గంజాయి చాక్లెట్ల కలకలం
ABN , Publish Date - Feb 01 , 2024 | 12:21 AM
చేర్యాలలో కళాశాల పక్కనున్న పాన్షాపులో విక్రయం 1,200 గంజాయి చాకెట్లు పట్టివేత విక్రయదారుడి అరెస్ట్, రిమాండ్కు తరలింపు
చేర్యాల, జనవరి 31: సిద్దిపేట జిల్లా చేర్యాల ఆర్టీసీ బస్టాండు, కళాశాల సమీపంలోని ఓ పాన్షా్ప నిర్వాహకుడు గుట్టుచప్పుడు కాకుండా గంజాయి విక్రయిస్తుండటం కలకలం రేపింది. సదరు షాపులో గంజాయి చాక్లెట్లను ఎక్సైజ్ అధికారులు బుధవారం పట్టుకుని నిర్వాహకుడిని అరెస్టు చేసి రిమాండుకు తరలించారు. ఎక్సైజ్ సీఐ మహేంద్రకుమార్ వివరాలను వెల్లడించారు. బీహార్కు చెందిన రాకేశ్కుమార్ కొంతకాలంగా ఆర్టీసీ బస్టాండు సమీపంలోని ఓ హోటల్ ఆవరణలో పాన్షాపును నిర్వహిస్తున్నాడు. బీహార్ నుంచి గంజాయి చాక్లెట్లు అతి తక్కువ ధరకు తీసుకొచ్చి స్థానికంగా పనులు చేసుకుంటున్న బీహార్ కూలీలు, ఇతరులకు విక్రయిస్తున్నాడు. ఒక్కో చాక్లెట్లో 13 శాతం గంజాయి ఉంటుంది. నమ్మదగిన సమాచారం రావడంతో బుధవారం పోలీసులు దాడులు చేపట్టగా 30 ప్యాకెట్లు పట్టుబడ్డాయి. ఒక్కో ప్యాకెట్లో 40 చాక్లెట్లు ఉండగా మొత్తం 6 కిలోల పరిమాణం గల 1200 చాక్లెట్లు స్వాధీనం చేసుకున్నామని సీఐ తెలిపారు. వీటి విలువ సుమారు రూ.90 వేలు ఉంటుందన్నారు. నిర్వాహకుడు రాకే్షపై కేసు నమోదు చేసి రిమాండ్కు పంపించినట్లు తెలిపారు. ఈ దాడుల్లో ఎక్సైజ్ ఎస్ఐలు వినోద్కుమార్, సురేశ్ పాల్గొన్నారు.
హత్నూరలో..
హత్నూర: సంగారెడ్డి జిల్లా హత్నూర మండలం మల్కాపూర్లో బుధవారం ఎండు గంజాయి, మత్తు చాక్లెట్లలను స్వాధీనం చేసుకున్నారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. బీహార్ రాష్ట్రానికి చెందిన ఓ కుటుంబం గత కొంత కాలంగా హత్నూర మండలం మల్కాపూర్ గ్రామ శివారులో గల ఓ వ్యవసాయ క్షేత్రంలో నివాసముంటున్నారు. సమీప ప్రాంతంలోని పరిశ్రమల్లో పని చేస్తున్న కార్మికులకు గంజాయి, మత్తు చాక్లెట్లు విక్రయిస్తున్నారు. ఈ మేరకు సమాచారం అందడంతో బుధవారం పోలీసులు దాడి చేసి, కిలోన్నర ఎండు గంజాయితో పాటు మత్తు పదార్థాలు కలిపి తయారు చేసిన చాక్లెట్లలను స్వాధీనం చేసుకున్నారు. గంజాయి విక్రయిస్తున్న వ్యక్తులను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్లు పోలీసులు తెలిపారు.