పకడ్బందీగా ఎన్నికల కోడ్
ABN , Publish Date - Mar 18 , 2024 | 12:40 AM
కేంద్ర ఎన్నికల సంఘం పార్లమెంటు ఎన్నికల షెడ్యూల్ను విడుదల చేసిన నేపథ్యంలో ఎన్నికల ప్రవర్తన నియమావళి శనివారం నుంచి పకడ్బందీ గా అమలుచేస్తున్నామని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ దాసరి హరిచందన తెలిపారు.
![పకడ్బందీగా ఎన్నికల కోడ్](https://media.andhrajyothy.com/media/2024/20240313/17_NG_1_jpeg_f39b539339.jpg)
కలెక్టర్ దాసరి హరిచందన
నల్లగొండ, మార్చి 17: కేంద్ర ఎన్నికల సంఘం పార్లమెంటు ఎన్నికల షెడ్యూల్ను విడుదల చేసిన నేపథ్యంలో ఎన్నికల ప్రవర్తన నియమావళి శనివారం నుంచి పకడ్బందీ గా అమలుచేస్తున్నామని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ దాసరి హరిచందన తెలిపారు. ఆదివారం కలెక్టరేట్లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడారు. ఏప్రి ల్ 18న పార్లమెంట్ ఎన్నికల గెజిట్ నోటిఫికేషన్ విడుదలవుతుందని, 25న నామినేషన్ దాఖలుకు చివరి తేదీ అన్నా రు. 26న నామినేషన్ల పరిశీలన, 29న నామినేషన్ల ఉపసంహరణ ఉంటుందన్నారు. మే 13న పోలింగ్, జూన్ 4న ఓట్ల లెక్కింపు ఉంటుందని వెల్లడించారు. జిల్లాలో మొత్తం 1,766పోలింగ్ కేంద్రాలు ఉన్నాయని, 46 ఆక్సిలరీ పోలింగ్ కేంద్రాల ఏర్పాటుకు ప్రతిపాదించామనిన్నారు. 30 ప్రత్యేక పోలింగ్ కేంద్రాలు, 30 మహిళా నిర్వహణ పోలింగ్ కేంద్రా లు, 6యూత్ పోలింగ్ కేంద్రాలు, మరో 6 పీడబ్ల్యుడీ పోలిం గ్ కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నట్టు తెలిపారు. 14.9లక్షల మంది ఓటర్లు ఉండగా, 7.35లక్షల పురుష ఓటర్లు, 7.54లక్ష ల మహిళా ఓటర్లు ఉన్నారని, కొత్తగా 52 వేల మంది ఓట ర్లు నమోదయ్యారని తెలిపారు. ఎన్నికల షెడ్యూల్ విడుదలైనందున ఆదివారం నుంచి ఎన్నికల వ్యయం లెక్కలోకి వస్తుందని, ముందస్తు అనుమతి లేకుండా ర్యాలీలు, సమావేశాల వంటివి నిర్వహించకూడదని తెలిపారు. ఎన్నికలను సక్రమంగా నిర్వహించేందుకు ఎస్ఎ్సటీ, వీఎ్సటీ బృందాల ను ఏర్పాటు చేశామన్నారు. ఎన్నికలకు సంబంధించి ఏదైనా ఫిర్యాదులను సీ-విజిల్ యాప్ లేదా, 1950 నెంబర్కు తెలియజేయాలన్నారు. ఎన్నికల నిర్వహణకు సుమారు 20 నోడల్ టీమ్లను ఏర్పాటు చేశామన్నారు. ఎస్పీ చందనా దీప్తి మాట్లాడుతూ, పార్లమెంట్ ఎన్నికలను సజావుగా నిర్వహించడంలో ప్రజలు పోలీసులకు పూర్తి సహకారం అందించాలని కోరారు. ముందస్తు అనుమతి లేకుండా సమావేశాలు ర్యాలీలు