిగేషన్ అధికారులు స్పందించి ఆముదాల చెరువును రక్షించాలని గ్రామస్తులు కోరుతున్నారు. కాగా ఈ అంశంపై నీటిపారుదల శాఖ ఏఈ గోవింద్ స్పందిస్తూ గొల్లూరులోని ఆముదాల చెరువు ఎఫ్టీఎల్లో మట్టిపోసినా, నిర్మాణాలు చేపట్టినా వాటిని తొలగిస్తామన్నారు. ఎఫ్టీఎల్లో పట్టా భూములు ఉన్నా అవి తేలినప్పుడు వ్యవసాయం మాత్రమే చేసుకోవాలని గానీ ఎలాంటి నిర్మాణాలు, వెంచర్లు, ఇతర వాణిజ్య కార్యకలాపాలు చేపట్టవద్దని తెలిపారు. పోసిన మట్టిని వారం రోజుల్లో తొలగించకుంటే మట్టిపోసిన వారికినోటీసులు జారీచేస్తామన్నారు. అలాగే ఎఫ్టీఎల్ను తాజాగా సర్వే చేసి హద్దులు పాతుతాం అని, ఎఫ్టీఎల్లో మట్టి పోయించిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటాం అని ఏఈ తేల్చి చెప్పారు.