శివోహం..
ABN , Publish Date - Mar 08 , 2024 | 12:26 AM
హిందువుల అత్యంత విశిష్ఠ పండుగల్లో శివరాత్రి ఒకటి...ఈ రోజును పరమశివుడికి అత్యంత ప్రీతిపాత్రమైనదిగా భక్తులు విశ్వసిస్తారు.
మహాశివరాత్రికి ముస్తాబైన శైవక్షేత్రాలు
పొట్లపల్లికి ప్రత్యేక బస్సులు ఏర్పాటు
నేడు హుస్నాబాద్ మరకత లింగేశ్వరుడిని
దర్శించుకోనున్న మంత్రి పొన్నం ప్రభాకర్
మార్కెట్లో పండ్లు, పూలకు ఫుల్ గిరాకీ
రోజువారి కంటే ధరలు పైపైకి
హిందువుల అత్యంత విశిష్ఠ పండుగల్లో శివరాత్రి ఒకటి...ఈ రోజును పరమశివుడికి అత్యంత ప్రీతిపాత్రమైనదిగా భక్తులు విశ్వసిస్తారు. శివరాత్రి రోజు భక్తులు ఉపవాసం దీక్ష బూని ప్రత్యేక పూజలు, అర్చనలు, జాగరణ చేస్తారు. అలాగే, రుద్రాభిషేకాలు, శివ కల్యాణాలు, జపాలు, స్తోత్రాలు, కీర్తనలు అఖండ దీపారాధనలు, బిల్వ దళార్చనలు నేటి ప్రత్యేకత. మృత్యుంజయుడైన శివుడిని పూజిస్తే మృత్యువు దరిచేరదని భక్తుల నమ్మకం. అందుకే ఈ మహాశివరాత్రి రోజు శివున్ని ప్రత్యేకంగా పూజిస్తారు. ఈ మేరకు జిల్లాలోని శైవక్షేత్రాలు సర్వాంగ సుందరగా ముస్తాబయ్యాయి. భక్తులకు ఇబ్బందులు తలెత్తకుండా ఆలయాధికారులు ఏర్పాట్లు చేశారు. పూల, పండ్ల ధరలు అమాంతం పెరిగాయి. పూజా సామగ్రి దుకాణాలు సైతం కిటకిటలాడాయి.
భక్తుల కొంగు బంగారం పొట్లపల్లి క్షేత్రం
హుస్నాబాద్ రూరల్, మార్చి 7: భక్తులు కోరిన కోర్కెలు తీర్చే కొంగుబంగారంగా విరాజిల్లుతున్న పొట్లపల్లి స్వయంభూ రాజేశ్వరస్వామి క్షేత్రం మహాశివరాత్రి ఉత్సవాలకు సర్వాంగసుందరంగా ముస్తాబైంది. లక్షలాది మంది భక్తులు తరలివచ్చే అవకాశం ఉండడంతో అందుకు తగిన ఏర్పాట్లు పూర్తి చేసినట్లు ఈవో పి.కిషన్రావు తెలిపారు. రవాణా, బీసీ సంక్షేమశాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ భక్తులకు అల్పాహారం అందించనున్నారు. భక్తుల కోసం ప్రత్యేక వైద్యశిబిరాన్ని ఏర్పాటు చేశారు. పటిష్ఠ బందోబస్తు ఏర్పాటు చేసినట్లు సీఐ శ్రీనివాస్ తెలిపారు. పొట్లపల్లిలో జరిగే మహాశివరాత్రి ఉత్సవాలకు వచ్చే భక్తులకు ప్రయాణ సౌకర్యార్థం హుస్నాబాద్ ఆర్టీసీ బస్డిపో నుంచి ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేసినట్లు ఆర్టీసీ డీఎం తెలిపారు. సిద్దిపేట, వరంగల్, కరీంనగర్ జిల్లా కేంద్రం నుండి పొట్లపల్లికి ప్రత్యేక బస్సులు నడపనున్నట్లు పేర్కొన్నారు. హుస్నాబాద్ మండలం మహ్మదాపూర్లోని లింగాలకొండపై వెలసిన చంద్రమహేశ్వరస్వామి జాతర అత్యంత వైభవంగా జరగనున్నది. ఈ మేరకు ఏర్పాట్లు పూర్తి చేశారు. పందిల్లలోని మహాలింగేశ్వరస్వామి జాతర ఉత్సవాలకు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు.
