కల సాకారమయ్యేనా?
ABN , First Publish Date - 2024-02-06T22:36:01+05:30 IST
వనపర్తి, నాగర్కర్నూల్ ప్రజల చిరకాల కోరిక అయిన గద్వాల- డోర్నకల్ రైల్వేలైన్కు ఫైనల్ లొకేషన్ సర్వే పూర్తయ్యింది. కేంద్ర ప్రభుత్వం గత సంవత్సరం గద్వాల- మాచర్ల రైల్వేలైన్కు బదులుగా అలైన్మెంట్ మార్చి, గద్వాల- డోర్నకల్ రైల్వేలైన్ ఏర్పాటుకు ఫైనల్ లొకేషన్ సర్వే చేయాలని ఆదేశించింది. ఈ మేరకు సర్వే కోసం రూ.7.40 కోట్లు కేటాయించింది.
గద్వాల-డోర్నకల్ రైల్వే లైన్కు ఫైనల్ లొకేషన్ సర్వే పూర్తి
ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్లో నిధులు కేటాయించని కేంద్రం
కొత్త ప్రభుత్వం ఏర్పాటయ్యాక మంజూరవుతాయనే ఆశలు
పాత అలైన్మెంట్ను కూడా పూర్తి చేసేందుకు ప్రయత్నాలు
ఈ ప్రాంతంలో రైలు మార్గం వస్తే వ్యాపారపరంగా అభివృద్ధి
వనపర్తి, ఫిబ్రవరి 6(ఆంధ్రజ్యోతి): వనపర్తి, నాగర్కర్నూల్ ప్రజల చిరకాల కోరిక అయిన గద్వాల- డోర్నకల్ రైల్వేలైన్కు ఫైనల్ లొకేషన్ సర్వే పూర్తయ్యింది. కేంద్ర ప్రభుత్వం గత సంవత్సరం గద్వాల- మాచర్ల రైల్వేలైన్కు బదులుగా అలైన్మెంట్ మార్చి, గద్వాల- డోర్నకల్ రైల్వేలైన్ ఏర్పాటుకు ఫైనల్ లొకేషన్ సర్వే చేయాలని ఆదేశించింది. ఈ మేరకు సర్వే కోసం రూ.7.40 కోట్లు కేటాయించింది. ప్రస్తుతం ఆ సర్వే పూర్తికాగా, ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్లోనే నిధులు కేటాయిస్తారని ఆశించారు. కానీ ఆమోదం లభించలేదు. ప్రస్తుతం పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో ప్రవేశపెట్టిన బడ్జెట్ కావడంతో.. కొత్త ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత ఈ లైన్కు కేంద్రం నిధులు మంజూరు చేయాలనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఉమ్మడి పాలమూరు జిల్లాలో ఇప్పటికే రైల్వే లైన్ అందుబాటులో ఉంది. మహబూబ్నగర్, వనపర్తి, గద్వాల జిల్లాల మీదుగా ఈ లైన్ వెళ్తోంది. మొన్నటివరకు సింగిల్ లైన్గా, డీజిల్ లోకోమోటీవ్లు నడిచేలా ఉండగా.. దాన్ని మహబూబ్నగర్ వరకు డబుల్ లైన్ చేయడంతోపాటు ఎలక్ర్టిఫికేషన్ చేస్తున్నారు. ప్రస్తుతం ఆ పనులు ఇంకా కొనసాగుతున్నాయి. వనపర్తి జిల్లా మీదుగా రైల్వేలైన్ వెళ్తున్నప్పటికీ.. అది మదనాపూర్, ఆత్మకూరు మండలాలకే పరిమితంగా ఉంది. అక్కడ సాధారణ రైళ్లు మినహా అక్కడ ఎక్స్ప్రె్సలు ఆగే పరిస్థితి లేదు. పేరుకు వనపర్తి రోడ్ రైల్వేస్టేషన్గా నామకరణం చేసినప్పటికీ.. వనపర్తి జిల్లా కేంద్రానికి దాదాపు 20 కిలోమీటర్ల దూరంలో స్టేషన్ ఉంది. దాదాపు నాలుగు దశాబ్దాల నుంచి వనపర్తికి రైల్వేలైన్ సాధన కోసం ధర్నాలు, నిరసనలు చేపడుతున్నారు. మొదట రాయచూర్- మాచర్ల వరకు రైల్వేలైన్ వేయాలని ప్రతిపాదనలు చేశారు. 12 ఆగస్టు 2002 సంవత్సరంలో అప్పటి కేంద్రమంత్రి బండారు దత్తాత్రేయ చేతులమీదుగా రాయచూర్- గద్వాల వరకు రైల్వే లైన్కు శంకుస్థాపన చేశారు. ఆ లైన్ అందుబాటులోకి వచ్చి ఎలక్ర్టిఫికేషన్ కూడా పూర్తయ్యింది. ఆ తర్వాత ఉద్యమాలు జరిగినా గద్వాల నుంచి మాచర్ల వరకు రైల్వేలైన్కు ఆమోదం రాలేదు. గత సంవత్సరం అలైన్మెంట్ మార్చి.. కొత్త లైన్కు ఫైనల్ లొకేషన్ సర్వేకు ఆదేశించగా అది పూర్తయ్యింది.
