Share News

ఏప్రిల్‌ 6న కాంగ్రెస్‌ భారీ బహిరంగ సభ

ABN , Publish Date - Mar 28 , 2024 | 11:54 PM

జనజాతర పేరుతో కాంగ్రెస్‌ పార్టీ లోక్‌సభ ఎన్నికల ప్రచారం మొదలుపెట్టేందుకు మహేశ్వరం మండలం తుక్కుగూడ మరోసారి వేదిక కానుంది.

ఏప్రిల్‌ 6న కాంగ్రెస్‌ భారీ బహిరంగ సభ

జనజాతర పేరుతో తుక్కుగూడలో నిర్వహణ

మహేశ్వరం నియోజకవర్గం నుంచి 25 వేలకు పైగా జన సమీకరణ

ఏర్పాట్లకు సిద్ధమవుతున్న

మహేశ్వరం కాంగ్రెస్‌ నేతలు

మహేశ్వరం, మార్చి 28 : జనజాతర పేరుతో కాంగ్రెస్‌ పార్టీ లోక్‌సభ ఎన్నికల ప్రచారం మొదలుపెట్టేందుకు మహేశ్వరం మండలం తుక్కుగూడ మరోసారి వేదిక కానుంది. ఈమేరకు ఏప్రిల్‌ 6న భారీ బహిరంగ సభ నిర్వహించేందుకు అధిష్టానం నిర్ణయించింది. ఈ సభకు మహేశ్వరం నియోజకవర్గం నుంచి 25 వేలకు పైగా జనసమీకరణ చేసేందుకు ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు చల్లా నర్సింహారెడ్డి, నియోజకవర్గ ఇన్‌చార్జి కిచ్చన్నగారి లక్ష్మారెడ్డి(కేల్లార్‌)తో పాటు పార్టీకి చెందిన ఇతర ముఖ్యనాయకులు ఏర్పాట్లలో నిమగ్నమయ్యారు. సీఎం రేవంత్‌రెడ్డి అసెంబ్లీ ఎన్నికలకు ముందు 2023 సెప్టెంబరు 17న తుక్కుగూడలో విజయభేరి పేరుతో భారీ బహిరంగ సభ నిర్వహించారు. సోనియా, రాహుల్‌గాంధీ, మల్లిఖార్జున్‌ ఖర్గేలతో పాటు తదితర అగ్రనాయకులు హాజరయ్యారు. అదే తరహాలో ఇప్పుడు జరగబోయే లోక్‌సభ ఎన్నికలకు కూడా ప్రచారం ఇక్కడి నుంచే మొదలుపెట్టాలని టీపీసీసీ నేతలతో పాటు రేవంత్‌రెడ్డి నిర్ణయించారు. లోకసభ ఎన్నికల షెడ్యూల్‌ విడుదలైన తర్వాత కాంగ్రెస్‌ ఏర్పాటు చేస్తున్న మొదటిసభకు తుక్కుగూడ వేదిక కానుండడంతో అధిక ప్రాధాన్యత సంతరించుకుంది. ఆరు గ్యారెంటీల తరహాలోనే లోకసభ ఎన్నికల సందర్భంగా కాంగ్రెస్‌ దేశవ్యాప్తంగా రూపొందించిన మేనిఫెస్టోను తుక్కుగూడలో ప్రకటించనున్నారు. ఈ సభను చరిత్రలో నిలిచేలా అన్ని జిల్లాల నుంచి భారీగా జన సమీకరణచేసి విజయవంతమయ్యేలా చేయాలని నాయకులు ప్రణాళికలు రూపొందిస్తున్నారు. కాగా, సభ ఏర్పాట్లకు పార్టీ అధిష్టానం నుంచి ఏ క్షణంలో ఎవరికి పిలుపు వస్తుందో? ఏ బాధ్యత అప్పజెప్పుతారోనని నియోజకవర్గ నాయకుల్లో టెన్షన్‌ మొదలైంది. ఈమేరకు నేడు(శుక్రవారం) తుక్కుగూడలోని పార్టీ కార్యాలయంలో నియోజకవర్గస్థాయి కార్యకర్తల సమావేశం ఏర్పాటు చేయనున్నారు.

Updated Date - Mar 28 , 2024 | 11:54 PM