ఆశల పల్లకిలో..
ABN , Publish Date - Mar 17 , 2024 | 11:17 PM
వరుస నోటిఫికేషన్లతో నిరుద్యోగుల్లో హర్షం ఉద్యోగాల కోసం ప్రిపేర్ అవుతున్న ఆశావాహులు జిల్లాలో సుమారు 2లక్షల మంది నిరుద్యోగులు కిటకిటలాడుతున్న స్టడీ సర్కిళ్లు, లైబ్రరీలు
సిద్దిపేట క్రైం, మార్చి 17: రాష్ట్ర ప్రభుత్వం వరుసగా ఉద్యోగాల నోటిఫికేషన్లు జారీ చేయడంతో నిరుద్యోగుల్లో ఆశలు చిగురించాయి. ఎలాగైనా ఉద్యోగం సాధించాలనే తపనతో పుస్తకాలతో కుస్తీ పడుతున్నారు. గ్రూప్-2, గ్రూప్-3, డీఎస్సీ, టెట్, హాస్టల్ వార్డెన్ నోటిఫికేషన్లు రావడంతో అర్హత కలిగిన అభ్యర్థులు పోటీ పరీక్షలకు సన్నద్ధమవుతున్నారు. జిల్లాలో డిగ్రీ, పీజీ, బీఈడీ, డీఈడీ పూర్తి చేసిన వారు సుమారు 2లక్షల మంది ఉన్నట్లు సమాచారం. వారంతా ప్రభుత్వ ఉద్యోగాల కోసం వేచి చూస్తున్నారు. జిల్లా నుంచి హైదరాబాద్లోని కోచింగ్ సెంటర్లకు వెళ్తున్నారు. కొందరు జిల్లాలోని స్టడీ సర్కిళ్లు, లైబ్రరీలను ఆశ్రయిస్తున్నారు.
జిల్లా కేంద్రంలో బీసీ, ఎస్సీ స్టడీ సర్కిళ్లు
సిద్దిపేట జిల్లా కేంద్రంలో పలు ప్రైవేటు కోచింగ్ సెంటర్లతోపాటు ప్రభుత్వ బీసీ, ఎస్సీ స్టడీ సర్కిళ్లను ఏర్పాటు చేశారు. పోటీ పరీక్షలకు సన్నద్ధమయ్యే అభ్యర్థులు ఈ స్టడీ సర్కిళ్లలో కోచింగ్ తీసుకుంటున్నారు. ఇక్కడ కోచింగ్ తీసుకునే వారికి ఉచిత భోజన సౌకర్యం కూడా ఉంటుంది.
జిల్లా గ్రంథాలయంలో పుస్తక సంపద
సిద్దిపేట జిల్లా కేంద్రంలోని గ్రంథాలయంలో పోటీ పరీక్షలకు సన్నద్ధమయ్యే అభ్యర్థుల కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. అవసరమైన పుస్తకాలను అందుబాటులో ఉంచారు. మహిళలకు, పురుషులకు ప్రత్యేకంగా రీడింగ్ రూమ్లను ఏర్పాటు చేశారు. ఈ గ్రంథాలయంలో 28వేల పుస్తకాలు ఉండగా వీటిలో ఐదు వేలకు పైగా పుస్తకాలు పోటీ పరీక్షలకు సంబంధించినవే. ఈ గ్రంథాలయంలో కాంపిటేటివ్ ఎగ్జామ్ హాల్ను అందుబాటులోకి తెచ్చారు. పోటీ పరీక్షల అభ్యర్థులకు ఓరియంటేషన్ తరగతులను కూడా నిర్వహిస్తుంటారు. ఉదయం 8నుంచి రాత్రి 12 గంటల వరకు అభ్యర్థులు ఈ లైబ్రరీలో చదువుతున్నారు.