Share News

మఠంపల్లికి అధికారుల బృందం

ABN , Publish Date - Jan 30 , 2024 | 11:51 PM

మఠంపల్లి సర్పంచ మన్నెం శ్రీనివా్‌సరెడ్డి అవినీతి, అక్రమాలపై క్షేత్రస్థాయిలో పరిశీలన చేసేందుకు నేడు అధికారుల బృందం రానుంది.

మఠంపల్లికి అధికారుల బృందం
ఈ నెల తేదీన మఠంపల్లి పంచాయతీ రికార్డులను స్వాధీనం చేసుకుంటున్న అధికారులు

నిధుల వినియోగంపై నేడు ఇంటింటి సర్వే

అక్రమాలపై సర్పంచకు షోకాజ్‌ నోటీసులు

షోకాజ్‌కు స్పందించకపోవడంతో రూ.74.84 లక్షల రికవరీకి ఆదేశం

మఠంపల్లి, జనవరి 30 : మఠంపల్లి సర్పంచ మన్నెం శ్రీనివా్‌సరెడ్డి అవినీతి, అక్రమాలపై క్షేత్రస్థాయిలో పరిశీలన చేసేందుకు నేడు అధికారుల బృందం రానుంది. ఇంటింటికీ తిరుగుతూ సంక్షేమ పథకాల అమలు, నిధుల వినియోగంపై విచారణ చేయనున్నారు. కలెక్టర్‌ వెంకటరావు ఆదేశాల మేరకు ఐదుగురు ఎంపీడీవోలు, ఐదుగురు పీఆర్‌ ఏఈలతో విచారణ చేస్తుండటం గమనార్హం. ఇందుకు దారితీసిన వివరాలు ఇలా ఉన్నాయి.

సర్పంచ మన్నెం శ్రీనివా్‌సరెడ్డి ప్రభుత్వ నిధుల వినియోగంలో అక్రమాలకు పాల్పడ్డారని వార్డు సభ్యులతో పాటు పలువురు గ్రామస్థులు ఈ నెల 4వ తేదీన కలెక్టర్‌తో పాటు హుజూర్‌నగర్‌ ఆర్డీవో జగదీశ్వర్‌రెడ్డికి ఫిర్యాదు చేశారు. కలెక్టర్‌ ఆదేశాల మేరకు ఈ నెల 5వ తేదీన డీఎల్‌పీవో శ్రీరాములు, ఆర్డీవో పంచాయతీ రికార్డులను తీసుకుని వెళ్లారు. రికార్డుల పరిశీలనలో పలు నిధులు దుర్వినియోగం జరిగినట్లు నిర్ధారణకు రావడంతో కలెక్టర్‌ వెంకటరావు ఈ నెల 14న కార్యదర్శి శ్రీకాంతరెడ్డిని సస్పెండ్‌ చేసి, సర్పంచకు షోకాజ్‌ నోటీసులు జారీ చేశారు. అదేవిధంగా ఈ నెల 23న సర్పంచ చెక్‌పవర్‌ను సైతం రద్దు చేశారు. అయితే షోకాజ్‌ నోటీసుకు సర్పంచ శ్రీనివా్‌సరెడ్డి సంజాయతీ ఇవ్వకపోవడంతో, దుర్వినియోగమైన నిధులు రూ.74,84,826 వసూలు చేయాలని ఈ నెల 27న తహసీల్దార్‌ మంగా రాథోడ్‌ను కలెక్టర్‌ ఆదేశించారు. ఆ మేరకు ఆయన ఈ నెల 29వ తేదీన కలెక్టర్‌ నోటీసును మరోసారి సర్పంచకు అందజేశారు.

గ్రామస్థుల ఫిర్యాదుతో..

మఠంపల్లి పంచాయతీకి సంబంధించి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నుంచి వచ్చిన 14, 15వ ఆర్థిక సంఘం నిధులు, సీఆర్‌ఎస్‌, మినరల్‌ ఫండ్‌తో పాటు దాతలు ఇచ్చే నిధులు దుర్వినియోగం చేశారని గ్రామస్థులు పలువురు కలెక్టర్‌ వెంకటరావుకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు గ్రామంలో క్షేత్ర స్థాయిలో పర్యటించి నివేదిక అందించాలన్న కలెక్టర్‌ ఫిర్యాదు మేరకు అధికారుల బృందం బుధవారం మఠంపల్లిలో పర్యటించనుందని ఎంపీవో ఆంజనేయులు మంగళవారం తెలిపారు. అధికారుల పర్యటన ప్రజలు, నాయకుల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది.

