10 రోజుల్లో ధాన్యం కొనుగోళ్లు పూర్తి చేస్తాం
ABN , Publish Date - Apr 23 , 2024 | 11:52 PM
మోత్కూరు వ్యవసాయ మార్కెట్తోపాటు అన్ని కేంద్రాల్లో ధాన్యం కొనుగోళ్లు 10 రోజుల్లో పూర్తి చేస్తామని పౌరసరఫరాల జిల్లా మేనేజర్ గోపీకృష్ణ అన్నారు.
పౌరసరఫరాల డీఎం గోపీకృష్ణ
మోత్కూరు, ఏప్రిల్ 23: మోత్కూరు వ్యవసాయ మార్కెట్తోపాటు అన్ని కేంద్రాల్లో ధాన్యం కొనుగోళ్లు 10 రోజుల్లో పూర్తి చేస్తామని పౌరసరఫరాల జిల్లా మేనేజర్ గోపీకృష్ణ అన్నారు. మంగళవారం మోత్కూరు, ఆత్మకూరు(ఎం), గుండాల మండల కేంద్రాల్లోని ధాన్యం కొనుగోలు కేంద్రాలను, ధనలక్ష్మీ, శ్రీనివాస రైస్ మిల్లులను ఆయన పరిశీలించి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. తూకం వేసిన ధాన్యం బస్తాల ఎగుమతికి లారీలు రాకపోవడం, రైస్ మిల్లుల్లో లారీలు వెంటనే దిగుమతి కాకపోవడం, హమాలీలు సహకరించకపోవడంతో కొనుగోళ్లు మందకొడిగా సాగుతున్నాయని రైతు లు ఆయన దృష్టికి తెచ్చారు. లారీలు ఎక్కువగా పం పాలని ట్రాన్స్పోర్టు కాంట్రాక్టర్ యాదయ్యను, మిల్లు ల్లో వెంటనే దిగుమతి చేసుకోవాలని మిల్లుల యజమానులను, హమాలీలతో మాట్లాడి తూకాలు, లోడిం గ్ వేగంగా జరిగేలా చూడాలని మార్కెట్ కార్యదర్శిని ఆదేశించారు. సంఘం సీఈవో కె.వరలక్ష్మి, మార్కెట్ కార్యదర్శి ఉమామహేశ్వర్రావు, ట్రాన్స్పోర్టు కాంట్రాక్టర్ యాదయ్య, మిల్లు యజమానులు బుస్సా శ్రీనివాస్, తిపిరిశెట్టి శ్రీనివాస్ ఆయన వెంట ఉన్నారు.