ముందస్తు ఆస్తి పన్ను రూ.1.42కోట్లు వసూళ్లు
ABN , Publish Date - May 04 , 2024 | 12:12 AM
మునిసిపాలిటీలను ఆర్థికంగా బలోపేతం చేయడం, మందస్తుగా ఆస్తిపన్ను చెల్లించే వారికి రాయితీ ప్రకటించి ప్రోత్సహించే లక్ష్యంతో మునిసిపల్ శాఖ కల్పించిన 5శాతం రాయితీతో ముందస్తు ఆస్తి పన్ను చెల్లింపునకు భువనగిరి మునిసిపాలిటీలో ఓ మోస్తరు స్పందన లభించింది.
భువనగిరి టౌన, మే 3: మునిసిపాలిటీలను ఆర్థికంగా బలోపేతం చేయడం, మందస్తుగా ఆస్తిపన్ను చెల్లించే వారికి రాయితీ ప్రకటించి ప్రోత్సహించే లక్ష్యంతో మునిసిపల్ శాఖ కల్పించిన 5శాతం రాయితీతో ముందస్తు ఆస్తి పన్ను చెల్లింపునకు భువనగిరి మునిసిపాలిటీలో ఓ మోస్తరు స్పందన లభించింది. ఏప్రిల్ 30తో ముగిసిన గడువు నాటికి రూ.1,42,47,000 (29.73 శాతం )ముందస్తు ఆస్తి పన్ను వసూలైంది. భువనగిరి పట్టణంలో 14,628 అసిస్మెంట్స్ ఉండగా 5శాతం రాయితీకి 9,482 అసిస్మెంట్స్ అర్హత సాధించాయి. వీటి ద్వారా రూ.4,79,19,000 ఆస్తి పన్నును భవన యజమానులు చెల్లించేందుకు అవకాశం లభించింది. కానీ గడువు ముగిసే నాటికి 1833 అసిస్మెంట్స్ ద్వారా రూ.1,42,47,000 ముందస్తు ఆస్తిపన్ను వసూలైంది. మిగతా చెల్లింపు దారులు సకాలంలో పన్ను చెల్లించి పట్టణాభివృద్దికి సహకరించాలని కమిషనర్ పి.రామాంజుల్రెడ్డి కోరారు.