Share News

అలంపూర్‌ నియోజకవర్గ అభివృద్ధికి కృషి

ABN , Publish Date - Jun 07 , 2024 | 11:21 PM

కాంగ్రెస్‌ ప్రభుత్వ హయాంలో, ఎంపీ మల్లు సారథ్యంలో అలంపూర్‌ నియోజకవర్గాన్ని అన్ని విధాలా అభివృద్ధి చేస్తానని ఏఐసీసీ కార్యదర్శి సంపత్‌కుమార్‌ అన్నారు.

అలంపూర్‌ నియోజకవర్గ అభివృద్ధికి కృషి
ర్యాలీలో ప్రజలకు అభివాదం చేస్తున్న ఏఐసీసీ కార్యదర్శి సంపత్‌కుమార్‌,

- ఏఐసీసీ కార్యదర్శి సంపత్‌కుమార్‌

- శాంతినగర్‌లో కాంగ్రెస్‌ విజయోత్సవ ర్యాలీ

- అధిక సంఖ్యలో హాజరైన నాయకులు, కార్యకర్తలు

వడ్డేపల్లి, జూన్‌ 7 : కాంగ్రెస్‌ ప్రభుత్వ హయాంలో, ఎంపీ మల్లు సారథ్యంలో అలంపూర్‌ నియోజకవర్గాన్ని అన్ని విధాలా అభివృద్ధి చేస్తానని ఏఐసీసీ కార్యదర్శి సంపత్‌కుమార్‌ అన్నారు. గత పదేళ్ల బీఆర్‌ఎస్‌ పాలనలో అలంపూర్‌ ప్రాంతాన్ని అభివృద్ధి చేయలేదని, ప్రజల సమస్యలను పక్కకు పెట్టి అక్రమ దందాలతో నాయకులు కాలం వెళ్ల దీశారని ఆరోపించారు. పార్లమెంట్‌ ఎన్నికల్లో నాగర్‌ కర్నూల్‌ ఎంపీ అభ్యర్థి డాక్టర్‌ మల్లు రవి విజయాన్ని పురస్కరించుకుని కాంగ్రెస్‌ పార్టీ ఆధ్వర్యంలో శుక్ర వారం శాంతినగర్‌లో నిర్వహించిన భారీ ర్యాలీలో సంపత్‌కుమార్‌ పాల్గొన్నారు. పట్టణంలోని అమర వీరుల స్తూపం నుంచి అంబేడ్కర్‌ విగ్రహం వరకు ర్యాలీ కొనసాగింది. అనంతరం క్యాంపు కార్యాల యంలో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లా డారు. రైతులకు రెండు లక్షల రూపాయల రుణ మాఫీ అమలయ్యేలోపు ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి సహకారంతో మల్లమ్మకుంట రిజర్వాయర్‌పై జీవో తెస్తానన్నారు. వంద పడకల ప్రభుత్వాస్పత్రిని ప్రజ లకు అందుబాటులోకి తెస్తామని తెలిపారు. రాష్ట్రం విడిపోయిన తర్వాత రవాణాపరంగా ఈ ప్రాంతం చాలా వెనుకబడి ఉందన్నారు. నియోజకవర్గానికి నూతనంగా ఎనిమిది బస్సులు అందుబాటులోకి రానున్నాయని, త్వరలోనే మినీ బస్‌ డిపో ఏర్పాటుకు చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఇందిరమ్మ కమిటీల ద్వారా గ్రామాల్లో అర్హులైన లబ్ధిదారులను ఎంపిక చేసి కాంగ్రెస్‌ పార్టీ ఇచ్చిన హామీలను నెరవేర్చుతామన్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో తాను ఓడిపోయినప్పటికీ, పార్లమెంట్‌ ఎన్నికల్లో భారీ మెజారిటీ ఇచ్చిన అలంపూర్‌ ప్రజలకు పేరుపేరేనా ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. వచ్చేనెల 10వ తేదీలోగా వంద పడకల ఆసుపత్రిలో అన్ని సౌకర్యాలు కలిస్తామని, మల్లమ్మ కుంట రిజర్వాయర్‌తో పాటు పంచాయతీ రాజ్‌, ఆర్‌ అండ్‌ బీ రోడ్లకు నిధులు మంజూరు చేయిస్తామని తెలిపారు. రాబోయే స్థానిక ఎన్నికల్లో అలంపూర్‌ నియోజకవర్గంలోనే కాకుండా రాష్ట్రమంతటా కాంగ్రెస్‌ పార్టీ భారీ విజయం సాధిస్తుందని సంపత్‌ కుమార్‌ ధీమా వ్యక్తం చేశారు. కార్యక్రమంలో అలంపూర్‌ నియోజకవర్గంలోని ఏడు మండలాల పార్టీ అధ్యక్షులు, నాయకులు, కార్యకర్తలు, అభిమానులు అధికసంఖ్యలో పాల్గొన్నారు.

Updated Date - Jun 07 , 2024 | 11:21 PM