వైభవంగా మేళ్లచెర్వు జాతర ప్రారంభం
ABN , Publish Date - Mar 08 , 2024 | 12:07 AM
మేళ్లచెర్వులో అత్యంత వైభవంగా నిర్వహించే స్వయంభూ శంభులింగేశ్వరస్వామి ఆలయ మహాశివరాత్రి వేడుకలు గురువారం రాత్రి ప్రారంభమయ్యాయి.
మేళ్లచెర్వు, మార్చి 7 : మేళ్లచెర్వులో అత్యంత వైభవంగా నిర్వహించే స్వయంభూ శంభులింగేశ్వరస్వామి ఆలయ మహాశివరాత్రి వేడుకలు గురువారం రాత్రి ప్రారంభమయ్యాయి. గ్రామంలో ప్రభల ఊరేగింపు నిర్వహించారు. శివరాత్రికి ముందు రోజు నుంచి మూడు రోజుల పాటు కన్నుల పండువగా నిర్వహించే వేడుకలకు అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు. ఆలయంతో పాటు పరిసరాలు విద్యుద్దీపాల కాంతులతో మెరిసిపోతున్నాయి. శుక్రవారం మహాశివరాత్రి సందర్భంగా ప్రత్యేక పూజలు, అభిషేకాల కోసం అధికారులు ఏర్పాట్లు చేశారు.
సమన్వయంతో పనిచేయాలి: కలెక్టర్
అన్నిశాఖల అధికారులు సమన్వయంతో మహాశివరాత్రి మేళ్లచెర్వు జాతరను విజయవంతం చేయాలని కలెక్టర్ వెంకటరావు ఆదేశించారు. గురువారం జాతర ఏర్పాట్లను ఆయన పరిశీలించారు. ఆలయ ప్రాంగణంలోని క్యూలైన్లను పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేశారు. టికెట్ల ధరల వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఆలయ ప్రాంగణంలోని వాటర్ట్యాంక్ను, మెడికల్ క్యాంప్లను ప్రారంభించి, ఎద్దుల పందేల కోర్టులను పరిశీలించారు. ఆరోగ్య శాఖ అందుబాటులో ఉండి, భక్తులకు అందించే ప్రసాద నాణ్యతను పరిశీలించాలన్నారు.
భక్తులందరికీ దర్శనభాగ్యం కల్పించాలి: ఎస్పీ
భక్తులకు ప్రశాంత వాతావరణంలో దైవదర్శనం కల్పించటమే పోలీసుల ముఖ్య విధి అని ఎస్పీ రాహుల్ హెగ్డే అన్నారు. జాతర బందోబస్తుపై సిబ్బందికి తగుసూచనలు చేశారు. పోలీసులు భక్తులను గౌరవించి, సహకారం అందించాలన్నారు. జాతరలో భద్రత కోసం 500 మంది సిబ్బందితో గట్టి బందోబస్తు నిర్వహిస్తున్నామన్నారు. కార్యక్రమంలో ట్రైనీ ఎస్పీ రాజేష్ మీనా, అదనపు ఎస్పీ నాగేశ్వరరావు, డీఎస్పీ శ్రీధర్రెడ్డి, సీఐ రంజితారెడ్డి, పోలీసు సిబ్బందితో పాటు ఆర్డీవో శ్రీనివాసరావు, తహసీల్దార్ జ్యోతి తదితరులు పాల్గొన్నారు.