ఇంటర్ పరీక్షల డీవో విధుల నుంచి తొలగింపు
ABN , Publish Date - Mar 12 , 2024 | 11:36 PM
ఇంటర్ పరీక్షా కేంద్రంలో మహిళా ఇన్విజిలేటర్తో దురుసుగా వ్యవహరించిన డిపార్ట్మెంట్ ఆఫీసర్(డీవో)ను విధుల నుంచి తొలగించారు.
కొండమల్లేపల్లి, మార్చి 12: ఇంటర్ పరీక్షా కేంద్రంలో మహిళా ఇన్విజిలేటర్తో దురుసుగా వ్యవహరించిన డిపార్ట్మెంట్ ఆఫీసర్(డీవో)ను విధుల నుంచి తొలగించారు. కొండమల్లేపల్లిలో జరిగిన ఈ సంఘటనకు సంబంధించిన వివరాలిలా ఉన్నాయి. కొండమల్లేపల్లి మండల కేంద్రంలోని ఎస్సీ గురుకుల బాలికల కళాశాలలో ఇంటర్ పరీక్షా కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. డిండి ప్రభుత్వ కళాశాల అధ్యాపకుడు బత్తుల సాయిలు ఈ కేంద్రానికి డిపార్ట్మెంట్ ఆఫీసర్గా వ్యవహరిస్తున్నారు. ఈ నెల 2వ తేదీన పరీక్షాకేంద్రంలో విధులు నిర్వహిస్తున్న మహిళా ఇన్విజిలేటర్(లెక్చరర్)తో సాయిలు దురుసుగా మాట్లాడారు. దీంతో ఆమె సాయిలుపై జిల్లా ఇంటర్ బోర్డు అధికారులకు ఫిర్యాదు చేయగా, విచారణ అనంతరం విధుల నుంచి తొలగించినట్లు డీఐఈవో దస్రూనాయక్ మంగళవారం తెలిపారు. సైదులు స్థానంలో డిండి ప్రభుత్వ కళాశాలలో విధులు నిర్వహిస్తున్న పాండురంగయ్యను డీవోగా నియమించారు. ఇదిలా ఉండగా గతంలోనూ డిండి మండల కేంద్రంలోని ఓ ప్రైవేటు కళాశాలలో నిర్వహించిన ఇంటర్ ప్రాక్టికల్స్ పరీక్షల సమయంలో నిబంధనలకు విరుద్ధంగా ప్రవర్తించినందుకు సాయిలును విధుల నుంచి తొలగించారు.