Share News

నేటి నుంచి అందుబాటులోకి కొనుగోలు కేంద్రాలు

ABN , Publish Date - Mar 27 , 2024 | 11:34 PM

యాసంగి ధాన్యం కొనుగోళ్ల కోసం ఈ నెల 28వ తేదీ నుంచి కేంద్రాలను ప్రారంభిస్తున్నట్లు అదనపు కలెక్టర్‌ జే శ్రీనివాస్‌ అన్నారు. ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో మౌ లిక సదుపాయాలను కల్పించాలని ఆదేశించారు. 2023-24 యాసంగి ధాన్యం కొనుగోలు కేంద్రాల నిర్వహణపై బుధవారం జిల్లా పౌరసరఫరాల శాఖ ఆధ్వర్యంలో కలెక్టరేట్‌లో బుధవారం నిర్వహించిన శిక్షణా కార్యక్రమంలో ఆయన మాట్లాడారు.

నేటి నుంచి అందుబాటులోకి కొనుగోలు కేంద్రాలు

నల్లగొండ టౌన్‌, మార్చి 27 : యాసంగి ధాన్యం కొనుగోళ్ల కోసం ఈ నెల 28వ తేదీ నుంచి కేంద్రాలను ప్రారంభిస్తున్నట్లు అదనపు కలెక్టర్‌ జే శ్రీనివాస్‌ అన్నారు. ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో మౌ లిక సదుపాయాలను కల్పించాలని ఆదేశించారు. 2023-24 యాసంగి ధాన్యం కొనుగోలు కేంద్రాల నిర్వహణపై బుధవారం జిల్లా పౌరసరఫరాల శాఖ ఆధ్వర్యంలో కలెక్టరేట్‌లో బుధవారం నిర్వహించిన శిక్షణా కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. ధాన్యం కొనుగోలులో గతంలో ఎదురైన సమస్యలు పునరావృతం కాకుండా పకడ్బందీగా కొనుగోలు చేయాలని కేంద్రాల ఇన్‌చార్జిలకు సూచించారు. వేసవి దృష్ట్యా ఎండలు ఎక్కువగా ఉన్నందున కొనుగోలు కేంద్రాల వద్ద తాగునీరు, నీడ వంటి మౌలిక సదుపాయాల ను కల్పించాలన్నారు. సగటు నాణ్యతా ప్రమాణాల ప్రకారం ధాన్యంలో తేమ, తాలు శాతం సరిగా ఉండేలా చూసుకోవాలన్నారు. ఈ విషయంపై కొనుగోలు కేంద్రాల నిర్వాహకులు రైతులకు అవగాహన కల్పించాలని కోరారు. రైతుల ద్వారానే ధాన్యాన్ని కొనుగోలు చేయాలని, మధ్య దళారుల ప్రమేయం ఉండరాదన్నారు. అంర్రాష్ట్ర సరిహద్దుల వద్ద చెక్‌పోస్టులను ఏర్పాటుచేసి నిరంతరం తనిఖీలు చేస్తామన్నారు. నిర్వాహకులు ఒకవేళ బయటి రాష్ట్రం నుంచి వచ్చే ధాన్యాన్ని కొనుగోలు చేస్తే తగిన చర్యలు తప్పవని హెచ్చరించారు. ధాన్యం కొనుగోలు సందర్భంలో ఏవైనా సమస్యలు వస్తే స్థానిక తహసీల్దార్‌, ఆర్డీవోలు పరిష్కరించడానికి అందుబాటులో ఉంటారని తెలిపారు. ఎన్నికల కోడ్‌ నేపథ్యంలో కొనుగోలు కేంద్రాలను ప్రజాప్రతినిధులు ఎవరూ ప్రారంభించకూడదని అలాగే ప్రారంభంలో ప్రజాప్రతినిధులెవ రు పాల్గొనకూడదని స్పష్టం చేశారు. అలాగే ధాన్యం కొనుగోలు కేంద్రాల వద్ద ఎటువంటి రాజకీయపరమైన ఫ్లెక్సీలు ఉండకూడదన్నారు. కోడ్‌ ఉల్లంఘిస్తే క్రిమినల్‌ కేసులు నమోదు అవుతాయని హెచ్చరించారు. ధాన్యం కొనుగోలులో పౌరసరఫరాలు, డీఆర్‌డీవో, వ్యవసాయ, జిల్లా కోఆపరేటివ్‌, మార్కెటింగ్‌, తూనికలు కొలతలు, ట్రాన్స్‌పోర్టు శాఖలు సమన్వయంతో పనిచేసి రైతులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా చూడాలన్నారు. శిక్షణా కార్యక్రమంలో జిల్లా పౌర సరఫరాల అధికారి వెంకటేశ్వర్లు, సివిల్‌ సప్లయ్‌ జిల్లా మేనేజర్‌ నాగేశ్వరరావు, డీఆర్‌డీవో నాగిరెడ్డి, డీసీవో కరుణాకర్‌, జిల్లా వ్యవసాయ శాఖ అధికారి శ్రవణ్‌, జిల్లా తూనికలు కొలతలు అధికారి రామకృష్ణ, జిల్లా మార్కెటింగ్‌ అధికారి శ్రీకాంత్‌, జిల్లా ట్రాన్స్‌పోర్టు అధికారి పాల్గొన్నారు.

Updated Date - Mar 27 , 2024 | 11:34 PM