Share News

చేపా.. చేపా ఎక్కడున్నవ్‌

ABN , Publish Date - May 23 , 2024 | 10:48 PM

చేపపిల్లల పంపిణీపై నీలినీడలు అలుముకున్నాయి. మత్య్సకారులను ఆర్థికంగా బలోపేతం చేసేందుకు గత ప్రభుత్వం చేప పిల్లల పంపిణీ పథకానికి శ్రీకారం చుట్టింది.

చేపా.. చేపా ఎక్కడున్నవ్‌

- జిల్లాలో చేపపిల్లల పంపిణీపై నీలినీడలు

- ఇంకా మొదలు కాని టెండర్ల ప్రకియ

- ఎన్నికల కోడ్‌తో తంటాలు

- ఆలస్యమైతే ఎదుగుదల కష్టమే!

- ఆందోళనలో మత్స్యకారులు

గజ్వేల్‌, మే 22: చేపపిల్లల పంపిణీపై నీలినీడలు అలుముకున్నాయి. మత్య్సకారులను ఆర్థికంగా బలోపేతం చేసేందుకు గత ప్రభుత్వం చేప పిల్లల పంపిణీ పథకానికి శ్రీకారం చుట్టింది. గత ఎన్నికల్లో ప్రభుత్వం మారడంతో ఇప్పటి వరకు చేపపిల్లల పంపిణీపై ఇప్పటివరకు స్పష్టత రాలేదు. దేశవ్యాప్తంగా ఎన్నికల కోడ్‌ ఉండడం, రాష్ట్రంలో పార్లమెంట్‌ ఎన్నికల నేపథ్యం.. ఏ పని చేయాలన్నా ఎలక్షన్‌ కమిషన్‌ అనుమతి తీసుకోవాల్సి ఉండడంతో ఈ విషయంపై కొత్తగా కొలువుదీరిన ప్రభుత్వం ఇంకా నిర్ణయం తీసుకోనట్లు తెలుస్తున్నది. అయితే, చేపల పంపిణీకి కాంగ్రెస్‌ ప్రభుత్వం ముందుకు వస్తుందా? లేదా? అన్న మీ మాంస సగటు మత్స్యకారుల్లో నెలకొన్నది.

జిల్లాలో ఇదీ పరిస్థితి

సిద్దిపేట జిల్లాలో 26 మండలాల పరిధిలో 369 మత్య్స సహకార సంఘాలు ఉన్నాయి. వాటిలో 24,600మంది మత్య్సకారులు ఉన్నారు. జిల్లాలోని రంగనాయకసాగర్‌, మల్లన్నసాగర్‌, కొండపోచమ్మ సాగర్‌ రిజర్వాయర్లతో పాటు చెరువులు, కుంటల్లో బొచ్చ, రవ్వ, బంగారు తీగలు, కొరమీను చేపపిల్లలను వదిలేవారు. గతేడాది 1,637 చెరువులు, కుంటల్లో జిల్లా వ్యాప్తంగా 4.28 కోట్ల చేప పిల్లలను వదిలారు. ప్రతిసారి ఏప్రిల్‌, మే లోనే టెండర్ల ప్రక్రియ పూర్తి చేసి వర్షాలు కురిసిన వెంటనే ఆగస్టు, సెప్టెంబర్‌లో చేపపిల్లలను వందశాతం సబ్సిడీపై మత్య్సకారులకు అందజేసేవారు. ఈ ఏడాది మే పూర్తికావస్తున్నా చేప పిల్లల పంపిణీపై ఎలాంటి ఆదేశాలూ రాకపోవడంతో మత్య్సకారుల్లో గందరగోళం నెలకొన్నది. ఆలస్యం చేస్తే చేపల ఎదుగుదలలో సైతం నష్టం వాటిల్లే అవకాశాలు ఉన్నాయని మత్య్సకారులు వాపోతున్నారు.

తక్షణమే టెండర్లు నిర్వహించాలి

- కొట్టాల యాదగిరి, ముదిరాజ్‌ సంఘం రాష్ట్ర నాయకుడు

ప్రభుత్వం ఉచిత చేపపిల్లల పంపిణీకి చర్యలు చేపట్టాలి. తక్షణమే టెండర్‌ ప్రక్రియ పూర్తి చేసి మత్య్సకారుల్లో నెలకొన్న సందిగ్ధతను తొలగించాలి. మత్య్సకారుల సంపద పెంపుపై కాంగ్రెస్‌ ప్రభుత్వం దృష్టి సారించాలి. ఇప్పటికే ఆలస్యమైన నేపథ్యంలో ప్రభుత్వం చేప పిల్లల పంపిణీపై వెంటనే ఈసీ అనుమతితో టెండర్లను నిర్వహించాలి.

Updated Date - May 23 , 2024 | 10:48 PM