Share News

నిబంధనల మేరకు ఆర్వోలు పనిచేయాలి

ABN , Publish Date - Mar 16 , 2024 | 11:51 PM

కలెక్టర్‌ మనుచౌదరి సూచన

నిబంధనల మేరకు ఆర్వోలు పనిచేయాలి
సమావేశంలో మాట్లాడుతున్న కలెక్టర్‌ మనుచౌదరి, అదనపు డీసీపీ మల్లారెడ్డి

సిద్దిపేట అగ్రికల్చర్‌, మార్చి 16: లోక్‌సభ ఎన్నికల కోడ్‌ అమలులోకి వచ్చిన నేపథ్యంలో శనివారం కలెక్టర్‌, ఎన్నికల అధికారి మనుచౌదరి జిల్లా అదనపు కలెక్టర్‌, దుబ్బాక ఆర్వో గరీమా అగ్రవాల్‌తో కలిసి కలెక్టర్‌ కార్యాలయంలో విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ.. ఎన్నికల సంఘం నిబంధనల మేరకు ఆర్వోలు పనిచేయాలని ఆయన సూచించారు. ఎలాంటి పొరపాట్లకు తావు లేకుండా ఎన్నికలను విజయవంతంగా నిర్వహిస్తామని కలెక్టర్‌ తెలిపారు. ఎన్నికల నోడల్‌ అధికారులను నియమించి, శిక్షణ కూడా ఇచ్చామని తెలిపారు. ఎన్నికల కోడ్‌ అమలులోకి వచ్చినందున ప్రభుత్వ కార్యాలయాలు, సంస్థలలో ప్రభుత్వానికి సంబంధించిన ఉన్న పోస్టర్లను గంటల్లోగా తొలగించాలని సూచించారు. ప్రభుత్వ సంస్థలకు 48 గంటలు, ప్రైవేటు సంస్థలకు 72 గంటల సమయంలోగా తొలగించాలని అధికారులను ఆదేశించారు. ఎన్నికలకు సంబంధించిన కార్యక్రమాల నిర్వహణకు సువిధ పోర్టల్‌ ద్వారా అనుమతులు పొందాలని ఆయన తెలిపారు.

జిల్లాలో 9.61 లక్షల ఓటర్లు

జిల్లాలోని హుస్నాబాద్‌, సిద్దిపేట, దుబ్బాక, గజ్వేల్‌ శాసనసభ నియోజకవర్గాల పరిధిలో 9,61,361 మంది ఓటర్లు ఉన్నారని కలెక్టర్‌ తెలిపారు. అందులో ఎన్నారై ఓటర్లు 247, సర్వీస్‌ ఓటర్లు 452 మంది ఉన్నారని చెప్పారు. మెదక్‌ లోక్‌సభ పరిధిలో జిల్లాలో దుబ్బాక, సిద్దిపేట, గజ్వేల్‌ శాసనసభ నియోజకవర్గాలు ఉన్నాయని తెలిపారు. కరీంనగర్‌ లోక్‌సభ పరిధిలో హుస్నాబాద్‌ నియోజకవర్గం, భువనగిరి లోక్‌సభ పరిధిలో జనగామ శాసనసభ పరిధిలోని 4 మండలాలు ఉన్నాయని కలెక్టర్‌ తెలిపారు.

64 సమస్యాత్మక ప్రాంతాలు

జిల్లాలో 64 సమస్యాత్మక ప్రాంతాలను గుర్తించినట్లు అదనపు డీసీపీ మల్లారెడ్డి వెల్లడించారు. ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు జిల్లా పరిధిలో 11 ఫ్ల్లయింగ్‌ స్క్వాడ్‌ బృందాలు, 13 ఎస్‌ఎ్‌సటీ బృందాలు, 26ఎంసీసీ బృందాలు, 103 రూట్‌లు, 10 చెక్‌ పోస్టులు ఏర్పాటు చేశామని వెల్లడించారు.

Updated Date - Mar 16 , 2024 | 11:51 PM