మాట నిలబెట్టుకుంటాం
ABN , Publish Date - Mar 04 , 2024 | 12:06 AM
ప్రజలకిచ్చిన మాట నిలబెట్టుకునే విశ్వసనీయత కాంగ్రెస్ పార్టీకే సొంతమని వైద్య ఆరోగ్యశాఖామంత్రి దామోదర్ రాజనర్సింహ పేర్కొన్నారు.
![మాట నిలబెట్టుకుంటాం](https://media.andhrajyothy.com/media/2024/20240301/29mdk51_65767d3d94.gif)
నాలుగు గ్యారంటీలు అమలు చేశాం
ఈ నెల 11న ఇందిరమ్మ ఇళ్ల పథకం ప్రారంభం
ప్రజా సంక్షేమమే ఇందిరమ్మ రాజ్య లక్ష్యం
పోలియో రహిత తెలంగాణనే లక్ష్యం
వైద్య, ఆరోగ్యశాఖా మంత్రి దామోదర్ రాజనర్సింహ
జోగిపేట, మార్చి 3: ప్రజలకిచ్చిన మాట నిలబెట్టుకునే విశ్వసనీయత కాంగ్రెస్ పార్టీకే సొంతమని వైద్య ఆరోగ్యశాఖామంత్రి దామోదర్ రాజనర్సింహ పేర్కొన్నారు. సంగారెడ్డి జిల్లా జోగిపేటలోని ఏరియా ఆసుపత్రిలో పల్స్ పోలియో కార్యక్రమాన్ని ఆదివారం ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఎన్నికల్లో హామీ ఇచ్చిన ఆరు గ్యారంటీ పథకాల్లో ఇప్పటికే నాలుగింటిని అమలు చేశామని తెలిపారు. ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం, సబ్సిడీపై గ్యాస్ సిలిండర్, గృహజ్యోతి, ఆరోగ్యశ్రీ పరిమితి రూ. 10 లక్షలకు పెంచడం పూర్తిచేశామని తెలిపారు. ఈ నెల 11న ఇందిరమ్మ ఇళ్ల పథకాన్ని కూడా ప్రారంభించబోతున్నామని వెల్లడించారు. మిగిలిన ఒక్క హామీని అతి త్వరలోనే అమలు చేస్తామని స్పష్టం చేశారు.
ప్రతీ చిన్నారికి చుక్కలు వేయించాలి
పోలియో రహిత తెలంగాణనే ప్రభుత్వ లక్ష్యమని మంత్రి తెలిపారు. ఐదేళ్ల లోపు ప్రతీ చిన్నారికి పోలియో చుక్కలు వేయడమే ఇందుకు మార్గమని పేర్కొన్నారు. ఐదేళ్ల లోపు చిన్నారులందరికీ పోలియో చుక్కలు వేయించాలని తల్లిదండ్రులకు పిలుపునిచ్చారు. ఒక్క చిన్నారికి పోలియో చుక్కలు వేయించకపోయినా ప్రమాదమేనని అన్నారు. అనంతరం గృహజ్యోతి పథకం లబ్ధిదారులకు జీరో కరెంటు బిల్లులను మంత్రి అందజేశారు. ఏరియా ఆసుపత్రికి ఎంఆర్ఎఫ్ ఫౌండేషన్ అందజేసిన ప్రారంభించారు. లయన్స్క్లబ్ ఏర్పాటు చేసిన పోలియో కేంద్రంలో చిన్నారులకు పోలియో చుక్కలు వేశారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ చంద్రశేఖర్, డీఎంహెచ్వో గాయత్రీదేవి, చైల్డ్ హెల్త్ జాయింట్ డైరెక్టర్ సుధీర, డీసీహెచ్ఎ్స సంగారెడ్డి, డీఐవో శశాంక్ దేశ్పాండే, డబ్ల్యూహెచ్వో అధికారి సందీప్ పాటిల్, యూనిసెఫ్ కన్సల్టెంట్ రవినాయుడు, జోగిపేట ఏరియా ఆస్పత్రి సూపరింటెండెంట్ రమేశ్, మున్సిపల్ చైర్మన్ మల్లయ్య, పీఏసీఎస్ చైర్మన్ నరేందర్రెడ్డి, వైస్ చైర్మన్ హన్మాండ్లు, మున్సిపల్ కమిషనర్ తిరుపతి, కౌన్సిలర్లు సురేందర్గౌడ్, చిట్టిబాబు, రేఖాప్రవీణ్, శంకర్, హరికృష్ణాగౌడ్, చందర్, దుర్గేశ్, ఏఎంసీ మాజీ చైర్మన్ పద్మనాభరెడ్డి, మాజీ ఎంపీటీసీ డీజీ వెంకటేశం, తదితరులు పాల్గొన్నారు.