లింగ నిర్ధారణ పరీక్షలు చేస్తే కఠిన చర్యలు
ABN , Publish Date - May 27 , 2024 | 11:50 PM
సిద్దిపేట డీఎంహెచ్వో పుట్ల శ్రీనివాస్
![లింగ నిర్ధారణ పరీక్షలు చేస్తే కఠిన చర్యలు](https://media.andhrajyothy.com/media/2024/20240511/27sid250_b5a3a8dd8b.jpg)
సిద్దిపేట టౌన్/కుకునూరుపల్లి, మే 27 : గర్భధారణ పూర్వ, గర్భస్థ పిండ ప్రక్రియ (లింగ ఎంపిక నిషేధ) చట్టాన్ని ఉల్లంఘించి లింగ నిర్ధారణ చేస్తే వారిపై కఠిన చర్యలు తప్పవని సిద్దిపేట డీఎంహెచ్వో పుట్ల శ్రీనివాస్ హెచ్చరించారు. సోమవారం సిద్దిపేటలోని డీఎంహెచ్వో కార్యాలయంలో పీసీపీఎన్డీటీ జిల్లా సలహా కమిటీ సమావేశంలో ఆయన మాట్లాడుతూ గర్భంలో బిడ్డ ఆరోగ్యంగా ఉన్నాడా లేదా, ఏమైనా అంగవైకల్యంతో ఉందా అని మాత్రమే స్కానింగ్ ద్వారా చెక్ చేయాలని సూచించారు. అలా్ట్ర సౌండ్ స్కానింగ్ మెషీన్లు, రిజిస్ట్రేషన్ గడువు తేదీకి నెల ముందు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలని, అనంతరం జిల్లా కార్యాలయంలో సమర్పించాలని ఆదేశించారు. రిజిస్ట్రేషన్ గడువు పూర్తయినా, యజమాన్యాలపైన కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. డయాగ్నోస్టిక్, ఇమేజింగ్, ఫెర్టిలిటీ సెంటర్లు, స్కానింగ్ మెషీన్ల ద్వారా లింగ నిర్ధారణ సంబంధించి ఎలాంటి స్కానింగ్ చేయబోమని ఆసుపతిల్రో బోర్డులను ఏర్పాటు చేయాలని ఆయన ఆదేశించారు. సలహా కమిటీ సభ్యుడు, జిల్లా ప్రభుత్వ పబ్లిక్ ప్రాసిక్యూటర్ వెంకటలింగం మాట్లాడుతూ లింగ నిర్ధారణ చేసినట్లయితే, చేపట్టిన వైద్యాధికారికి, ప్రోత్సహించిన కుటుంబసభ్యులకు చట్టం ప్రకారం మొదటి తప్పునకు రూ.పదివేల జరిమానా మూడేళ్ల జైలుశిక్ష, రెండో తప్పునకు ఐదు సంవత్సరాల జైలుశిక్ష, రూ.50 వేల జరిమానా విధించబడుతుందని వివరించారు. ఈ కార్యక్రమంలో సలహా కమిటీ సభ్యులు డాక్టర్ సుజాత, లక్ష్మి, డాక్టర్ వేణు, ఎన్జీవో సభ్యులు వసంత, రాజలింగం, కన్వీనర్ డాక్టర్ రజిని, డాక్టర్ శ్రీనివాస్, డిప్యూటీ డెమో నవీన్రాజ్కుమార్ తదితరులు పాల్గొన్నారు. కుకునూరుపల్లి పీహెచ్సీని జిల్లా వైద్యాధికారి పుట్ల శ్రీనివాస్ ఆదివారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా సిబ్బందికి పలు సూచనలు చేసి ఆరోగ్య కేంద్రంలో అందుతున్న సేవలను అడిగి తెలుసుకున్నారు. ఆయన వెంట డిప్యూటీ డీఎంహెచ్వో శ్రీనివాస్, పీహెచ్సీ వైద్యాధికారిని, సిబ్బంది ఉన్నారు.