భువనగిరి ఖిల్లాపై మంటలు
ABN , Publish Date - Apr 26 , 2024 | 12:00 AM
భువనగిరి ఖిల్లాపై గురువారం సాయంత్రం అకస్మాత్తుగా మంటలు వ్యాపించాయి.
భువనగిరి టౌన, ఏప్రిల్ 25: భువనగిరి ఖిల్లాపై గురువారం సాయంత్రం అకస్మాత్తుగా మంటలు వ్యాపించాయి. వినాయక చౌరస్తా సమీపంలో ఖిల్లా దిగువ భాగంలో ప్రారంభమైన మంటలు నిమిషాల వ్యవధిలో ఖిల్లా పైకి వ్యాపించాయి. అలాగే భారీగా పొగ కమ్ముకుంది. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకొని మంటలు ఆర్పేందుకు ప్రయత్నాలు చేశారు. దిగువ భాగంలో మంటలను ఆర్పినప్పటికీ పైకి వ్యాపించిన మంటలను అదుపులోకి తీసుకురాలేకపోయారు. కానీ ఎలాంటి ప్రమాదం జరగలేదు.
ఖిల్లా దిగువన మాజీ సీఎం కేసీఆర్ కార్నర్ మీటింగ్
మంటలు ప్రారంభమైన ఖిల్లా దిగువ భాగంలోని వినాయక చౌరస్తాలోని మాజీ సీఎం కేసీఆర్ కార్నర్ మీటింగులో ప్రసంగించాల్సి ఉండడంతో పోలీసులు, బీఆర్ఎస్ నాయకుల్లో కొద్దిసేపు ఆందోళన నెలకొంది. అగ్నిమాపక సిబ్బంది సకాలంలో స్పందించి దిగువ భాగంలో మంటలను అదుపులోకి తేవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. కాగా గుర్తు తెలియని వ్యక్తులు వెలుగుతున్న సిగరెట్ లేదా బీడీ వేయడంతో వేసవితో ఎండిపోయిన పిచ్చి మొక్కలు అంటుకొని మంటలు వ్యాపించి ఉండవచ్చునని అగ్నిమాపక సిబ్బంది తెలిపారు.
ఆత్మకూరు(ఎం): మండల కేంద్రంలో తహసీల్ధార్ కార్యాలయం ఎదురుగా ఉన్న పొలంలో గురువారం ఎవరో గర్తుతెలియని వ్యక్తులు నిప్పుపెట్టారు. అదికాస్త పొలంలో ఉన్న గడ్డి అంటుకొని కాలుతూ పొలం చుట్టు ఉన్న చెట్లకు మంటలు వ్యాపించాయి. కాగా పక్కనే కోతకు వచ్చిన వరి పంట పొలం ఉంది. మోత్కూర్ అగ్ని మాపక సిబ్బంది మంటలను పూర్తిగా ఆర్పివేశారు.