గంధమల్ల రిజర్వాయర్ ఉన్నట్లా..లేనట్లా?
ABN , Publish Date - Jan 05 , 2024 | 11:49 PM
యాదాద్రి భువనగిరి జిల్లా తుర్కపల్లి మండలం వద్ద ప్రతిపాదించిన గంధమల్ల రిజర్వాయర్ నిర్మాణం ఉన్నట్టా..? లేనట్లా..? అన్న ది ప్రశ్నార్థకంగా మారింది. ఈ రిజర్వాయర్ నిర్మాణంపై ప్ర భుత్వం నుంచి స్పష్టత లేకపోవడంతో ముంపు నిర్వాసితు లు, రైతులు అయోమయంలో పడ్డారు.
సర్వే పనులకే పరిమితం
2019 ఫిబ్రవరిలో భూసేకరణ నోటిఫికేషన్
మొదట 9.8టీఎంసీలుగా తర్వాత 4.2టీఎంసీలుగా ప్రతిపాదనలు
ఇప్పటివరకు రిజర్వాయర్ నిర్మాణంపై స్పష్టత కరువు
ఆందోళనలో ముంపు నిర్వాసితులు, రైతులు
యాదాద్రి, జనవరి 5 (ఆంధ్రజ్యోతి): యాదాద్రి భువనగిరి జిల్లా తుర్కపల్లి మండలం వద్ద ప్రతిపాదించిన గంధమల్ల రిజర్వాయర్ నిర్మాణం ఉన్నట్టా..? లేనట్లా..? అన్న ది ప్రశ్నార్థకంగా మారింది. ఈ రిజర్వాయర్ నిర్మాణంపై ప్ర భుత్వం నుంచి స్పష్టత లేకపోవడంతో ముంపు నిర్వాసితు లు, రైతులు అయోమయంలో పడ్డారు. అసలు ఈ ప్రాజెక్టు స్వరూపంపైనా ఇప్పటివరకు ఎవరికీ కూడా స్పష్టత లేదు. రిజర్వాయర్ నిర్మాణంతో ఎన్ని ఎకరాల భూమి కోల్పోతుం ది? ఎన్ని టీఎంసీల సామర్ధ్యం? ఏఏ గ్రామాల్లో ఎంత మేర కు భూసేకరణ? అనే అంశాలపై స్పష్టమైన సమాచారం లేకపోవడంతో భూనిర్వాసితులు, ప్రజలు ఆందోళన చెందుతున్నారు. అధికారికంగా ఈ రిజర్వాయర్ పనులు ఇప్పటికీ సర్వే దశలోనే ఉన్నట్టుగా చూపుతున్నారు. బీఆర్ఎస్ ప్రభు త్వం భూసేకరణ నోటిఫికేషన్ జారీచేసి చేతులు దులుపుకుంది. కాంగ్రెస్ ప్రభుత్వం ఈ ప్రాజెక్టుపై స్పష్టమైన నిర్ణ యం తీసుకుంటుందని ఆశాభావంతో ఉన్నారు. సముద్రమట్టానికి అత్యంత ఎత్తైన ప్రాంతంగా, నదీజలాల సదుపా యం లేని కరువు నేలగా ఉన్న యాదాద్రి భువనగిరి జిల్లా కు గోదావరి జలాల మళ్లింపునకు చేపట్టిన కాళేశ్వరం ప్రాజె క్టు 14, 15,16 ప్యాకేజీల కింద పనులను ప్రారంభించింది. ఉమ్మడి నల్లగొండ జిల్లాలో 2.50లక్షల ఎకరాలకు సాగునీటిని అందించే 14, 15వ ప్యాకేజీలో యాదాద్రి భువనగిరి జిల్లా తుర్కపల్లి మండలం గంధమల్ల వద్ద రిజర్యాయర్ నిర్మించేందుకు ప్రణాళికను రూపొందించింది. ఎత్తిపోతల లింక్ ప్రాజెక్టులో చివరి(టెయిల్ఎండ్)లో గంధమల్ల, బస్వాపూర్ రిజర్వాయర్లను ప్రతిపాదించారు.
హద్దురాళ్లు వేసి..