నిర్వహించకూడదని, ‘సువిధ’ ద్వారా అనుమతులు తీసుకోవాలని తెలిపారు. ఎన్నికల సమయంలో ఎవరైనా రూ.50 వేలకు మించి నగదును తీసుకెళ్లాల్సి వస్తే కచ్చితమైన ఆధారాలను వెంట ఉంచుకోవాలన్నారు. ఎన్నికల సందర్భంగా స్వాధీనం చేసుకున్న నగదును సాక్ష్యాలు చూపించిన తర్వాత జిల్లా స్థాయిలో ఏర్పాటు చేసే ఫిర్యాదుల కమిటీ ద్వారా విడుదల చేస్తామన్నారు. శాంతిభద్రతలకు గట్టి బందోబస్తును ఏర్పాటు చేసేందుకు ప్రణాళికను రూపొందించినట్టు పేర్కొన్నారు. సమావేశంలో డీఆర్వో డి.రాజ్యలక్ష్మీ, స్పెషల్ కలెక్టర్ నటరాజ్, డీపీఆర్వో యు.వెంకటేశ్వర్లు, మీడియా రిలేషన్స్ నోడల్ అధికారి, ఇండస్ట్రీస్ జీఎం కోటేశ్వరరావు, తదితరులు పాల్గొన్నారు.
ఎన్నికలకు సహకరించాలి
జిల్లాలో పార్లమెంటు ఎన్నికలను స్వేచ్ఛగా, శాంతియుత వాతావరణంలో నిర్వహించేందుకు అన్ని రాజకీయ పార్టీలు సహకరించాలని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ దాసరి హరిచందన కోరారు. ఆదివారం కలెక్టరేట్లో అన్ని రాజకీయ పార్టీల ప్రతినిధులతో నిర్వహించిన సమావేశంలో ఆమె మాట్లాడారు. ఎన్నికల వ్యయ నిర్వహణలో భాగంగా రాజకీయ పార్టీలు పాంప్లెంట్లు, పోస్టర్లు తదితర వాటికి ముందస్తు అనుమతి తీసుకోవాలన్నారు. వాటిలో ఎదుటివారిని, మత విద్వేషాలు రెచ్చగొట్టేలా ముద్రిస్తే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. అలాగే సోషల్ మీడియాలో వచ్చే ఫేక్ న్యూస్పై చర్యలు తీసుకుంటామన్నారు. ఎస్పీ చందనా దీప్తి మాట్లాడుతూ, నామినేషన్ల సందర్భంగా మూడు వాహనాలకు మించి వినియోగించరాదన్నారు. ప్రైవేట్ ఆస్తుల ఆవరణను ఏదైనా ప్రచారానికి వినియోగిస్తే సదరు ఆస్తి యజమాని ముందస్తు అనుమతి తప్పనిసరిగా తీసుకోవాలన్నారు. జిల్లా వ్యాప్తంగా హోర్డింగులు, పోస్టర్లు, బ్యానర్లను 72 గంటల్లో పూర్తిగా తీసివేస్తామని తెలిపారు. ఏదైనా ర్యాలీ తీయాల్సి వస్తే 10 వాహనాలకు మాత్రమే అనుమతి ఉందని, ఆపై వాహనాలకు తప్పనిసరిగా అనుమతి తీసుకోవాలన్నారు.
రాజకీయ ప్రకటనల ప్రసారాలు నిలిపివేయాలి
పార్లమెంట్ ఎన్నికల ప్రవర్తనా నియమావళి అమలులో ఉన్నందున అన్ని టెలివిజన్ ఛానళ్లు, వార్త పత్రికల్లో ప్రభుత్వ పథకాలపై ప్రకటనలు ప్రసారం చేయడం, ప్రచురించడం నిలిపివేయాలని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ దాసరి హరిచందన ఒక ప్రకటనలో తెలిపారు. ప్రభుత్వ పథకాలు, రాజకీయ ప్రకటనలను ప్రింట్, ఎలకా్ట్రనిక్ మీడియాలో ప్రసారం చేయవద్దన్నారు.