ఈ దారిలో నడిచేది ఎలా..?
ABN , Publish Date - Jul 28 , 2024 | 12:26 AM
మండలంలోని పాలడుగు గ్రామంలో పాత గ్రామం నుంచి మెయిన రోడ్డుకు శ్మశాన వాటిక ముందు నుంచి వెళ్లే రహదారి కొద్ది పాటి ముసుర్లకే బురదమయమై నడవడానికి వీలు లేని స్థితిలో ఉంది.

మోత్కూరు, జూలై 27: మండలంలోని పాలడుగు గ్రామంలో పాత గ్రామం నుంచి మెయిన రోడ్డుకు శ్మశాన వాటిక ముందు నుంచి వెళ్లే రహదారి కొద్ది పాటి ముసుర్లకే బురదమయమై నడవడానికి వీలు లేని స్థితిలో ఉంది. వాహనాల చక్రాలకు మట్టి చుట్టుకుని ద్విచక్రవాహనాలు ఈ రహదారి పైనుంచి వెళ్ల లేకపోతున్నాయి. మనుషులు కాలినడకన వెళ్లలేని దుస్థితి. సీకేఆర్ ప్రభుత్వంలో జిల్లాలోని గ్రామపంచాయతీలకు ఒక్కో గ్రామ పంచాయతీకి రూ.25లక్షలు మంజూరు చేసినప్పుడు అందులోంచి ఈ రహదారికి రూ.3.50లక్షలు కెటాయించి రోడ్డు పోశారు. రోడ్డుపై నాణ్యమైన మొరం పోయకుండా సమీపంలో ఉన్న చెరువు మట్టి, చౌడు మట్టి పోయడంతో రోడ్డు ఇలా తయారైందని బీజేపీ మండల ఉపాధ్యక్షుడు గుదే మధుసూదన, ఎస్సీ మోర్చా మండల అధ్యక్షుడు కొంపెల్లి గణేష్, గ్రామ శాఖ అధ్యక్షుడు శేఖర్, అలింధర్, అజయ్, మచ్చగిరి తదితరులు ఆరోపిస్తున్నారు. గ్రామ ప్రజలు, వ్యవసాయ బావుల వద్దకు వెళ్లే రైతులు ఎక్కువగా ఈ దారి నుంచే వెళతారన్నారు. రోడ్డు బురదమయమై వారు వ్యవసాయ బావుల వద్దకు, ఇతర చోట్లకు వెళ్లడానికి నానా ఇబ్బందులు పడుతున్నారన్నారు. సంబంధిత ఉన్నతాధికారులు సందించి రోడ్డుపై బురద లేకుండా మొరం పోసి రహదారి బాగు చేయాలని బీజేపీ నాయకులతో పాటు ప్రజలు కోరుతున్నారు.