ప్రభుత్వం పూర్తి స్థాయి సర్వేకు ఆదేశించడంతో రిజర్వాయర్ నిర్మాణంతో కోల్పోతున్న భూముల్లో ప్రాజెక్టుకు సం బంధించిన హద్దురాళ్లను కూడా ఏర్పాటుచేశారు. అయితే ఇప్పటివరకు ప్రాజెక్టు నిర్మాణ పనులు సర్వేతోనే సరిపోయిందన్న విమర్శలు వ్యక్తమవుతున్నాయి. రిజర్వాయర్ నిర్మాణంపై 2019 ఫిబ్రవరిలో ప్రభుత్వం భూసేకరణ నోటిఫికేషన్ జారీచేసింది. 232ఎకరాల అటవీ భూమిని సేకరించింది. ఇప్పటివరకు ఈ పనులపై అతిగతీలేదు. ఈ రిజర్వాయర్ను మొదటగా 9.8టీఎంసీలుగా నిర్మించాలని ప్రతిపాదనలు సిద్ధం చేసింది. మల్లన్నసాగర్ రిజర్వాయర్ నుంచి కాలువల ద్వారా 2,450 క్యూసెక్కుల నీరు గంధమల్ల జలాశయానికి చేరేలా ప్రణాళికను రూపొందించారు. డిస్ర్టిబ్యూట రీ కాలువల ద్వారా 6,467ఎకరాలు, ప్రధాన ఎడమకాల్వ(ఎల్ఎంసీ)ద్వారా 37,814ఎకరాలు, కుడికాల్వ(ఆర్ఎంసీ)ద్వారా 19,901 ఎకరాలు సాగునీరు అందించేందుకు అంచనాలు రూపొందించారు. ఈ రిజర్వాయర్ నిర్మాణంతో గంధమల్ల, బచ్చలగూడెం, ఇందిరానగర్ గ్రామాలు పూర్తిగా ముంపునకు గురవుతుండగా వీరారెడ్డిపల్లిలో దాదాపుగా 1800ఎకరాలు వరకు భూములు కోల్పోయే అవకాశం ఉందని గ్రామస్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ రిజర్వాయర్ నిర్మాణంతో తుర్కపల్లి, బొమ్మలరామారం, రాజపేట, ఆలేరు, బీబీనగర్, యాదగిరిగుట్ట, ఆత్మకూరు మండలాలకు సాగునీరు అందనుంది. నూతనంగా ఏర్పడిన కాంగ్రెస్ ప్రభుత్వం సాగునీటి నిర్మాణాలపై సమీక్షలు నిర్వహిస్తోంది. ఈ ప్రాజెక్టుపై ఏదో ఒక స్పష్టమైన నిర్ణయం తీసుకుంటుందని ముంపు నిర్వాసితులు ఎదురుచూస్తున్నారు.
4.2టీఎంసీలుగా ప్రతిపాదనలు
గంధమల్ల రిజర్వాయర్ను మొదటగా 9.8 టీఎంసీలు గా నిర్మించేందుకు ప్రణాళికను సిద్ధం చేశారు. అయితే 4.2టీఎంసీలకు తగ్గిస్తూ బీఆర్ఎస్ ప్రభుత్వం నిర్ణయించి ఈమేరకు ప్రతిపాదనలు రూపొందించింది. నిర్మాణ పను లు కాంట్రాక్టర్ అప్పగించినా ఇప్పటివరకు ఎలాంటి పను లు కూడా మొదలు పెట్టలేదు. కాళేశ్వరం 14, 15,ప్యాకేజీ లో ఈ రిజర్వాయర్ నిర్మాణం చేపడుతారా? లేదా అన్నది ఇరిగేషన్ శాఖ అధికారుల వద్ద స్పష్టమైన సమాచారం లే దు. ప్రభుత్వ వెబ్సైట్ ఇంటిగ్రేటేడ్ ల్యాండ్ రికార్డ్సు మేనేజ్మెంట్ సిస్టం(ఐఎల్ఆర్ఎంఎస్) నుంచి ముంపు భూమి సర్వే నెంబర్లను తొలగించారు. భూసేకరణ జరగలేదని, పరిహారం లెక్క తేలలేదని, సర్వే నెంబర్ల తొలగించారని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రాజెక్టుపై స్పష్టత లేకపోవడంతో ముంపు గ్రామాల్లో కొత్త ఇళ్లను నిర్మించుకోలేకపోతున్నారు. బోర్లు వేయాలన్నా ఆలోచిస్తున్నారు. ఈ రిజర్వాయర్ నిర్మాణంపై ఇప్పటికైనా ప్రభుత్వం స్పష్టతనిస్తుందని గ్రామస్థులు, రైతులు ఆశాభావంతో ఉన్నారు.
కరువు నేలకు గంధమల్లతోనే పరిష్కారం : వీరారెడ్డి సర్పంచ్, చల్లూరు, రాజాపేట మండలం
కరువు నేలకు గంధమల్లతోనే శాశ్వత పరిష్కారం. బంగారు పంటలు పండాల్సిన పంట భూములు సాగునీరు లేక బీళ్లుగా మారా యి. కరువును శాశ్వతంగా దూరం చేయాలంటే గంధమల్ల రిజర్వాయర్ నిర్మాణమే శరణ్యం. గంధమల్లతో రాజాపేట మండలంతో పాటు ఏడు మండలాల పరిధిలోని భూములు సస్యశ్యామలం అవుతాయి.
రిజర్వాయర్ నిర్మాణంపై ప్రభుత్వం దృష్టి సారించాలి : భిక్షపతిగౌడ్, మాజీ జడ్పీటీసీ, రాజాపేట మండలం
సాగు, తాగునీరు గంధమల్ల రిజర్వాయర్తోనే సాధ్యం. వేల ఎకరాలు సాగు నీరు లేక పడావు పడి కంపచెట్లు, పిచ్చిమొక్కల తో నిండి ఉన్నాయి. సాగు, తాగునీరు అం దించేందుకు గంధమల్ల ప్రాజెక్టు ఎన్నో ఏళ్లుగా ఎన్నికల హామీగానే మిగిలింది. రిజర్వాయర్ నిర్మాణంపై ప్రభుత్వం దృష్టి సారించి పూర్తి చేయాలి. రైతులు, ముంపు బాధితులకు స్పష్టత ఇవ్వాల్సిన బాధ్యత ప్రభుత్వం ఉంది.