నేడే మల్లన్నకు పెద్దపట్నం
కొమురవెల్లి : నేటి మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా కొమురవెల్లి మల్లన్న ఆలయాన్ని సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దారు. శివరాత్రి సందర్భంగా స్వామివారికి గర్భాలయంలో మహాన్యాస పూర్వక అభిషేకంతో పాటు ప్రత్యేక పూజలు నిర్వహించనున్నారు. తోటబావి ప్రాంగణంలో యాదవ సాంప్రదాయం ప్రకారం ఒగ్గు పూజారుల ఆధ్వర్యంలో పంచవర్ణాలతో పెద్దపట్నం వేసి స్వామివారికి కల్యాణం నిర్వహిస్తారు. ఆలయ పరిసరాలను స్వాగత తోరణాలతో విద్యుత్ దీపాలతో అలంకరించారు. ఇక, భక్తులకు ఇబ్బందులు తలెత్తకుండా ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నట్లు ఆలయ పునరుద్ధరణ కమిటీ చైర్మన్ పర్పాటకం లక్ష్మారెడ్డి తెలిపారు. పెద్దపట్నం నిర్వహించే తోటబావి ప్రాంగణంలో బారీకేడ్లతో పకడ్బందీగా ఏర్పాట్లు చేసినట్లు ఆలయ ఈవో బాలాజీశర్మ తెలిపారు.
ముస్తాబైన ఆలయాలు
దుబ్బాక/మిరుదొడ్డి : మహాశివరాత్రి ఉత్సవాలకు దుబ్బాక, మిరుదొడ్డి మండలాల్లోని శివాలయాలు ముస్తాబయ్యాయి. దుబ్బాకలోని నీలకంఠ, ఉమామహేశ్వరాలయం, మార్కండేయ, చెల్లాపూర్లోని సోమేశ్వరాలయం, చౌదర్పల్లిలోని దుబ్బరాజరాజేశ్వరాలయం, కూడవెళ్లిలోని రామలింగేశ్వరాలయాలను సర్వాంగసుందరంగా తీర్చిదిద్దారు. సోమేశ్వరుని ఆలయానికి సరిహద్దు మండలమైన కరీంనగర్ జిల్లా ముస్తాబాద్, గంభీరావుపేట మండలాలతో పాటు నిజామాబాద్ జిల్లాల నుంచి అధిక సంఖ్యలో హాజరవుతారు. మిరుదొడ్డి మండలం చెప్యాల, అల్వాల, మోతే గ్రామాల్లోని రామలింగేశ్వరాలయాలు మహాశివరాత్రి జాతరకు ఏర్పాట్లను చేశారు. మోతెలోని రామలింగేశ్వరాలయం వద్ద తహసీల్దార్ జయంత్, తాజామాజీ సర్పంచ్ కాలేరు శ్రీనివాస్ జాతర ఏర్పాట్లను పర్యవేక్షించారు. వారి వెంట పురోహితుడు మనోహర్శర్మ, పంచాయతీ కార్యదర్శి మమత పాల్గొన్నారు.
కూడవెల్లి రామలింగేశ్వరుడి ఆలయంలో..
అక్బర్పేట- భూంపల్లి : శివరాత్రి పర్వదినం సందర్భంగా కూడవెల్లి రామలింగేశ్వరాలయం ముస్తాబైంది. మూడునదుల సంగమంగా మాండవ్య నదిగా కూడలి(కూడవెల్లి)వాగులో శివరాత్రి పర్వదినం పుణ్యస్నానాలు ఆచరించి, స్వామివారిని దర్శించుకుంటే పాపాలు హరిస్తాయని భక్తుల నమ్మకం. ఉదయం అభిషేకాలు, ప్రత్యేక పూజలు, రాత్రి ఏడు గంటలకు శివపార్వతుల కల్యాణం నిర్వహించనున్నారు.
