19 ఏళ్లలోపు వారందరికీ అల్బెండజోల్ వేయించాలి
ABN , Publish Date - Feb 07 , 2024 | 11:40 PM
ఒకటి నుంచి 19 ఏళ్లలోపు వారందరికీ ఆల్బెండజోల్ మాత్రలు వేయించాలని, తద్వారా వంద శాతం లక్ష్యాన్ని సాధించాలని కలెక్టర్ హనుమంతు కే.జెండగే అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్లో బుధవారం వైద్య, విద్య, మహిళా, శిశు సంక్షేమ, పంచాయతీ శాఖల అధికారులతో టాస్క్పోర్స్ కమిటీ సమావేశం నిర్వహించారు.
![19 ఏళ్లలోపు వారందరికీ అల్బెండజోల్ వేయించాలి](https://media.andhrajyothy.com/media/2023/20231205/7bng_urban1_be285ac18d.jpg)
కలెక్టర్ హనుమంతు కే.జెండగే
భువనగిరి అర్బన్, ఫిబ్రవరి 7: ఒకటి నుంచి 19 ఏళ్లలోపు వారందరికీ ఆల్బెండజోల్ మాత్రలు వేయించాలని, తద్వారా వంద శాతం లక్ష్యాన్ని సాధించాలని కలెక్టర్ హనుమంతు కే.జెండగే అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్లో బుధవారం వైద్య, విద్య, మహిళా, శిశు సంక్షేమ, పంచాయతీ శాఖల అధికారులతో టాస్క్పోర్స్ కమిటీ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ నెల 12న జాతీయ నులి పురుగుల దినోత్సవం సందర్భంగా జిల్లాలోని 21 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, 901 అంగన్వాడీ కేంద్రాలు, 647 ప్రభుత్వ పాఠశాలలు, 146 ప్రైవేట్ పాఠశాలలు, 38 ప్రభుత్వ ఎయిడెడ్ జూనియర్ కళాశాలలు, 26 ప్రైవేట్ జూనియర్ కళాశాలలకు సంబంధించి 1,61,650 మంది విద్యార్థులకు ఆల్బెండజోల్ మాత్రలు వేసేందుకు ఏర్పాట్లు చేయాలన్నారు. ఒకవేళ మాత్రలు వేసుకోని విద్యార్థులు మిగిలి తే 19న అవగాహన కల్పించాలన్నారు. గ్రామాల్లో దండోరా ద్వారా ప్రచారం చేయాలని, ప్రజాప్రతినిధులను భాగస్వామ్యం చేయాలన్నారు. అన్ని పాఠశాలలు, జూనియర్ కళాశాలలు, అంగన్వాడీ కేంద్రాల్లో వంద శాతం పిల్లలు హాజరయ్యేలా చర్యలు తీసుకోవాలన్నారు. నులి పురుగు ల నివారణతోనే సంపూర్ణ ఆరోగ్యంగా ఉంటారని, చిన్నారుల్లో అనారోగ్య సమస్యలకు కారణమవుతున్న నులిపురుగులను నివారించి ఆరోగ్యాన్ని మెరుగుపర్చేందుకు ఏటా ఫిబ్రవరి, ఆగస్టు నెలల్లో రెండు విడతల్లో నివారణ దినోత్సవం నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఒకటి నుంచి రెండేళ్ల పిల్లలకు సగం మాత్ర, రెండు నుంచి 19 ఏళ్ల పిల్లలకు ఒక మాత్ర వేయాలన్నారు. సంబంధిత శాఖల అధికారులు సమన్వయంతో అన్ని జాగ్రత్తలు చేపట్టి వందశాతం మాత్రలు వేసుకునేలా చర్యలు తీసుకోవాలన్నారు. సమావేశంలో ఇన్చార్జి వైద్యాధికారి యశోద, డీఈవో కే.నారాయణరెడ్డి, మహిళా, శిశు సంక్షేమ అధికారి అన్నపూర్ణ, జడ్పీ డిప్యూటీ సీఈవో శ్రీనివాసరావు, ఇమ్యూనైజేషన్ అధికారి డాక్టర్ వంశీకృష్ణ, వినోద్ తదితరులు పాల్గొన్నారు.
సమగ్ర విచారణ చేపట్టాలి : ఎమ్మార్పీఎస్
జిల్లాకేంద్రంలోని ఎస్సీ హాస్టల్లో విద్యార్థినుల ఆత్మహత్యలపై సమగ్ర విచారణ జరపాలని ఎమ్మార్పీఎస్ జిల్లా అధ్యక్షుడు దుబ్బ రామకృష్ణ డిమాండ్చేశారు. కలెక్టరేట్లో కలెక్టర్ హనుమంతు కే.జెండగేకు వినతిపత్రం అందజేసిన అనంతరం ఆయన మాట్లాడారు. బాధిత కుటుంబాలకు కలెక్టర్ ప్రత్యేక నిధి ద్వారా రూ.10లక్షల ఆర్థిక సహాయం అందేవిధంగా చర్యలు తీసుకోవాలన్నారు. అదేవిధంగా రెండు కుటుంబాల్లో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వాలన్నారు. కార్యక్రమంలో ఎమ్ఎస్పీ అధ్యక్షుడు నల్ల చంద్రస్వామి, నాయకులు ఇటుకల దేవేందర్, దుబ్బ లిం గం, మందాల రామస్వామి, కోళ్ల జహంగీర్, కుశంగల కుమార్ తదితరులు పాల్గొన్నారు.