Share News

తెలంగాణలో 17 ఎంపీ స్థానాల్లో బీజేపీ గెలుపు

ABN , Publish Date - Mar 04 , 2024 | 11:01 PM

సంగారెడ్డి అర్బన్‌, మార్చి 4: తెలంగాణ రాష్ట్రంలో 17 ఎంపీ స్థానాల్లో బీజేపీ గెలుస్తుందని బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గుజ్జుల ప్రేమేందర్‌రెడ్డి పేర్కొన్నారు. సంగారెడ్డిలోని బీజేపీ జిల్లా కార్యాలయంలో కామారెడ్డి ఎమ్మెల్యే కాటిపల్లి వెంకటరమణారెడ్డితో కలిసి సోమవారం విలేకరుల సమావేశం నిర్వహించారు.

తెలంగాణలో 17 ఎంపీ స్థానాల్లో బీజేపీ గెలుపు
విలేకరుల సమావేశంలో మాట్లాడుతున్న బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గుజ్జుల ప్రేమేందర్‌రెడ్డి, ఎమ్మెల్యే వెంకటరమణారెడ్డి

కేసీఆర్‌ అవినీతిపై శిక్షించాలనే ఆలోచన కాంగ్రె్‌సకు లేదు

నేటి మోదీ సభ మంచి ప్రభావం చూపిస్తుంది

బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గుజ్జుల ప్రేమేందర్‌రెడ్డి

మూడోసారి మోదీ ప్రధాని కావడం ఖాయం

కామారెడ్డి ఎమ్మెల్యే కాటిపల్లి వెంకటరమణరెడ్డి

సంగారెడ్డి అర్బన్‌, మార్చి 4: తెలంగాణ రాష్ట్రంలో 17 ఎంపీ స్థానాల్లో బీజేపీ గెలుస్తుందని బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గుజ్జుల ప్రేమేందర్‌రెడ్డి పేర్కొన్నారు. సంగారెడ్డిలోని బీజేపీ జిల్లా కార్యాలయంలో కామారెడ్డి ఎమ్మెల్యే కాటిపల్లి వెంకటరమణారెడ్డితో కలిసి సోమవారం విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రేమేందర్‌రెడ్డి మాట్లాడుతూ నేడు పటాన్‌చెరులో జరగబోయే భారత్‌ విజయసంకల్ప సభ వచ్చే పార్లమెంట్‌ ఎన్నికల్లో మంచి ప్రభావం చూపిస్తుందని ధీమావ్యక్తం చేశారు. మెదక్‌, జహీరాబాద్‌ పార్లమెంట్‌ స్థానాలనూ బీజేపీ కైవసం చేసుకుంటుందన్నారు. అన్ని పార్లమెంట్‌ స్థానాల్లో మంచి మెజారిటీతో గెలవాలనే ప్రయత్నం చేస్తున్నామన్నారు. బీఆర్‌ఎస్‌ అవినీతి, అక్రమాలను బయటకు తీయడం మంచిదే అయినప్పటికీ అవినీతి, అక్రమాలపై కాంగ్రె్‌సకు శిక్షించాలనే ఆలోచనే లేదని పేర్కొన్నారు. కాళేశ్వరం, మేడిగడ్డపై ముందే ఎందుకు కమిటీ వేయలేదని సీఎం రేవంత్‌రెడ్డిని ప్రశ్నించారు. ఓట్ల కోసమే కమిటీల పేరిట డ్రామాలాడుతున్నారని విమర్శించారు. బీఆర్‌ఎస్‌ అవినీతిలో కూరుకుపోయిందని అందుకే అసెంబ్లీ ఎన్నికల్లో ప్రజలు ఇంటికి పంపారని ఆరోపించారు. బీఆర్‌ఎస్‌ నుంచి ఎవరొచ్చినా బీజేపీలోకి ఆహ్వానిస్తామని, తెలంగాణ అభివృద్ధికి ప్రజలు బీజేపీకి పట్టం కట్టాలని సూచించారు. తెలంగాణలో నలుగురు బీజేపీ ఎంపీలు ఉంటే తొమ్మిది లక్షల కోట్ల అభివృద్ధి జరిగిందని, అలాంటప్పుడు అన్నిస్థానాల్లో బీజేపీ గెలిపిస్తే ఇంకెంత అభివృద్ధి చెందుతుందో గ్రహించాలన్నారు. కామారెడ్డి ఎమ్మెల్యే కాటిపల్లి వెంకటరమణారెడ్డి మాట్లాడుతూ వచ్చే పార్లమెంట్‌ ఎన్నికల్లో బీజేపీని గెలిపించడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారని తెలిపారు. మూడోసారి మోదీ ప్రధాని కావడం, తద్వారా మరో ఐదేళ్లలో భారత్‌ అగ్రరాజ్యంగా ఎదగడం ఖాయమన్నారు. మోదీ సభకు లక్షకుపైగా జనసమీకరణ చేస్తున్నామని, ఉదయం 11.30 గంటలకు సభ ప్రారంభమౌతుందని, ప్రజలు తరలివచ్చి మోదీ సభను జయప్రదం చేయాలని ఆయన కోరారు. ఈ సమావేశంలో రాష్ట్ర నాయకులు గురువారెడ్డి, జయశ్రీ, జిల్లా ఉపాధ్యక్షుడు పులిమామిడి రాజు, జిల్లా అధికార ప్రతినిధి డా.రాజుగౌడ్‌, సంగమేశ్వర్‌, మాణిక్‌రావు, విష్ణువర్ధన్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Mar 04 , 2024 | 11:01 PM