మల్లన్న ఆలయం ముస్తాబు
జగదేవ్పూర్ : మహాశివరాత్రి వేడుకలకు జగదేవ్పూర్లోని మల్లన్న ఆలయం ముస్తాబైంది. గురువారం సాయంత్రం ఆలయం వద్ద ధ్వజారోహణ నిర్వహించారు. అనంతరం గంగ తెప్ప తీసుకువచ్చి స్వామి వారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. శుక్రవారం ఉదయం పది గంటలకు శ్రీ బ్రమరాంబ మల్లికార్జున స్వామి కళ్యాణోత్సవం వేద పండితుల మద్య నిర్వహించారన్నారు. దౌలాపూర్, కొండాపూర్, గొల్లపల్లి, లింగారెడ్డిపల్లి తదితర గ్రామాల శివ భక్తులు అధిక సంఖ్యలో హాజరు కానున్నారు.
బుగ్గ రాజేశ్వరస్వామి ఆలయంలో..
నారాయణరావుపేట : మండల కేంద్రంలోని స్వయంభూ శ్రీ పార్వతీ బుగ్గ రాజేశ్వరస్వామి ఆలయం ఉత్సవాలకు ముస్తాబైంది. ప్రతి శివరాత్రి ఉత్సవాలకు చుట్టుపక్కల ప్రాంతాల ప్రజలే కాకుండా ఉమ్మడి మెదక్, నిజామాబాద్, కరీంనగర్, వరంగల్, హైదరాబాద్ జిల్లాల నుంచి పెద్దసంఖ్యలో భక్తులు తరలివచ్చి స్వయంభు లింగాన్ని దర్శించుకుని అభిషేకాలు, ప్రత్యేక పూజలు చేస్తారు. సిద్దిపేట రూరల్ ఎస్ఐ అపూర్వరెడ్డి ఆధ్వర్యంలో పోలీసు బందోబస్తు ఏర్పాట్లు చేశారు. మూడురోజుల పాటు జరిగే ఈ ఉత్సవాలకు వచ్చే భక్తుల సౌకర్యార్థం అన్నిరకాల ఏర్పాట్లు చేసినట్లు ఆలయ కమిటీ చైర్మన్ పోదిల కిషన్ తెలిపారు.
రాంపూర్ కోటిలింగేశ్వరాలయంలో..
తొగుట : శివరాత్రి ఉత్సవాలకు తొగుట మండలంలోని రాంపూర్ కోటిలింగేశ్వరాలయం ముస్తాబైంది. పార్థివలింగాభిషేకం, పార్వతీపరమేశ్వర కల్యాణం, దీపోత్సవం, పల్లకీసేవ, లింగోధ్బావ కాలంలో ప్రత్యేక పూజలు, మరునాడు అన్నదానం తదితర కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు ఆలయ అర్చకులు ప్రసాద్ పంతులు తెలిపారు.
ఉమా రామలింగేశ్వరాలయంలో
కొండపాక : దేశంలోనే మొదటిదిగా కొండపాక ఆనంద నిలయం ఆవరణలో వెలసిన అష్టాదశ శక్తిపీఠ సహిత ఉమారామలింగేశ్వర స్వామి ఆలయంలో శుక్రవారం మహాశివరాత్రి వేడుకలు ఘనంగా నిర్వహించనున్నట్లు ట్రస్ట్ ప్రతినిధులు తెలిపారు. సాయం త్రం ఏడు గంటలకు శివపార్వతుల కల్యాణోత్సవం రాత్రి లింగోద్భవ సమయాన ప్రత్యేక అభిషేక కార్యక్రమాలు చేపట్టనున్నారు.
ఆలయాల్లో ప్రత్యేక పూజలు
గజ్వేల్/దూల్మిట్ట/సిద్దిపేట అర్బన్: గజ్వేల్-ప్రజ్ఞాపూర్ మునిసిపాలిటీ పరిధిలోని పార్థివేశ్వరాలయం శివరాత్రి ఉత్సవాలకు ముస్తాబైంది. శివరాత్రి మహోత్సవాల్లో భాగంగా పూజాకార్యక్రమాలు నిర్వహించనున్నారు. సిద్దిపేటలోని కోటిలింగేశ్వర స్వామి ఆలయంతో పాటు పరిసర ప్రాంతాల్లోని శివాలయాలు అంగరంగ వైభవంగా ముస్తాబయ్యాయి. భక్తులకు ఇబ్బందులు తలెత్తకుండా ఆలయ నిర్వహకులు ఏర్పాట్లను పూర్తి చేశారు. దూల్మిట్ట మండలం బెక్కల్లోని రామలింగేశ్వరస్వామి ఆలయంలో అన్ని ఏర్పాట్లు పూర్తిచేసినట్లు ఆలయ ఈవో శ్రీనివాసశర్మ తెలిపారు. ఆలయ పూజారి శివ, పాలకమండలి సభ్యులు మాట్లాడుతూ.. అభిషేకాలు స్వామివారికి బోనాలు, పెద్దపట్నం, ఒగ్గుకథ కార్యక్రమాలు ఉంటాయని తెలిపారు.
