Share News

సీపీఎం అభ్యర్థిని గెలిపించాలి: చెరుపల్లి

ABN , Publish Date - Mar 27 , 2024 | 11:26 PM

ప్రజా సమస్యలపై నిరంతరం పోరాడే సీపీఎం అభ్యర్థి జహంగీర్‌ను ప్రజలు ఆదరించి గెలిపించాలని సీపీఎం కేంద్ర కమిటీ సభ్యుడు చెరుపల్లి సీతారాములు అన్నారు.

  సీపీఎం అభ్యర్థిని గెలిపించాలి: చెరుపల్లి
సమావేశంలో మాట్లాడుతున్న సీపీఎం కేంద్ర కమిటీ సభ్యుడు సీతారాములు

రామన్నపేట, మార్చి 27: ప్రజా సమస్యలపై నిరంతరం పోరాడే సీపీఎం అభ్యర్థి జహంగీర్‌ను ప్రజలు ఆదరించి గెలిపించాలని సీపీఎం కేంద్ర కమిటీ సభ్యుడు చెరుపల్లి సీతారాములు అన్నారు. స్థానిక సీపీఎం కార్యాలయంలో భువనగిరి సీపీఎం పార్లమెంటు అభ్యర్థి జహంగీర్‌తో కలిసి నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. 35 సంవత్సరాలుగా ప్రజా ఉద్యమాలకు సారథ్యం వహించిన మచ్చ లేని నాయకుడు జహంగీర్‌ అని అన్నారు. బీజేపీ, కాంగ్రెస్‌, బీఆర్‌ఎస్‌ నిలిపిన అభ్యర్థులతో పోల్చినపుడు జహంగీర్‌ మాత్రమే ప్రజానాయకుడు అని అన్నారు. కాంగ్రెస్‌ ఎన్నికల ముందు రైతులకు ఇచ్చిన హామీలు అమలు చేయాలన్నారు. వరి పంటకు ఐదు వందలు బోనస్‌ ఈ యాసంగి నుంచి అమలు చేయాలని డిమాండ్‌ చేశారు. రైతుబంధు, వ్యవసాయ పరికరాలపై సబ్సిడీ కొనసాగించి కరువు మూలంగా నష్టపోయిన రైతులను గుర్తించి ప్రభుత్వం ఆదుకోవాలని అన్నారు. తెలంగాణ సాయుధ పోరాటంలో కమ్యూనిస్టులు పది లక్షల ఎకరాల భూమిని పంచితే భువనగిరి పార్లమెంటు పరిధిలోనే నాలుగు లక్షల ఎకరాల భూమి ఉందని తెలిపారు. అలాంటి మహాపోరాట యోధుల వారసుడిగా ముందుకొస్తున్న సీపీఎం అభ్యర్థి జహంగీర్‌ను గెలిపించాలని అన్నారు. కార్యక్రమంలో సీపీఎం రాష్ట్ర నాయకులు బొంతల చంద్రారెడ్డి, రాష్ట్ర కమిటీ సభ్యులు కొండమడుగు నర్సింహ్మ, బట్టుపల్లి అనురాధ, జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు మేక అశోక్‌రెడ్డి, మాటూరి బాలరాజు, మండల కార్యదర్శి బొడ్డుపల్లి వెంకటేష్‌, బోయిని ఆనంద్‌, మీర్‌ ఖాజాఅళీ, బల్గూరి అంజయ్య పాల్గొన్నారు.

Updated Date - Mar 27 , 2024 | 11:26 PM