పాఠశాలలకు కొత్తహంగులు
ABN , Publish Date - Jun 03 , 2024 | 12:38 AM
ప్రభుత్వ పాఠశాలలో నాణ్యమైన విద్యతో పాటు, మౌలిక వసతుల కల్పన, మారుతున్న కాలానికి అనుగుణంగా విద్యార్థులకు సౌకర్యాలు కల్పించడానికి ప్రభుత్వం చర్యలు చేపట్టింది.
![పాఠశాలలకు కొత్తహంగులు](https://media.andhrajyothy.com/media/2024/20240530/2_Ntkl_2_25f9fb1c7e.jpg)
నూతనకల్, జూన 2 : ప్రభుత్వ పాఠశాలలో నాణ్యమైన విద్యతో పాటు, మౌలిక వసతుల కల్పన, మారుతున్న కాలానికి అనుగుణంగా విద్యార్థులకు సౌకర్యాలు కల్పించడానికి ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఇటీవల కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత పాఠశాలల యాజమాన్య కమిటీలను రద్దు చేసి వాటిస్థానంలో అమ్మ ఆదర్శ కమిటీలను ఏర్పాటు చేసింది. ఆయా కమిటీలకు సంఘ బంధాల అధ్యక్షులను చైర్మనలుగా నియమించి మహిళా సంఘాలకు బాధ్యతను అప్పగించింది. ఈ పథకంలో ఎంపిక చేసిన పాఠశాలలకు ఏప్రిల్లోనే నిధులు విడుదల చేసి పనులు ప్రారంభించారు. మండలంలో మొత్తం 34 పాఠశాలలకు 11 పాఠశాల్లో గత ప్రభుత్వంలో మన ఊరు - మన బడి పథకం కింద పనులు చేపట్టారు. ప్రస్తుతం కేజీబీవీ పాఠశాలను మినహాయించి మిగతా 22 పాఠశాలలో పనులు కొనసాగుతున్నాయి. విద్యుద్దీకరణ పనులు, మరుగుదొడ్ల నిర్మాణాలు, అదేవిధంగా నీటి సౌకర్యం పనులు పూర్తిచేయించారు.
అధికారుల పర్యవేక్షణలో
అమ్మ ఆదర్శ పాఠశాలలో కొనసాగుతున్న పనులను ఎప్పటికప్పుడు మండల స్థాయి అదికురులు పర్యవేక్షిస్తున్నారు. జిల్లాస్థాయిలో కలెక్టర్ ఎప్పటికప్పుడు వీడియో కాన్ఫరెన్స ద్వారా పనుల పురోగతిని తెలుసుకుంటూ ఉరకలు పెట్టిస్తున్నారు. పాఠశాలలో చేపట్టిన పనులకు ప్రభుత్వం 25శాతం నిధులను ముందుగానే కేటాయించింది. మిగతా పనులకు ఎంబీ రికార్డుల ఆధారంగా నిధులు మంజూరు చేస్తామని అధికారులు తెలిపారు. ప్రతీ పాఠశాలలో మరుగుదొడ్ల నిర్మాణం, మంచినీటి ఫ్లాట్ఫాం, మేజర్, మైనర్ రిపేర్లకు రూ.3 నుంచి రూ.6లక్షల వరకు ప్రభత్వం నిదులు కేటాయిస్తుంది. జూన 12వ తేదీ వరకు ప్రతీ పాఠశాలలో అన్ని పూర్తయ్యేలా చర్యలు తీసుకోవాలని ఎంపీడీవోలను కలెక్టర్ ఆదేశించారు.
పాఠశాలలు ప్రారంభం నాటికి పనులు పూర్తి
మండలంలో 22పాఠశాలలను అమ్మ ఆదర్శ పథకంలో గుర్తించగా పనులు కొనసాగుతున్నాయి, పాఠశాలలు పునఃప్రారంభం వరకు అన్ని పనులు పూర్తి అయ్యేల చర్యలు తీసుకుంటాం. పాఠశాలలో అన్నివసతులు ఉన్నందున విద్యార్థుల సంఖ్య పెంచడానకి కృషి చేస్తాం.
- రాములు నాయక్, ఎంఈవో