లింగారెడ్డిపేట్లో భారీ చోరీ
ABN , Publish Date - Mar 09 , 2024 | 11:32 PM
మనోహరాబాద్, మార్చి 9: మెదక్ జిల్లా మనోహరాబాద్ మండలం లింగారెడ్డిపేట గ్రామంలో భారీ చోరీ జరిగింది. తాళం వేసిన ఇంట్లో దుండగులు దొంగతనానికి పాల్పడ్డారు.
![లింగారెడ్డిపేట్లో భారీ చోరీ](https://media.andhrajyothy.com/media/2024/20240306/9tprn80_3c23c1535c.jpg)
50 తులాల ఐదు బంగారు బిస్కెట్లు, 18 తులాల బంగారు ఆభరణాలు అపహరణ
మనోహరాబాద్, మార్చి 9: మెదక్ జిల్లా మనోహరాబాద్ మండలం లింగారెడ్డిపేట గ్రామంలో భారీ చోరీ జరిగింది. తాళం వేసిన ఇంట్లో దుండగులు దొంగతనానికి పాల్పడ్డారు. తూప్రాన్ సీఐ కృష్ణ, ఎస్ఐ కరుణాకర్రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన మాదాసు రమేష్ ప్రైవేట్ పరిశ్రమలో పనిచేస్తున్నాడు. వెంకటాయపల్లికి చెందిన మామ బొబిళ్ల సత్తయ్య పదిరోజుల క్రితం మృతిచెందాడు. ఈనెల 6న దశ దిన కర్మ కోసం రమేష్ కుటుంబసభ్యులతో వెంకటాయపల్లికి వెళ్లాడు. ఇదే అదునుగా భావించిన దొంగలు చోరీకి పాల్పడ్డారు. కాగా శుక్రవారం రాత్రి రమేష్ ఇంటికి రాగా తాళాలు పగులగొట్టి ఉన్నాయి. ఇంట్లోకి వెళ్లి చూడగా.. మంచం కింద కబోర్డులో ఉన్న 50 తులాల ఐదు బంగారు బిస్కెట్లు, బీరువాలో ఉన్న 18 తులాల బంగారు ఆభరణాలను ఎత్తుకెళ్లినట్లు గుర్తించి పోలీసులకు సమాచారమందించాడు. శనివారం సీఐ కృష్ణతో పాటు ఎస్ఐ క్లూస్టీంతో వచ్చి పరిశీలించారు. త్వరలోనే దొంగలను పట్టుకుంటామని తెలిపారు. తమ కూతుళ్ల పెళ్లిళ్ల కోసం దాచిన బంగారం చోరీకి గురైందని, కూతుళ్ల పెళ్లిళ్లు ఎలా చేయాలని రమేష్ వాపోయాడు.