పాత అలైన్మెంట్ కోసమూ ప్రయత్నాలు..
ప్రస్తుతం ఆమోదం తెలిపిన అలైన్మెంట్లో కల్వకుర్తి వరకు రైలుమార్గం ఏర్పాటువుతుందని ప్రతిపాదించినప్పటికీ.. కీలకమైన నల్లమల ప్రాంతంతోపాటు సిమెంట్ ప్యాక్టరీలు అధికంగా ఉన్న ప్రాంతానికి రైలుమార్గం ఏర్పాటు కావడం లేదు. ఈ నేపథ్యంలో ప్రస్తుత రాష్ట్ర ప్రభుత్వం కొత్త అలైన్మెంట్లో ఎలాగూ కల్వకుర్తి వరకు రైలుమార్గం ఏర్పాటు కానుండటంతో పాత అలైన్మెంట్ అంటే కల్వకుర్తి నుంచి వం గూరు మీదుగా మాచ ర్ల వరకు వెళ్లాల్సిన దూరాన్ని 126 కిలోమీటర్లుగా నిర్ణయించి.. ఆ మేరకు కనెక్టివిటీ ఏర్పాటు చేసేందుకు ప్రయత్నాలు చేస్తోంది. త్వరలో ఢిల్లీ వెళ్లనున్న సీఎం రేవంత్రెడ్డి పాత అలైన్మెంట్లో ఉండి, కొత్త అలైన్మెంట్ పరిధిలోకి రాని 126 కిలోమీటర్ల దూరానికి కూడా ఫైనల్ లొకేషన్ సర్వే పూర్తి చేసి నిధులు ఇవ్వాలని కేంద్ర రైల్వేశాఖ మంత్రి అశ్వినీవైష్ణవ్ను కోరనున్నట్లు తెలిసింది. ఈ మేరకు ప్రతిపాదనలు సిద్ధం చేయడానికి దక్షిణ మధ్య రైల్వే అధికారులతో కొద్దిరోజుల క్రితం భేటీ అయ్యారు. గతంలో ఈ రైల్వేలైన్ పూర్తి చేయడానికి కావాల్సిన నిధుల్లో 50 శాతం రాష్ట్ర ప్రభుత్వం భరిస్తుందని అప్పటి సీఎం కేసీఆర్ ప్రకటన చేశారు. కానీ ఆ పనులు ముందుకు సాగలేదు. ప్రస్తుతం రైల్వేలైన్ నిర్మాణానికి కావాల్సిన రూ.5,330 కోట్ల ఖర్చును 100 శాతం కేంద్ర ప్రభుత్వమే భరించనుంది. గతంలో 51 శాతం కేంద్రం, 49 శాతం రాష్ట్రం భరించాలనే నిబంధన ఉన్నప్పటికీ.. ఇప్పుడా పరిస్థితి లేదు. ఒక్క భూసేకరణ మాత్రమే రాష్ట్ర ప్రభుత్వం చేయించాల్సి ఉంటుంది. ఈ రెండు అలైన్మెంట్లకు సంబంధించి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రస్తుతం సానుకూలంగానే ఉండగా.. వచ్చే బడ్జెట్లో నిధులు కేటాయిస్తారా? లేక ఇంకొన్నాళ్లు ఎదురుచూడాల్సి వస్తుం దా? అనేది తేలాల్సి ఉంది. గద్వాల- మాచర్ల రైల్వేలైన్ను ప్రతిపాదించిన మొదట్లో పీపీపీ(పబ్లిక్ ప్రైవేటు పార్టిసిపేషన్) పద్ధతిలో సు మారు రూ.1,000 కోట్లు అవుతాయని అంచనా వేయగా.. ప్రస్తుతం అలైన్మెంట్ మార్చాక రూ.5,330 కోట్లకు వెళ్లింది. ఇంకా ఆలస్యం చేస్తే నిధుల ఖర్చు తడిసిమోపెడవుతుందనే అభి ప్రాయం వ్యక్తమవుతోంది.
