Share News

బైక్‌పై నుంచి పడి వ్యక్తి మృతి

ABN , Publish Date - Apr 19 , 2024 | 12:35 AM

బైక్‌పై నుంచి పడి ఓ యువకుడు మృతిచెందాడు. ఈ ఘటన బషీరాబాద్‌-తాండూరు ప్రధాన రోడ్డులో నారాయణపూర్‌ గేటు వద్ద చోటుచేసుకుంది.

బైక్‌పై నుంచి పడి వ్యక్తి మృతి

బషీరాబాద్‌, ఏప్రిల్‌ 18: బైక్‌పై నుంచి పడి ఓ యువకుడు మృతిచెందాడు. ఈ ఘటన బషీరాబాద్‌-తాండూరు ప్రధాన రోడ్డులో నారాయణపూర్‌ గేటు వద్ద చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. గొట్టిగకలాన్‌కు చెందిన శేఖర్‌గౌడ్‌(36) భార్య, కూతురుతో కలిసి తాండూరులో నివాసముంటున్నాడు. అక్కడే ఉంటూ ఓ ప్రైవేట్‌ ఫైనాన్స్‌లో ఉద్యోగం చేస్తున్నాడు. స్వగ్రామానికి వచ్చిన ఆయన మంగళవారం రాత్రి ఇంటినుంచి తాండూరుకు తన బైక్‌పై వెళ్తుండగా బైక్‌ అదుపుతప్పి పొలాల్లోకి దూసుకెళ్లింది. తీవ్రగాయాలపాలైన శేఖర్‌గౌడ్‌ అక్కడికక్కడే మృతిచెందాడు. ఉదయం పొలం యజమాని వచ్చి చూడగా అప్పటికే వ్యక్తి విగతజీవిగా పడి ఉన్నాడు. అటు వైపుగా జుంటుపల్లి జాతర ఉత్సవాలకు వెళ్తున్న బషీరా బాద్‌ ఎస్‌ఐ రమే్‌షకుమార్‌ పరిశీలించారు. స్థానికులు మృతుడిని గుర్తుపట్టి కుటుంబసభ్యులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు పంచనామా నిర్వహించి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం తాండూరు జిల్లా ఆస్పత్రికి తరలించారు. అనంతరం మృతదేహాన్ని కుటుంబసభ్యులకు అప్పగించారు. మృతుడి భార్య సిద్దేశ్వరి ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ తెలిపారు. శేఖర్‌గౌడ్‌కు రూ.4లక్షల వరకు అప్పుకావడంతో ఎలాతీర్చాలో తెలియక మనస్తాపానికి గురయ్యేవాడని కుటుంబసభ్యులు వాపోయారు.

ట్రాక్టర్‌ బోల్తాపడి డ్రైవర్‌..

తాండూరు రూరల్‌: ట్రాక్టర్‌ బోల్తాపడి డ్రైవర్‌ మృతి చెందిన ఘటన మండలంలోని నారాయణపూర్‌ గేటు వద్ద గురువారం రాత్రి చోటుచేసుకుంది. కరన్‌కోట్‌ ఎస్‌ఐ విఠల్‌రెడ్డి తెలిపిన వివరాలిలా ఉన్నాయి. బషీరాబాద్‌ మండలం మంతట్టి గ్రామానికి చెందిన మల్లేష్‌(30) ట్రాక్టర్‌ తీసుకుని తాండూరు వస్తున్నాడు. ఈ క్రమంలో తాండూరు మండలం నారాయణపూర్‌ గేటు వద్దకు రాగానే ట్రాక్టర్‌ అదుపుతప్పి బోల్తాపడింది. దీంతో ట్రాక్టర్‌ డ్రైవర్‌ అక్కడికక్కడే మృతిచెందినట్లు ఎస్‌ఐ విఠల్‌రెడ్డి తెలిపారు.

Updated Date - Apr 19 , 2024 | 07:40 AM