బస్ కండక్టర్పై చేయిచేసుకున్న యువకుడిపై కేసు
ABN , Publish Date - Sep 10 , 2024 | 11:45 PM
విధినిర్వహణలో ఉన్న ఆర్టీసీ బస్ కండక్టర్ ను దూషించి చేయిచేసుకున్న యువకుడిపై కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ వేణుగోపాల్గౌడ్ తెలిపారు.
ధారూరు, సెప్టెంబరు 10: విధినిర్వహణలో ఉన్న ఆర్టీసీ బస్ కండక్టర్ ను దూషించి చేయిచేసుకున్న యువకుడిపై కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ వేణుగోపాల్గౌడ్ తెలిపారు. వివరాలిలా ఉన్నాయి. పరిగి మండలం మిట్టకోడూర్ గ్రామానికి చెందిన సునీత వికారాబాద్ డిపోలో కండక్టర్గా పనిచేస్తోంది. వికారాబాద్-తాండూర్ బస్లో సోమవారం సాయంత్రం ఆమె విధులు నిర్వహిస్తుండగా వికారాబాద్లో స్టేషన్ ధారూరుకు చెందిన యువకుడు వి.బాలు బస్ ఎక్కాడు. తాండూర్కు టికెట్ అడగగా ఆమె టికెట్ ఇచ్చింది. ధారూరు సమీపంలోకి బస్ రాగానే బాలు తనకు డబ్బులు ఇవ్వాలని కండక్టర్ సునీతను అడిగాడు. దీంతో తాండూర్ టికెట్ తీసుకున్నావు కదా అక్కడే ఇస్తానని కండక్టర్ చెప్పటంతో బాలు ఆగ్రహంతో ఆమెపై దుర్భాషలాడాడు. అంతటితో ఆగకుండా కండక్టర్ చెంపపై లాగి కొట్టి అక్కడి నుంచి వెళ్లిపోయాడు. విధి నిర్వహణలో ఉన్న తనను దూషించి, చేయిచేసుకున్న బాలుపై చర్య తీసుకోవాలని సోమవారం రాత్రి సునీత పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈమేరకు నిందితుడు బాలుపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ తెలిపారు.