కొత్త అలైన్మెంట్ ఇదే..
కొత్త అలైన్మెంట్ ఇదే..రాయచూర్ నుంచి గద్వాల జంక్షన్ వరకు రైల్వేలైన్ పనులు పూర్తికాగా.. ప్రస్తుతం రైళ్లు నడుస్తున్నాయి. గద్వాల నుంచి ఆరేపల్లి వరకు 7.8 కిలో మీటర్ల మేర ప్రస్తుతం లైన్ ఉంది. కొత్త అలైన్మెంట్ ప్రకారం అక్కడి నుంచి భత్కూరు, కడుకుంట్ల, వనపర్తి, గోపాల్పేట, నాగర్కర్నూల్, కల్వకుర్తి, నాంపల్లి, నల్గొండ, భీమవరం, సూర్యాపేట, మోతె, పాలేరు, కుసుమంచి మీదుగా డోర్నకల్ వరకు వెళ్తుంది. మొత్తం 296 కిలోమీటర్ల మేర రైలు మార్గం నిర్మించాల్సి వస్తుందని, ఇందుకు రూ.5,330 కోట్ల అంచనా వ్యయం అవుతుందని ప్రతిపాదించారు. దీనివల్ల పారిశ్రామికంగా అత్యంత వెనుకబాటులో ఉన్న వనపర్తి, నాగర్కర్నూల్ జిల్లాలు అభివృద్ధి అవుతాయి. నల్గొండ, ఖమ్మం, వరంగల్ జిల్లాలకు రైలుమార్గం ఏర్పడి.. దూరభారం తగ్గడంతోపాటు దేశంలోని వివిధ ప్రాంతాలకు సులభంగా రైలులో ప్రయాణం చేసే అవకాశం లభిస్తుంది. పాత అలైన్మెంట్ ప్రకారమైతే.. ఆరేపల్లి నుంచి కడుకుంట్ల, వనపర్తి, గోపాల్పేట, సల్కార్పేట, నాగర్కర్నూల్, ఇంద్రకల్లు, తోటపల్లి, కల్వకుర్తి, వంగూరు, కందుకూరు, దేవరకొండ, మల్లేపల్లి, పెద్ద అడిశర్లపల్లి, చలకుర్తి, తిరుమలగిరి, నెల్లికల్, విజయపూరి, కొత్తూరు మీదుగా కృష్ణానదిని దాటుకుని పాత గుంటూరు జిల్లా.. ప్రస్తుతం పాల్నాడు జిల్లా పరిధిలోని మాచర్లకు చేరుకోవాలి. ఆ ప్రాంతంలో సిమెంట్ ఫ్యాక్టరీలు ఎక్కువగా ఉండటంతో రవాణా సులభతరం అవుతుందని అంచనా వేశారు. కానీ కొత్త అలైన్మెంట్కు కేంద్ర ప్రభుత్వం పచ్చజెండా ఊపడంతో ఉమ్మడి జిల్లాలో పాత అలైన్మెంట్లో ఉన్న కల్వకుర్తి వరకు రైలుమార్గం నిర్మాణం జరుగుతుంది. అక్కడి నుంచి వంగూరువైపు కాకుండా నాంపల్లి మీదుగా నల్గొండకు కొత్త అలైన్మెంట్ ఫైనల్ లొకేషన్ సర్వే పూర్తి చేశారు.