అధికారులు రాని సమావేశాలెందుకు?
ABN , Publish Date - May 27 , 2024 | 11:29 PM
పుల్కల్, మే 27: ఐదేళ్ల పదవీ కాలం పూర్తవుతున్నప్పటికీ, గ్రామాల్లో పేరుకుపోయిన సమస్యలపై అధికారులు స్పందించకపోవడం విచారకరమని సభ్యులు మండిపడ్డారు. సాధారణ సర్వసభ్య సమావేశాలకు ప్రభుత్వ అధికారులు గైర్హాజరవడంలో అంతర్యమేమిటని ప్రశ్నించారు.
![అధికారులు రాని సమావేశాలెందుకు?](https://media.andhrajyothy.com/media/2024/20240511/27_ANDL_150_1a0c531e32.jpg)
పదవీ కాలం పూర్తవుతున్నా సమస్యలపై స్పందించరా..?
సమావేశంలో సభ్యుల మండిపాటు
పుల్కల్, మే 27: ఐదేళ్ల పదవీ కాలం పూర్తవుతున్నప్పటికీ, గ్రామాల్లో పేరుకుపోయిన సమస్యలపై అధికారులు స్పందించకపోవడం విచారకరమని సభ్యులు మండిపడ్డారు. సాధారణ సర్వసభ్య సమావేశాలకు ప్రభుత్వ అధికారులు గైర్హాజరవడంలో అంతర్యమేమిటని ప్రశ్నించారు. సోమవారం ఎంపీపీ అధ్యక్షురాలు పట్లోళ్ల చైతన్యవిజయభాస్కర్రెడ్డి అధ్యక్షతన సమావేశ మందిరంలో సాధారణ సర్వసభ్య సమావేశం జరిగింది. తాగు, సాగు, విద్యుత్, అంతర్గత రహదారులు, ఫీల్డ్ రోడ్లు వంటి మౌలిక సౌకర్యాల కల్పనపై పలు పర్యాయాలు అధికారుల దృష్టికి తీసుకెళ్లినా ఫలితం లేకుండా పోయిందని సభ్యులు దిగోల దుర్గయ్య, నాయకుని రవి విచారం వ్యక్తం చేశారు. నీటి పారుదల, రోడ్లు, భవనాలు, ఉద్యానవన, అటవీ, రవాణ శాఖల అధికారులు ఏనాడూ సర్వసభ్య సమావేశాలకు హాజరుకాలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఐదేళ్లుగా మండల, జిల్లాస్థాయి అధికారుల దృష్టికి తీసుకువెళ్లినా పట్టించుకోకపోవడం విడ్డూరంగా ఉందని ఎద్దేవా చేశారు. ఇదిలా ఉండగా పుల్కల్, చౌటకూర్ మండలాల్లో సీసీరోడ్ల నిర్మాణానికి రూ.4.93 కోట్లు మంజూరయ్యాయని పంచాయతీరాజ్ ఏఈ శశికుమార్ తెలిపారు. పుల్కల్ మండలానికి రూ.2.40 కోట్లు, చౌటకూర్ మండలానికి 2.53.27 కోట్లు మంజూరయ్యాయని సభకు వివరించారు. దీంతోపాటు అమ్మ ఆదర్శ పాఠశాలల్లో మౌలిక వసతుల కల్పనకు రూ.80.70 లక్షలు, చౌటకూర్ మండలానికి రూ.47.25 లక్షలు మంజూరయ్యాయన్నారు. ఈ సమావేశంలో ఎంపీపీ ఉపాధ్యక్షుడు గాజుల వీరేందర్, ఎంపీడీవో ఆనందమేరి, కార్యాలయ పర్యవేక్షకుడు శ్రీనివాస్, ఆర్డబ్ల్యూఎస్ ఏఈ లక్ష్మీప్రసాద్, ఎంఈవో దండు అంజయ్య, ఏవో చైతన్య పాల్గొన్నారు.