Share News

ఇరుకు గదుల్లో మండల పరిషత్‌ కార్యాలయం

ABN , Publish Date - May 26 , 2024 | 11:33 PM

ఐదేళ్లుగా ఇబ్బందులు పడుతున్న వైనం

ఇరుకు గదుల్లో మండల పరిషత్‌ కార్యాలయం
రాయపోల్‌ మండల పరిషత్‌ కార్యాలయం

రాయపోల్‌, మే 26: గ్రామీణ ప్రాంతాల్లోని కార్యాలయాల్లో మండల పరిషత్‌ కార్యాలయం ప్రధానమైనది. ప్రజలకు అందించే పలు ప్రభుత్వ సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలు ఈ కార్యాలయాల ద్వారానే జరుగుతాయి. మండల పరిషత్‌ కార్యాలయాలకు వివిధ పనుల నిమిత్తం ప్రజాప్రతినిధులు, ప్రజలు తరచుగా వస్తుంటారు. అలాంటి కార్యాలయం ఇరుకు గదుల మధ్య నడుస్తుంటే ఎంతో ఇబ్బందికరంగా ఉంటున్నది.

ఐదేళ్లుగా ఎదురుచూపే

2017 అక్టోబర్‌ 11న రాయపోల్‌ కేంద్రంగా నూతన మండలం ఏర్పడింది. కానీ అప్పటి మండల పరిషత్‌ పాలకవర్గం కాల పరిమితి ముగిసిన తర్వాత 2019 జూలై 7న రాయపోల్‌ మండల పరిషత్‌ కార్యాలయం ఏర్పాటయింది. మండలంలో 19 గ్రామ పంచాయతీలు ఉండగా ఇందులో 8 మండల పరిషత్‌ ప్రాదేశిక నియోజకవర్గాలుగా విభజించి మండల పరిషత్‌ ఎన్నికలు నిర్వహించారు. రాయపోల్‌లో ప్రభుత్వ భవనాలు అందుబాటులో లేకపోవడంతో ఓ ప్రైవేటు భవనంలో తాత్కాలికంగా మండల పరిషత్‌ కార్యాలయాన్ని ఏర్పాటు చేశారు. అయిదేళ్ల నుంచి ఈ భవనంలోనే కార్యాలయం నడుస్తున్నది.

సర్వసభ్య సమావేశానికి ఇబ్బందులు

ప్రతి మూడు నెలలకు ఒకసారి జరిగే సర్వసభ్య సమావేశం కోసం కూడా అనువైన హాల్‌ లేకపోవడంతో ఓ గదిలో సమావేశాలు ఇబ్బందిగా నిర్వహిస్తున్నారు. ఈ గదిలోనే పలు సమావేశాలు కూడా జరుగుతున్నాయి. రాయపోల్‌లో మండల పరిషత్‌ నూతన కార్యాలయాన్ని నిర్మించాలని ప్రజలు, ప్రజాప్రతినిధులు కోరుతున్నారు.

Updated Date - May 26 , 2024 | 11:33 PM