మరకత లింగేశ్వరుడిని దర్శించుకోనున్న మంత్రి పొన్నం
హుస్నాబాద్: హుస్నాబాద్ పట్టణంలోని కాశీ మరకత లింగేశ్వర స్వామి, సిద్దేశ్వర స్వామి ఆలయాలకు భక్తులు పెద్దఎత్తున రానుండటంతో అందుకు తగిన ఏర్పాట్లు చేశారు. రవాణా, బీసీ సంక్షేమశాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ మరకత లింగేశ్వర స్వామి, సిద్దేశ్వర ఆలయాల్లో ప్రత్యేక పూజలు చేయనున్నారు.
మార్కెట్లో శివరాత్రి సందడి..
శివరాత్రి పర్వదినం సందర్భంగా హుస్నాబాద్ మార్కెట్లో సందడి నెలకొన్నది. పూజసామగ్రికి దుకాణాల వద్ద ప్రజలు బారులు తీరారు. మట్టి దీపపు ప్రమిదలు జత రూ.60, చిన్న దీపాలు రూ.5 నుంచి రూ.30 చొప్పున విక్రయించారు. కందగడ్డ కిలో రూ.40, సంత్రాలు కిలో రూ.100, ద్రాక్ష కిలో రూ.80, ఐదు మొక్కజొన్న కంకులు రూ.60 చొప్పున విక్రయించారు.
మరకత లింగేశ్వరుడిని దర్శించుకోనున్న మంత్రి పొన్నం
హుస్నాబాద్: హుస్నాబాద్ పట్టణంలోని కాశీ మరకత లింగేశ్వర స్వామి, సిద్దేశ్వర స్వామి ఆలయాలకు భక్తులు పెద్దఎత్తున రానుండటంతో అందుకు తగిన ఏర్పాట్లు చేశారు. రవాణా, బీసీ సంక్షేమశాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ మరకత లింగేశ్వర స్వామి, సిద్దేశ్వర ఆలయాల్లో ప్రత్యేక పూజలు చేయనున్నారు.
మార్కెట్లో శివరాత్రి సందడి..
శివరాత్రి పర్వదినం సందర్భంగా హుస్నాబాద్ మార్కెట్లో సందడి నెలకొన్నది. పూజసామగ్రికి దుకాణాల వద్ద ప్రజలు బారులు తీరారు. మట్టి దీపపు ప్రమిదలు జత రూ.60, చిన్న దీపాలు రూ.5 నుంచి రూ.30 చొప్పున విక్రయించారు. కందగడ్డ కిలో రూ.40, సంత్రాలు కిలో రూ.100, ద్రాక్ష కిలో రూ.80, ఐదు మొక్కజొన్న కంకులు రూ.60 చొప్పున విక్రయించారు.
ముస్తాబైన చిన్నిమల్లన్న ఆలయం
చేర్యాల : మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని చేర్యాల పట్టణంలోని చిన్నిమల్లన్న దేవాలయం ముస్తాబైంది. చిన్నిమల్లన్నను దర్శించుకున్న అనంతరం భక్తులు కొమురవెల్లి మల్లన్న వద్దకు వెళ్లేవారని పూర్వీకులు చెబుతుంటారు. మహాశివరాత్రి సందర్భంగా నేడు స్వామివారి మూలవిరాట్టుతో పాటు రేణుకా ఎల్లమ్మతల్లికి అభిషేకం, స్వామివారి కల్యాణం, ప్రత్యేక పూజలు చేయనున్నారు. మండలంలోని పలు గ్రామాలలోని శివాలయాలను ముస్తాబుచేశారు.