పాత పంటల్లో ఎన్నో పోషకాలు
ABN , Publish Date - Feb 13 , 2024 | 12:34 AM
పాత పంటల్లో ఎన్నో పోషకాలు లభిస్తాయని దక్కన్ డెవల్పమెంట్ సొసైటీ(డీడీఎస్) డైరెక్టర్ రుక్మిణీరావు అన్నారు. సోమవారం మండల పరిధిలోని మాచూనూర్ గ్రామ శివారులో దక్కన్ డెవల్పమెంట్ సొసైటీ(డీడీఎస్) 24వ పాత పంటల జాతర ముగింపు కార్యక్రమాన్ని నిర్వహించారు.
![పాత పంటల్లో ఎన్నో పోషకాలు](https://www.andhrajyothy.com/assets/images/defaultImg.jpeg)
చిరుధాన్యాల సాగుపై దేశ వ్యాప్తంగా ప్రచారం
డీడీఎస్ డైరెక్టర్ రుక్మిణీరావు
ఝరాసంగం, ఫిబ్రవరి 12 : పాత పంటల్లో ఎన్నో పోషకాలు లభిస్తాయని దక్కన్ డెవల్పమెంట్ సొసైటీ(డీడీఎస్) డైరెక్టర్ రుక్మిణీరావు అన్నారు. సోమవారం మండల పరిధిలోని మాచూనూర్ గ్రామ శివారులో దక్కన్ డెవల్పమెంట్ సొసైటీ(డీడీఎస్) 24వ పాత పంటల జాతర ముగింపు కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ప్రతీ రైతు తనకున్న పొలంలో కొంత మేర పాత పంటలైన జొన్న, సజ్జ, రాగులు, ఉలువ, తైద పంటలను సాగు చేసుకోవాలని కోరారు. చిరుధాన్యాల సాగు విధానంపై డీడీఎస్ మహిళ సంఘాల సభ్యులు దేశ వ్యాప్తంగా ప్రచారం నిర్వహిస్తున్నారన్నారు. అవార్డులు సైతం అందుకున్నారని గుర్తుచేశారు. నాబార్డు డీడీఎం కృష్ణతేజ మాట్లాడుతూ గ్రామాల్లో చిరుధాన్యాల సాగుపై చాటింపు చేయిస్తే రైతులు పాత పంటలను సాగు చేసే అవకాశం ఉందని సూచించారు. సేంద్రియ వ్యవసాయంతో వాతావరణం కాలుష్యం కాకుండా ఉంటుందన్నారు. జహీరాబాద్ వ్యవసాయ శాఖ ఏడీఏ భిక్షపతి మాట్లాడుతూ నీటి వసతి కలిగి ఉన్న రైతులు పత్తి పంటను తీసి యాసంగిలో మొక్కజొన్న, జొన్న పంటలను సాగు చేస్తున్నారని, వీటికి బదులుగా పాత పంటలైన సజ్జ పంటను సాగు చేయాలని సూచించారు. పాత పంటల సాగుకు వ్యవసాయ శాఖ పూర్తిస్థాయిలో సహకరిస్తుందని తెలిపారు. మాచూనూర్ గ్రామం నుంచి డీడీఎస్ వరకు ఎడ్లబండ్లలో స్టాళ్లను ఏర్పాటు చేసి వాటిలో పాత పంటలను నింపి డీడీఎస్ మహిళ సభ్యులు నృత్యాలు చేస్తూ, ఆటపాటలతో ఊరేగింపు నిర్వహించారు. జహీరాబాద్ నియోజకవర్గంలోని ఝరాసంగం, న్యాల్కల్, తదితర గ్రామాల నుంచి మహిళలు అధిక సంఖ్యలో తరలివచ్చారు. ఈ కారక్రమంలో ఫ్రొఫెసర్ వినోద్ పావురాల, కిరణ్, నాబార్డు డీడీఎం తిమోతి, రామాంజనేయులు, నర్సమ్మ, మాణిక్యం, డీడీఎస్ మహిళా సభ్యులు తదితరులు పాల్గొన్నారు.