మిస్టరీగా క్యాష్డిపాజిటర్ మృతి
ABN , Publish Date - Aug 21 , 2024 | 12:05 AM
నల్లగొండ జిల్లా మిర్యాలగూడ మండలంలో ఏటీఎం క్యాష్డిపాజిటర్ మృతి మిస్టరీగా మారింది. తోడు ఉంటేనే వెళ్లడం ఇబ్బందికరంగా ఉన్న సాగర్ సమీపంలోని దట్టమైన కిలోమీటర్ అటవీ ప్రాంతంలోకి ఎలా వెళ్లాడా? అన్న ప్రశ్న తలెత్తుతోంది.
హత్యా..ఆత్మహత్యా..?
మిర్యాలగూడ అర్బన, ఆగస్టు 20 : నల్లగొండ జిల్లా మిర్యాలగూడ మండలంలో ఏటీఎం క్యాష్డిపాజిటర్ మృతి మిస్టరీగా మారింది. తోడు ఉంటేనే వెళ్లడం ఇబ్బందికరంగా ఉన్న సాగర్ సమీపంలోని దట్టమైన కిలోమీటర్ అటవీ ప్రాంతంలోకి ఎలా వెళ్లాడా? అన్న ప్రశ్న తలెత్తుతోంది. తోడుగా ఎవరైనా వెళ్లారా? ఆత్మహత్య చేసుకున్న ప్రదేశానికి పాతిక అడుగుల దూరంలో కనిపించే బీరు బాటిళ్లు, బిర్యానీ ప్యాకెట్లు ఎవరు తెచ్చారు? ఎంతమంది కలిసి తాగి, తిన్నారన్నది ప్రశ్నార్థకంగా మారింది. నెల్లికల్ ఫారెస్ట్ బీట్లోని వినాయక దేవాలయం వెనుక సోమవారం పశువుల కాపారి సమాచారంతో పోలీసులకు లభ్యమైన మృతదేహం సుమారు వారం రోజుల క్రితమే ఆత్మహత్య చేసుకున్న వ్యక్తిదిగా నిర్ధారించారు. అతడి జేబులో లభ్యమైన కార్డు ఆధారంగా ఇటాచీక్యాష్ మేనేజ్మెంటు సంస్థలో పనిచేసే క్యాష్ డిపాజిటర్ పగడాల సుధాకర్గా పోలీసులు నిర్ధారించారు. అప్పటికే అతడిపై మిర్యాలగూడ వనటౌన పోలీ్సస్టేషనలో అప్పటికే ఫిర్యాదు ఉండటంతో గుర్తించి కుటుంబసభ్యులకు సమాచారమిచ్చారు. అయితే సుధాకర్ మృతిపై సర్వత్రా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇది హత్యా?, ఆత్మహత్యా అనే సందిగ్ధం నెలకొంది.
సుధాకర్ ఉరివేసుకున్న చెట్టును షూతో ఎలా ఎక్కాడన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి. చెట్టు చివరికి ఎక్కి అక్కడ తాడు బిగించుకుని దూకి చావడం అసాధ్యమంటున్నారు. అంత ఎత్తు నుంచి ఆ వేగానికి కొమ్మ విరిగిపడి ఉండేదని స్థానికులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఈ కేసులో కొందరి పాత్ర ఖచ్చితంగా ఉంటుందన్న సందేహాన్ని వ్యక్తం చేస్తుందన్నారు. పక్కాప్లాన ప్రకారమే ఈ సంఘటనను చిత్రీకరించారన్న సందేహాలు సైతం వ్యక్తమవుతున్నాయి.
పోలీసుల విచారణపై సందేహాలు
సుధాకర్ కనిపించకపోవడంపై ఫిర్యాదు వారం కిందటే ఫిర్యాదు అందింది. అయితే భార్యను పోలీ్సస్టేషనకు పిలిపించి పూచికత్తుపై వదిలేస్తూ కాలం వెళ్లబుచ్చారన్న ఆరోపణలు ఉన్నాయి. అతడి మృతదేహం లభ్యమయ్యే వరకూ సాంకేతిక పరిజ్ఞానం అందుబాటులో ఉన్నా సెల్ఫోన ఆ మేరకు వినియోగించలేదన్న విమర్శలు ఉన్నాయి. డిపాజిట్క్యాష్ కాజేసినట్లుగా ఆరోపణలు ఎదుర్కొంటున్న సుధాకర్ సెల్ఫోనను పోలీసులు స్వాధీపర్చుకున్నారు. ఆ సెల్ఫోనను కాల్డేటాతో పాటు ఇతర ఆనలైన యాప్ల వాడకాన్ని పరిశీలిస్తే ఈ కేసులో కొంత పురోగతి లభిస్తుందన్న ఆశాభావాన్ని ప్రతి ఒక్కరూ వ్యక్తం చేస్తున్నారు.
రూ. 20లక్షల నగదు ఏమైనట్టు?
నల్లగొండ జిల్లా వేములపల్లి మండలం శెట్టిపాలెం గ్రామానికి చెందిన పగడాల సుధాకర్(38) కొన్నేళ్లుగా ఇటాచీక్యాష్ మేనేజ్మెంట్ సంస్థలో ఏటీఎం క్యాష్ డిపాజిటర్గా పనిచేస్తున్నాడు. అయితే బ్యాంకులకు అనుసంధానంగా పనిచేసే ఏటీఎంలో క్యాష్ డిపాజిట్ చేసేసందర్భంలో సదరు బ్యాంక్ అకౌంటెంట్ పర్యవేక్షణలో క్యాష్ ఆఫీసర్, సెక్యూరిటీగార్డ్ నిఘాలో డిపాజిటర్లు క్యాస్డిపాజిట్ చేస్తుంటారు. బ్యాంకులకు దూరంగా పనిచేసే ఏటీఎంలో క్యాష్ డిపాజిట్ చేసేందుకు సెక్యూరిటీగార్డు, ఇద్దరు క్యాష్ డిపాజిటర్లు వెళ్తుంటారు. అయితే ఈ నెల 13న క్యాష్డిపాజిట్ చేసేందుకు సుధాకర్తో కలిసి వెళ్లింది ఎంతమంది.. ఆ రోజు మిర్యాలగూడ, దామరచర్ల, అడవిదేవులపల్లి, హాలియా రూట్లో క్యాస్ డిపాజిట్ చేయాల్సి ఉన్నట్లు సమాచారం. అయితే ఏరూట్లో వెళ్తుండగా డిపాడిజిట్ క్యాష్తో ఉడాయించాడన్నది మాత్రం తెలియరావడం లేదు. సుధాకర్ క్యాష్బిండళ్లతో పారిపోతుంటే అతడితో పాటున్న వ్యక్తులు వెంబడించారా, వదిలేశారా? ఆ తరువాత ఏం జరిగింది.. నిందితుడు కాజేసిన డబ్బు ఏమైంది. ఎవరిచేతికి చిక్కిందన్నది మిస్టరీగా మారింది. డబ్బుతో సుధాకర్ అజ్ఞాతంలోకి వెళ్లి తలదాచుకున్నాడని భావించిన పోలీసులకు అతడి మృతదేహం సాగర్ పోలీ్సస్టేషన పరిధిలోని దట్టమైన అటవీ ప్రాంతంలో లభ్యం కావడంతో కేసు స్వరూపం మలుపుతిరిగింది. ఎన్నో సందేహాలతో కూడిన కేసు మిస్టరీని ఛేదించేందుకు పోలీసులు అన్నికోణాల్లో సమగ్రవిచారణ చేపట్టాల్సిన అవసరత ఏర్పడింది.