మాజీ ఎమ్మెల్యేకు సర్పంచ మేనమామ

మఠంపల్లి సర్పంచ శ్రీనివా్‌సరెడ్డి మాజీ ఎమ్మెల్యే శానంపూడి సైదిరెడ్డికి మేనమామ. దీంతో అధికారుల చర్యలు, నోటీసులు రాజకీయంగా చర్చకు వస్తున్నాయి. మండలంలోని గుండ్లపల్లి సైదిరెడ్డి స్వగ్రామం కాగా మేనమామా స్వగ్రామం మఠంపల్లి. ఎమ్మెల్యేగా సైదిరెడ్డి హయంలో అనేక భూములను ఆక్రమించారన్న ఆరోపణలు, వైన్స, ఇసుక, బియ్యం అక్రమరవాణా విషయాల్లో ఆయన జోక్యం ఉందన్న ఆరోపణలు ఉన్నాయి. తెలుగు రాష్ట్రాల సరిహద్దుల్లో మఠంపల్లి ఉండటంతో పలు అక్రమాల్లో ఆయన జోక్యం ఉందన్న ప్రచారం సాగుతోంది.

పారదర్శకంగా విచారణ కోసం..

మఠంపల్లి సర్పంచ శ్రీనివా్‌సరెడ్డి మాజీ ఎమ్మెల్యే సైదిరెడ్డికి మేనమామ కావడం, అతడి అక్రమాలపై విచారణను పారదర్శకంగా చేపట్టాలని మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది. న్యాయ, రాజకీయ విభాగాలకు అతీతంగా విచారణ అధికారులను ఏర్పాటు చేయడంతో పాటు పూర్తిస్థాయి అధ్యయనం తర్వాతే అధికారికంగా చర్యలు తీసుకోవాలని భావిస్తున్నట్లు నాయకులు పేర్కొన్నారు. అందుకోసమే ఐదుగురు ఎంపీడీవోలు, ఐదుగురు పీఆర్‌ ఏఈలను బృందంగా ఏర్పాటు చేయించడంతో పాటు గ్రామంలో క్షేత్ర స్థాయిలో పర్యటించేలా సూచించినట్లు ప్రచారం సాగుతోంది. ఎక్కడా రాజకీయ విమర్శలు తలెత్తకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు సమాచారం.

పెదవీడు పంచాయతీలోనూ విచారణ

మండలంలోని పెదవీడు సర్పంచ సయ్యద్‌ బీబీకుతూబ్‌పై బీఆర్‌ఎస్‌ ఎంపీటీసీ, వార్డు సభ్యులు అదనపు కలెక్టర్‌కు ఈ నెల 27న ఫిర్యాదుచేశారు. సర్పంచ, కార్యదర్శి లక్ష్మణ్‌లు 14, 15వ ఆర్థిక సంఘానికి సంబంధించి సుమారు రూ.2 కోట్ల నిధులు దుర్వినియోగం చేశారని ఎంపీటీసీ కుందూరు వెంకటరెడ్డి మరికొందరు వార్డుసభ్యులు ఫిర్యాదులో పేర్కొన్నారు. కలెక్టర్‌ వెంకటరావు ఆదేశాలు మేరకు వారం రోజుల్లోగా పూర్తిస్థాయి విచారణ జరిపి సమగ్ర నివేదిక ఇవ్వాలని ఎంపీడీవో మామిడిజానకిరాములకు తహసీల్దార్‌ మంగారాథోడ్‌ ఉత్తర్వులు జారీ చేశారు. ఆర్థిక సంఘం నిధులతో పాటు సాగర్‌, నాగార్జున సిమెంట్‌ పరిశ్రమల మినరల్‌ ఫండ్‌, ఇతర పంచాయతీ నిధులపై సమగ్ర విచారణ జరపాలని ఆదేశించారు.

Updated Date - Jan 30 , 2024 | 11:51 PM