Share News

కేంద్ర ప్రభుత్వ విధానాలను తిప్పికొట్టాలి

ABN , Publish Date - Jan 23 , 2024 | 11:40 PM

సీఐటీయూ జిల్లా అధ్యక్షుడు మల్లేశం

కేంద్ర ప్రభుత్వ విధానాలను తిప్పికొట్టాలి
చౌటకూర్‌ మండలం శివంపేట బీరు పరిశ్రమలో ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడుతున్న మల్లేశం

పుల్‌కల్‌, జనవరి 23: కేంద్ర ప్రభుత్వం అవలంభిస్తున్న కార్మిక, కర్షక వ్యతిరేక విధానాలను తిప్పికొట్టాలని సీఐటీయూ జిల్లా అధ్యక్షుడు బీరం మల్లేశం కార్మికులకు పిలుపునిచ్చారు. చౌటకూర్‌ మండలం శివంపేట గ్రామ శివారులోని బీరు పరిశ్రమలో మంగళవారం నిర్వహంచిన యూనియన్‌ సాధారణ సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రధాని మోదీ సారథ్యంలోని కేంద్ర ప్రభుత్వం కార్మికుల జీవితాలతో చెలగాటమాడుతున్నదని ధ్వజమెత్తారు. కార్మికుల హక్కులను కాలరాస్తూ పెట్టుబడిదారులు, కార్పొరేట్‌ వ్యవస్థకు పెద్దపీట వేస్తున్నారని ఆరోపించారు. పెండింగ్‌లో ఉన్న కార్మికుల సమస్యలను పరిష్కరించడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమయిందని విమర్శించారు. కేంద్రం అనుసరిస్తున్న కార్మిక, కర్షక వ్యతిరేక విధానాలను నిరసిస్తూ ఫిబ్రవరి 16న నిర్వహించనున్న అఖిల భారత సమ్మెను జయప్రదం చేయాలని కోరారు. ఈ సమ్మెలో అన్నీ వర్గాల ప్రజలు భాగస్వాములయ్యేలా కృషి చేయాలన్నారు. సమావేశంలో సీఐటీయూ జిల్లా ఉపాధ్యక్షుడు, యూనియన్‌ పరిశ్రమ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ బాగారెడ్డి, ప్రధాన కార్యదర్శి ప్రసన్నరావు, ఆఫీస్‌ బేరర్స్‌ పాల్గొన్నారు.

Updated Date - Jan 23 , 2024 | 11:40 PM