అడ్డాలు మారుస్తూ.. అందరినీ ఏమార్చుతూ
ABN , Publish Date - May 19 , 2024 | 12:17 AM
ఉమ్మడి నల్లగొండ జిల్లాలో పేకాట శిబిరాల నిర్వహ ణ జోరుగా సాగుతోంది. మాఫియా స్థాయిలో తయారైన నిర్వాహకులు పోలీసుల్లో కొందరిని మచ్చిక చేసుకొని, మరికొందరిని ఏమార్చుతూ పేకాట శిబిరా లు నిర్వహిస్తున్నారు.
![అడ్డాలు మారుస్తూ.. అందరినీ ఏమార్చుతూ](https://media.andhrajyothy.com/media/2024/20240511/NLG_2_d2ac3ab752.jpg)
ఉమ్మడి జిల్లాలో జోరుగా పేకాట శిబిరాలు
చేతులు మారుతున్న కోట్ల రూపాయలు
పోలీసులు, రాజకీయ నాయకుల అండదండతోనే!
నల్లగొండ,మే 18 (ఆంధ్రజ్యోతిప్రతినిధి): ఉమ్మడి నల్లగొండ జిల్లాలో పేకాట శిబిరాల నిర్వహ ణ జోరుగా సాగుతోంది. మాఫియా స్థాయిలో తయారైన నిర్వాహకులు పోలీసుల్లో కొందరిని మచ్చిక చేసుకొని, మరికొందరిని ఏమార్చుతూ పేకాట శిబిరా లు నిర్వహిస్తున్నారు. పట్టుబడకుండా చాకచక్యంగా అడ్డాలు మారుస్తూ ఆట సాగిస్తున్నారు. పక్కా నిఘా తో వీరిఆట కట్టించాల్సిన పోలీసు నిఘావర్గాలు, ఉ న్నతాధికారులు చూసీ చూడనట్టు వ్యవహరిస్తుండ డం వీరికి కలిసొస్తుంది.ఒక్కోరాత్రికి ఒక్కో చోట పేకాట శిబిరం నిర్వహిస్తున్నారు. ఈ కోట్ల రూపాయలు చేతులు మారుతూ సాగుతున్న ఈ జూదంలో కొంద రి జీవితాలు తలకిందులు అవుతున్నాయి. సాగర్, హుజూర్నగర్, మిర్యాలగూడ, రాయచూరు ప్రాంతాలకుచెందిన కొందరు ఉమ్మడి జిల్లావ్యాప్తంగా జాతీ య రహదారుల సమీప గ్రామాల్లోని తోటలు, దాబా హోటళ్ల సమీపంలో పేకాట శిబిరాలు కొనసాగిస్తున్న ట్టు సమాచారం. వారికి పోలీసులు, రాజకీయ నాయకులు అండగా నిలుస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి.
రహస్యంగా స్థావరాలు
స్థావరం పేరును జూదరులకు వాట్సప్ ద్వారా నిర్వాహకులు సమాచారమందిస్తున్నారు. 20 మందివరకు ఆడేందుకు సుముఖత వ్యక్తం చేస్తే, ఆ రోజు ఏ ప్రాంతంలో ఆటకు అనుకూలమైన పరిస్థితి ఉంటుందో, పోలీసుల నుంచి ఇతరవర్గాల నుంచి స హకారం తీసుకొని వాట్స్పలలో మెస్సేజ్లు పెడుతున్నారు. పేకాట ఆడదల్చుకున్న వ్యక్తుల నుంచి కనీ సం రూ.50వేల వరకు ముందుగానే నిర్వాహకులు డిపాజిట్ చేయించుకుంటారు. ఆ తర్వాత వారందరినీ కామన్ పాయింట్ వద్దకు రప్పించి అక్కడి నుం చి పేకాట నిర్వాహకులే సమకూర్చే ప్రత్యేకవాహనా ల్లో శిబిరాలకు తరలిస్తారు. సాయంత్రం నాలుగు గంటల నుంచి ఆరు గంటల్లోపు శిబిరాల వద్దకు జూదరులను తరలించి మరునాడు తెల్లవారు జా ము వరకు ఆటలు ఆడిస్తారు. తిరిగి తెల్లవారుజామున ఆట ముగించి ఎక్కడి వారిని అక్కడికి పంపిస్తారు. నగదును ఫోన్పే, గూగుల్పేతో పాటు మనీట్రాన్స్ఫర్ ద్వారా ఒక్క రాత్రిలో ఒక్కో శిబిరంలో కోట్ల రూపాయలు చేతులు మారుతున్నాయని సమాచా రం. మొత్తం ఆటల్లో 3నుంచి 5శాతం నిర్వాహకులు కమీషన్ తీసుకుంటున్నారు. ఒక్క రాత్రి శిబిరం నిర్వహిస్తే రూ.10లక్షల నుంచి రూ.15లక్షల వరకు వ స్తోందని, అందులో పోలీసులకు, స్థానికంగా సహకరించిన వారికి సగం వరకు ఇచ్చి, మిగిలిన మొత్తా న్ని నిర్వాహకులు జేబులో వేసుకుంటున్నట్లు తెలిసింది. ఒక ప్రాంతం వద్ద ఒక రాత్రి శిబిరం నిర్వహి స్తే, మళ్లీ మరునాడు ఇంకో ప్రాంతానికి శిబిరాన్ని మారుస్తున్నారని, దీంతో నిఘావర్గాలకు సమాచారం అందకుండా జాగ్రత్త పడుతున్నారని సమాచారం. ఇటీవల ఒక నిర్వాహక బృందం తొలుత హుజూర్నగర్-మిర్యాలగూడ మధ్యలో ఉన్న ఓ తోటలో రాత్రం తా శిబిరం నిర్వహించిందని, విషయం గ్రామస్థులకు తెలిసి మళ్లీ నిర్వహిస్తే పోలీసులకు సమాచారమిచ్చేందుకు సిద్ధమవగా, ఆ తర్వాత వారానికి కొండమల్లేపల్లి వద్ద ఒక గిరిజనతండా సమీపంలో తోటలో శిబిరం నిర్వహించారని తెలిసింది. సాగర్-మల్లేపల్లి-ఇబ్రహీంపట్నం మార్గంలో ఏదో ఒక చోట నిత్యం ఈ శిబిరం ఒక్కటైనా కొనసాగుతోందని, అంతా బడాబాబులు, వ్యాపారులు ఈ స్థావరాలకు వచ్చి లక్షలాది రూపాయలు పోగొట్టుకొని వెళ్తున్నారని స్థానికులు చెబుతున్నారు. ఇంత విచ్చలవిడిగా పేకాట సాగుతు న్నా పోలీసులు, రాజకీయనాయకుల అండదండలుండడంతో కోట్లాది రూపాయలు చేతులు మారుతున్నాయని పేర్కొంటున్నారు. పేకాట శిబిరాలపై పోలీసు ఉన్నతాధికారులు ప్రత్యేకంగా దృష్టిసారించాలని, వీటి నిర్వహణను కట్టడిచేయాలని కోరుతున్నారు.
అడ్డాలు మారుస్తూ..
మిర్యాలగూడ, హుజూర్నగర్, కొండమల్లేపల్లి, నాగార్జునసాగర్ ప్రాంతాలకు చెంది న కొందరు పేకాట శిబిరాలను యథేచ్ఛ గా నిర్వహిస్తున్నారు. పోలీ్సశాఖలో కీలకమైన స్టేషన్లలో, ముఖ్య అధికారుల వద్ద, ముఖ్యమైన విభాగా ల్లో దీర్ఘకాలంగా పాతుకుపోయిన ఉద్యోగులు, కానిస్టేబుళ్ల సహకారంతో వీరు స్థావరాలు నిర్వహించే పరిధిలోని స్టేషన్ అధికారులను మచ్చికచేసుకుంటున్నారు. ఒక్కో రోజు ఒక్కో స్థావరం ఏర్పాటుచేసుకొని, రూ.కోటి నుంచి రూ.2కోట్లు, రూ.3కోట్లవరకు పందేలు నడుస్తాయని, ఈ ఆటల్లో నిర్వాహకులకు 3 నుంచి 5 శాతం వరకు కమీషన్ ముడుతోందని సమాచారం. ఈ కమీషన్లలో స్థావరాల నిర్వహణకు తోడ్పడ్డ పోలీసులు, ఇతరులకు కొంత ముట్టజెబుతున్నారనే ఆరోపణలు ఉన్నాయి. ఏపీ రాష్ట్రంలోని కృష్ణా, పల్నాడు జిల్లాలతో పాటు కర్ణాటకలోని రాయచూరు, తెలంగాణలోని ఖమ్మం, సూర్యాపేట, నల్లగొండ జిల్లాలకు చెందిన వందలాది మంది పేకాటరాయుళ్లతో టచ్లో ఉండే ఈ నిర్వాహకులు భారీ ఎత్తున శిబిరాలను నిర్వహిస్తున్నట్టు తెలిసింది.
హుజూర్నగర్-కోదాడ, కోదాడ-ఖమ్మం, హుజూర్నగర్-మిర్యాలగూడ, నాగార్జునసాగర్-పెద్దవూర-కొండమల్లేపల్లి-మాల్, దేవరకొండ పరిసర మార్గాల్లో తోటలు, ఫాంహౌ్సలు, దాబాహోటళ్లు అడ్డాగా వీరు పేకాట శిబిరాలు నిర్వహిస్తున్నారు.